• facebook
  • whatsapp
  • telegram

స్త్రీ సాధికారతే చుక్కాని

మహిళా భాగస్వామ్యంతోనే ప్రగతి తీరాలకు...

గృహసీమ నుంచి గగనతలం దాకా అన్ని రంగాల్లోనూ- ఎంతో కృషి, పట్టుదల, ఓర్పు, నేర్పులతో మున్ముందుకు సాగిపోతోంది నేటి మహిళ. దేశ జనాభాలో స్త్రీలు 48.5శాతం మేర ఉన్నారు. కానీ వస్తూత్పత్తి, సేవల రంగాల్లో వారి భాగస్వామ్యం మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో లేదు. మహిళల శ్రామిక, ఉద్యోగ శక్తి చైనాలో 70శాతం; ఇండియాలో అది 24శాతమే. ప్రతి ముగ్గురు భారతీయ మహిళల్లో ఇద్దరు ఏ విధమైన వృత్తి ఉద్యోగాలూ చేయడం లేదని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. మహిళాశక్తి నిరుపయోగంగా మారడం దేశ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతంలాంటిది. మహిళల ఆర్థిక సాధికారత- పేదరికం తగ్గింపుతో ముడివడి ఉంది. కుటుంబంలోని మహిళా సభ్యుల ఆదాయంలో పెరుగుదల వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది.

అక్షరాస్యత పెంపొందాలి

దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు మహిళల భాగస్వామ్యం అవసరం. స్త్రీలు అందరూ వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే- సంపన్న సమాజం ఆవిష్కృతమవుతుంది. ప్రపంచ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో ఇండియా మహిళా భాగస్వామ్యంలో 145 దేశాల్లో 139వ స్థానంలో ఉంది. మహిళలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించి సమగ్ర అభివృద్ధికి పాటుపడాలి. విధాన రూపకల్పన, పాలనా ప్రక్రియలో స్త్రీల భాగస్వామ్యం ద్వారా సమగ్ర వృద్ధిని సాధించవచ్చు. సుస్థిర అభివృద్ధికి అవసరమైన ఆర్థిక, సామాజిక మార్పులు సాధించడానికి గ్రామీణ మహిళాశక్తి కీలకం. దేశంలో మహిళలు అనాదిగా దుర్విచక్షణ ఎదుర్కొంటున్నారు. గ్రామీణ మహిళల్లో అక్షరాస్యత పెంపొందించాల్సిన అవసరం ఉంది. మహిళా సాధికారతకు అక్షరాస్యత కీలమైన ఆయుధం వంటిది. ఉన్నత విద్య, వృత్తిపరమైన నైపుణ్యాల్లోనూ స్త్రీలు వెనకంజలో ఉన్నారు. భారతదేశంలో కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో మహిళలదే ముఖ్య భూమిక. దేశంలోని మొత్తం మహిళా శ్రామికుల్లో 69శాతం వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. పంటల ప్రణాళిక, సాగులో మాత్రమే కాకుండా ఉద్యానవనం, ప్రాథమిక ఆహార శుద్ధి, పశువుల పెంపకం, మత్స్య, కుటీర పరిశ్రమల వంటి కార్యకలాపాల్లోనూ గ్రామీణ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. విత్తనాల ఎంపిక నుంచి పంట కోత, మార్కెటింగ్‌ వరకు అన్ని ప్రక్రియల్లోనూ పాల్గొంటున్నారు. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు పాడిపరిశ్రమ, పశుసంవర్ధకం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే ఆర్థికాభివృద్ధి పరుగులెత్తుతుంది.

దేశవ్యాప్తంగా పోషకాహార లోపాలు మహిళల అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యాయి. వారి ఆరోగ్య సంరక్షణకు అనేక పథకాలున్నా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ పథకాల ఫలితాలు అందడంలేదన్నది వాస్తవం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని నిధులు అందించడంతో పాటు, పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి. మహిళా సంఘాలకు మూలధన ప్రవాహంతో పాటు, రుణ సదుపాయాన్ని అధికంగా కల్పించి, వారి అభ్యున్నతికి పాటుపడాలి. పేద గ్రామీణ మహిళలకు నైపుణ్యాలు, మార్కెట్లు, వ్యాపారాభివృద్ధిలో అవకాశాలు కల్పించాలి. మహిళల్లో ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచడానికి, నిరుద్యోగ యువతులకు కావలసిన నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. మహిళా వ్యాపారాభివృద్ధికి కావలసిన సబ్సిడీ రుణాలు, వ్యవస్థాపకులకు కావలసిన సలహాలివ్వడం, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన వంటి వాటిపై దృష్టి సారించి, ఆర్థిక నిర్వహణను మెరుగుపరచాలి. వివాహంవల్ల, కుటుంబ అవసరాల రీత్యా ఉద్యోగాలకు దూరం అవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించాలి.

నైపుణ్యాలకు పదును

నగరాల్లో మహిళల కోసం ఆధునిక వసతి సదుపాయాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తే మెరుగ్గా రాణించి, స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. పారిశ్రామిక రంగంలో స్త్రీలకు అవకాశాల్ని అందించి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించాలి. అధిక శాతం మహిళలు అసంఘటిత రంగంలో పని చేస్తున్నందువల్ల ఆర్థిక, సామాజిక భద్రతతో పాటు, హక్కులనూ కల్పించాలి. స్త్రీలకు ఆర్థిక అవకాశాలు, సామాజిక సమానత్వంతో పాటు అన్ని రకాల హక్కులనూ వినియోగించుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇందుకోసం సమాజంలో మహిళల అణచివేత చర్యలను నివారించాలి. దాడులు, అత్యాచారాల నుంచి వారికి రక్షణ కల్పించాలి. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి అభివృద్ధి పరుస్తూ- మహిళా శక్తిని సక్రమంగా వినియోగించాలి. ఆర్థికంగా కార్యాలయాల్లో, గృహాల్ల్లో, సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలి. ఆధునిక వ్యాపార కార్యకలాపాలకు సామాజిక వేదికలను ఉపయోగిస్తున్న తరుణంలో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచాలి. నూతన సాంకేతికత, నైపుణ్యాలతో తగిన శిక్షణ ఇచ్చి, మేలిమి వనరులుగా మారిస్తే మహిళా శక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా మహిళా సాధికారతతో పాటు కుటుంబం, సమాజం, దేశం ఆర్థికాభివృద్ధిలో పురోగమిస్తాయి. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తే, ఆర్థికాభివృద్ధిలో అతివల భాగస్వామ్యంతో దేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది. 

- ఎ.శ్యామ్‌ కుమార్‌
 

Posted Date: 12-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం