• facebook
  • whatsapp
  • telegram

వలస కూలీలకు ఏదీ భరోసా?

వరస లాక్‌డౌన్లతో కునారిల్లుతున్న వైనం

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతవల్ల ఆర్థికంగా ఆయువుపట్టు వంటి రాష్ట్రాలు, నగరాల్లో- పదేపదే లాక్‌డౌన్‌లు విధించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. ఇది స్థానిక పేదలకు, వలస కూలీలకు గొడ్డలిపెట్టులా పరిణమిస్తోంది. వలస కూలీలు, యువత ఉపాధి కోల్పోయి అగచాట్ల పాలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయినవారిలో 9.9శాతం కార్మికులకు ఉద్యోగాలు తిరిగిరాలేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. పోషకాహార లోపం అత్యధికులను వెన్నాడుతోంది.

సగంమందికే అందుతున్న సాయం

నిరుటి లాక్‌డౌన్‌ నుంచి తేరుకుంటున్న సమయంలో కరోనా రెండోదశతో దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలు వలస కార్మికులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. వారంతా మళ్ళీ స్వస్థలాలకు ప్రయాణం కట్టడంతో పరిశ్రమలు, వ్యాపారాలకు సిబ్బంది కొరత ఏర్పడింది. ఒక్క దిల్లీ నుంచే 60-70శాతం కార్మికులు, చిరుద్యోగులు స్వరాష్ట్రాలకు తిరిగివెళ్లిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్‌లలో పరిశ్రమలకు, పంజాబ్‌లో పంట పొలాలకు కూలీల కొరత నెలకొంది. ఇక్కడి నుంచి నిరుడు స్వస్థలాలకు వెళ్లిన కూలీలు వెనక్కి రాలేదు. దాంతో ఈ ఏడాది గోధుమ సేకరణ కాలంలో 40 శాతం కూలీలకు కొరత ఏర్పడింది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో రైతుల ఆందోళనకు ఇదీ ముఖ్యకారణమే. వలస కూలీలు ప్రధానంగా    పశ్చిమ్‌ బంగ, ఒడిశా, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల నుంచి దిల్లీ, ముంబయి వంటి ఉత్తర భారత నగరాలకు పనుల కోసం వెళ్తుంటారు. దక్షిణాన చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరులకూ వలస కూలీల ప్రవాహం ఎక్కువే. రెండో లాక్‌డౌన్‌ వల్ల వీరంతా స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నందువల్ల అక్కడ కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో కరోనా పరీక్షలూ జరగాల్సిన స్థాయిలో జరగడం లేదు. ఈ విషమ స్థితిలో ప్రభుత్వాలు ఆర్థికంగా, ఇతరత్రా సహాయం అందిస్తున్నా, అది వలస కూలీల్లో సగంమందికి మాత్రమే సరిపోతోంది. కొవిడ్‌ కల్లోలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం, రాష్ట్రాలు పకడ్బందీ సామాజిక భద్రతా చట్రాన్ని ఏర్పరచడానికి నడుంకట్టాలి. 2021 చివరివరకు పేదలు, వలస కూలీలకు నగదు బదిలీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల పెంపు, ఆశా, అంగన్‌ వాడీ కార్యకర్తలకు కొవిడ్‌ కాల భృతి ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు ఉచిత రేషన్‌ అందించాలి.

కేంద్ర ప్రభుత్వం 1979లోనే అంతర్రాష్ట్ర వలస కూలీల చట్టం తెచ్చినా అది సమర్థంగా అమలు కావడం లేదు. మొదటి దశ కొవిడ్‌ విజృంభణలో పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు వలస కూలీల వెతలను కళ్లకు కట్టినట్లు వర్ణించేవరకు వారి సాధకబాధకాలను ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, పరోపకార పరాయణులు ముందుకువచ్చి కూలీలకు అన్నపానాదులు ఏర్పాటు చేయడంతో సమస్య తీవ్రత కాస్త తగ్గింది. చివరికి ప్రభుత్వం దిగివచ్చి వలస కూలీలు స్వరాష్ట్రాలకు చేరేందుకు రవాణా సదుపాయాలు కల్పించింది. రెండోదశ విజృంభణలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కొరవడింది. దిల్లీ ప్రభుత్వం నిర్మాణ రంగంలో అధికారికంగా నమోదైన వలస కార్మికులకు ప్రతినెలా అయిదు వేల రూపాయల చొప్పున నగదు సహాయం అందించడం గమనార్హం. వారు స్వస్థలాలకు తిరిగివెళ్లిపోకుండా ఆపడానికి ఆ సాయం తోడ్పడుతుంది. వలస కూలీల సంక్షేమ కార్యక్రమాల అమలులో కేరళ దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా 2010లో ‘అంతర్రాష్ట్ర వలస కూలీ సంక్షేమ పథకం’ తెచ్చింది. ఇంతవరకు నాలుగు లక్షల మంది వలస కూలీలను రిజిస్టర్‌ చేశారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆస్పత్రుల్లో ప్రతి వలస కార్మికుడికి రూ.25,000 వరకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా కార్మికుడు మరణిస్తే అతడి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తోంది. రాష్ట్రాలతో కలిసి దేశమంతటా ఈ తరహా విధానాల్ని అమలుచేయడానికి కేంద్రం ముందుకురావాలి.

సామాజిక భద్రత అవసరం

మొదటి దశ కొవిడ్‌ విజృంభణలో దాదాపు 1.14 కోట్లమంది వలస కూలీలు నగరాలు వదిలి గ్రామాలకు వెళ్లిపోయారు. తరవాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొన్నప్పటికీ- వలస కూలీల కొరత ఏర్పడింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించ లేకపోవడానికి కారణమిదే. వలస కూలీలు ఇళ్లకు తిరిగి వెళ్లే అవసరం లేకుండా వారికి ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు అందించాలి. పని పరిస్థితులు, సామాజిక భద్రత విషయంలో అసంఘటిత రంగ కార్మికులకు ఉన్న చట్టపరమైన రక్షణలను వలస కూలీలకూ వర్తింపజేయాలి. వీరికి కనీస కార్మిక హక్కులు కల్పించాలని చట్టం నిర్దేశిస్తున్నా దాన్ని ఎవరూ అనుసరించడం లేదు. ఈ లొసుగులను సరిదిద్దడానికి తగు చర్యలు తీసుకోవాలి. వలస కూలీలను ఒకే తరగతి కింద వర్గీకరించాలి. దీనికోసం కార్మిక కోడ్‌, సామాజిక భద్రతా స్మృతి కింద కార్మికులకు ఇచ్చిన నిర్వచనాలను సవరించాలి. ఒక సంస్థ నేరుగా కాకుండా కాంట్రాక్టర్ల ద్వారా వలస కూలీలను నియోగిస్తుండవచ్చు. ఇకనుంచి అలాంటి సంస్థలనూ వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా చట్టం చేయాలి. ఈ- కామర్స్‌ సంస్థలకూ ఇలాంటి నిబంధనలను వర్తింపజేయాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగ పరిశ్రమలు తాము నియోగించే వలస కూలీలకూ సామాజిక భద్రత కల్పించాలి. పని స్థలాల్లో బస, ప్రాథమిక ఆరోగ్య సేవలు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛను, కనీస వేతనాలు అందేలా చూడటం ప్రభుత్వ విధి. మహిళా కూలీలకు ప్రాథమిక విద్య, నైపుణ్య శిక్షణ అందించాలి. పొదుపు ఖాతాలను తెరిపించి, వాటి నిర్వహణపై అవగాహన పెంచడం కీలకం. వలస కూలీల సంక్షేమానికి బహుముఖంగా చర్యలు తీసుకోవడం యావత్‌ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది.

సుప్రీం జోక్యంతో కదలిక

మొదటి దశ కొవిడ్‌ విజృంభణలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయినప్పుడు మహిళలు, రైతులకు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేసింది. పేద లబ్ధిదారులకు నెలకు అయిదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా అందించింది. అయితే ఈ సాయం అందరికీ అందలేదు. దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వలస కూలీలకు ఆహారం, కిరాణా సరకులు, రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. కొవిడ్‌ రెండోదశ విజృంభణలోనూ ప్రభుత్వాల అల సత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు తప్పుపట్టింది. ‘ఆత్మనిర్భర్‌’ వలస కూలీలకు చేరుతోందా అంటూ ప్రశ్నించింది. వలస కూలీల నమోదు ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులందరినీ నమోదు చేసి ఈ కష్టకాలంలో వారికి అండగా నిలవాలని ఆదేశించింది. కొవిడ్‌ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న చిన్నా రులను గుర్తించి,  తక్షణమే ఆదుకోవాలని సూచించింది. దానితో ప్రభుత్వాల్లో కదలిక వచ్చి, ఆ మేరకు చర్యలు ప్రారంభించాయి.

- సౌమ్య
 

Posted Date: 01-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం