• facebook
  • whatsapp
  • telegram

ఉపాధి కల్పవృక్షాలు

చిన్నపరిశ్రమలకు ఊతమిస్తేనే పురోగమనం

సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు పరిమిత పెట్టుబడులతో ఉత్పత్తి, ఉపాధి కల్పన చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఆరు కోట్ల 30 లక్షలకు పైబడిన లఘు పరిశ్రమలు ప్రత్యక్షంగా ఎనిమిది కోట్లు, పరోక్షంగా పన్నెండు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 90శాతం పరిశ్రమలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. భారత కార్మిక శక్తిలో 40శాతం ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధి పొందుతోంది. సుమారు ఎనిమిది వేల రకాల వస్తువులను ఈ రంగమే తయారు చేస్తోంది. యువతకు ఉపాధి కల్పించాలంటే ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి తప్పనిసరి. మనుగడకోసం పోరు సాగిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కొవిడ్‌ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీసింది. దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి, గ్రామీణాభివృద్ధికి ఎంఎస్‌ఎంఈలు కీలకమైనవి కావడంతో- ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ కింద ఉపశమన చర్యలను చేపట్టింది. ప్రత్యేక ప్యాకేజీ అమలవుతున్న విధానాన్ని సమీక్షించి, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

ప్రభుత్వాలదే బాధ్యత

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు భారత స్థూల దేశీయోత్పత్తిలో 30శాతం, దేశ పారిశ్రామిక ఉత్పాదనలో 45శాతం, ఎగుమతుల్లో 40శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు స్థానిక ప్రపంచ మార్కెట్‌లో గొలుసుకట్టు అవసరాలను తీర్చడానికి భిన్నమైన ఉత్పత్తులతో విస్తరించాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 2006లోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం రూపొందినా- మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవవనరుల కొరత; సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంవంటి సమస్యలు ఎంఎస్‌ఎంఈల పురోగతికి సవాలుగా మారాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలువంటి కష్టాలకు కొవిడ్‌ సంక్షోభం తోడు కావడంతో ఈ పరిశ్రమలు నష్టాల ఊబిలోకి జారుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే- సాయం చేయడానికి 2017లో ‘సమాధాన్‌’ పోర్టల్‌ ప్రారంభించారు. అంకుర సంస్థలకు రుణాలు సకాలంలో అందించడానికి చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ద్వారా నిధిని ఏర్పాటు చేశారు. పెట్టుబడుల పరిమితిని పెంచారు. ఉత్పత్తి, సేవా రంగాల మధ్య వ్యత్యాసం తొలగించారు. ముద్ర బ్యాంక్‌తో రుణ సదుపాయం అందిస్తున్నారు. వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం ఎలెక్ట్రానిక్‌ డిస్కౌంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంప్రదాయ లఘు పరిశ్రమల పునరుద్ధరణ, అభివృద్ధికి సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (స్ఫూర్తి) అమలు చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం అందించిన కొవిడ్‌ నష్ట నివారణ ప్రత్యేక ప్యాకేజీతో లఘు పరిశ్రమలు ఆర్థికాభివృద్ధి బాటపట్టలేదని మూడీస్‌ సంస్థ విశ్లేషించింది. లఘు పరిశ్రమల పునరుజ్జీవనానికి కనీసం మూడేళ్ల పాటు అన్ని రకాల నిబంధనలూ మినహాయించాలన్న భారత పరిశ్రమల సమాఖ్య సిఫార్సును సత్వరం అమలు పరచాలి

చైనాలో సుమారు ఎనభై లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 80శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారాయి. జర్మనీలో నిరుద్యోగం తక్కువగా ఉండటానికి ఎంఎస్‌ఎంఈలే ప్రధాన కారణం. వాటికి ప్రభుత్వ మద్దతు లభిస్తుండటంతో మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. అమెరికా, జపాన్‌, సింగపూర్‌, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో లఘు సంస్థలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ధీమాగా పురోగమిస్తున్నాయి. ఆయా దేశాల విధి, విధానాలను అధ్యయనం చేయాలి. దేశంలోని శ్రామికులందరికీ ప్రభుత్వం ఉపాధిని అందించలేదు కాబట్టి వ్యవస్థాపకులను, ఎంఎస్‌ఎంఈల ప్రగతికి నవకల్పనలను ప్రోత్సహించాలి. చైనా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి అనువైన వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు ఎటువంటి హామీలూ లేకుండా ఇరవై లక్షల రూపాయల వరకు రుణాలు అందించాలని యూకే సిన్హా కమిటీ చేసిన సిఫార్సును అమలుచేయాలి.

గ్రామీణాభివృద్ధికి బాటలు

సున్నితమైన జాతీయ వారసత్వ సంపదకు ప్రతీకలైన ఖాదీ, పీచు, గ్రామీణ పరిశ్రమలను విస్తరించాలి. తద్వారా నాణ్యమైన, హానికరం కాని, పర్యావరణహితమైన వస్తువులను వాడే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవారంగ పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి పాటుపడాలి. మెరుగైన ఆహారపదార్థాల నిర్వహణ, వాడకం కోసం ఆహార శుద్ధి యూనిట్లను నెలకొల్పాలి. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో... రోగ నిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాల ఉత్పత్తి, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధికి స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రాధాన్యమివ్వాలి. తొలుత జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి, క్రమేపీ స్థానిక ప్రాధాన్యతల రీత్యా విస్తరింపజేయాలి. యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి. ఎంఎస్‌ఎంఈలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా సమగ్ర ప్రణాళికను రూపొందించి, బలోపేతం చేయాలి. తద్వారా పట్టణాలపై భారం తగ్గి, గ్రామీణాభివృద్ధికి బాటలు పడతాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అందించే ఆసరా దేశార్థికానికి భరోసా ఇస్తుంది. ఎగుమతులు, ‘భారత్‌లో తయారీ’ వంటివి వృద్ధి చెంది సత్వరాభివృద్ధి సాధనకు మార్గం సుగమమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

Posted Date: 17-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం