• facebook
  • whatsapp
  • telegram

పౌర హక్కులకు రాజ్యాంగరక్ష

సుప్రీంకోర్టు చురుకైన పాత్ర

పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సర్వదా కట్టుబడి ఉన్నట్టు ఇటీవలి తీర్పులతో భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది. ఫలితంగా చట్టాలను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలు రాష్ట్రాలు, పోలీసు యంత్రాంగాలకు అందాయి. విమర్శకుల గొంతును నొక్కేందుకు, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించలేవు. గడచిన కొద్ది వారాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, బహిరంగ వేదికలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఇతర న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే- హక్కులను కాపుగాయడంలో న్యాయపాలిక క్రియాశీల పాత్ర తేటతెల్లమవుతుంది.

కీలక తీర్పులు

కరోనా విజృంభణ వేళ వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు మద్దతు ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం కుండ బద్దలుకొట్టింది. పద్ధతులు మార్చుకోకపోతే సహించేది లేదని పలు హైకోర్టులు సైతం ఆయా రాష్ట్రాలకు సంకేతాలిచ్చాయి. మణిపూర్‌ రాజకీయ కార్యకర్త అరెస్టు, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ కన్వర్‌(కావడ్‌) యాత్ర, బక్రీద్‌ సమయంలో ఆంక్షలు సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గోమూత్రం, పేడలతో కరోనా నయమవుతుందన్న నేతల వ్యాఖ్యలపై మణిపూర్‌కు చెందిన ఎరిండ్రో లీచోంబమ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలు చేశారు. వైజ్ఞానిక శాస్త్రం, ఇంగిత జ్ఞానాలే కరోనా నుంచి కాపాడతాయని హితవు పలికారు. ఆయనపై మణిపూర్‌ పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద నేరం మోపి రెండు నెలల పాటు జైలుపాలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎమ్‌.ఆర్‌. షా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం, లీచోంబమ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. కరోనా వేళ కన్వర్‌ యాత్ర నిర్వహణ అంశాన్ని న్యాయస్థానం సు మోటోగా స్వీకరించింది. యాత్రలో భాగంగా ఉత్తరభారతం నలుమూలల నుంచి నుంచి లక్షలాది ప్రజలు హరిద్వార్‌కు వెళ్తారు. గంగా నదీ జలాలను కుండల్లో నింపుకొని సొంత గ్రామాలకు వెళ్ళి శివాలయాల్లో అభిషేకం చేయడంతో యాత్ర ముగుస్తుంది. కరోనా కారణంగా నిరుడు ఈ యాత్రను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఏడాది మాత్రం యాత్రను నిర్వహించాలని ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రజారోగ్యం విషయంలో రాజీపడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపివ్వడంతో ఉత్తరాఖండ్‌ వెనక్కి తగ్గింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ మాత్రం మొండికేసింది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. యాత్రను నిర్వహించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని జస్టిస్‌  ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రజారోగ్యం, జీవించే హక్కు అన్నింటికంటే ప్రధానమైనవని, మనోభావాల కంటే ఈ ప్రాథమిక హక్కులే ముఖ్యమని విచారణలో భాగంగా వ్యాఖ్యానించింది. ఆ వెంటనే ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం యాత్రను రద్దు చేసింది. ఆ తరవాత కేరళ సర్కారు నుంచి కొత్త సమస్య ఎదురైంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, బక్రీద్‌ వేళ ఆంక్షల సడలింపునకు ఆ రాష్ట్రం ఉపక్రమించింది. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కన్వర్‌ యాత్ర వ్యవహారంలో జారీ చేసిన ఆదేశాలను ఇక్కడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సడలింపులతో కరోనా వ్యాప్తి అధికమైతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

చట్టాలు న్యాయబద్ధం కావాలి

అమెరికా బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో- ప్రజల ప్రాథమిక హక్కుల సంరక్షణలో సుప్రీంకోర్టు పాత్రను జస్టిస్‌ చంద్రచూడ్‌ విశదీకరించారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం, ఇతర శాసనాలను దుర్వినియోగం చేసి ప్రజలను హింసించకూడదని అభిప్రాయపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసేందుకు శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రయత్నిస్తే- దాన్ని అడ్డుకునే బాధ్యత న్యాయస్థానంపైనే ఉందన్నారు. మరోవైపు పీడీ దేశాయ్‌ స్మారకోపన్యాస సందర్భంలో సీజేఐ ఎన్‌.వి. రమణ చట్టబద్ధమైన పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టంలో న్యాయం, సమానత్వం ఇమిడి ఉండకపోతే దాన్ని అసలు చట్టంగానే పరిగణించకూడదన్న న్యాయకోవిదుల మాటలను గుర్తుచేశారు. శాసనాలకు సహజసిద్ధమైన నైతిక సక్రమత- అన్యాయ చట్టాలకు ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు రూపొందించే ఏ చట్టమైనా కొన్ని ఆదర్శాలు, న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని, అటువంటి చట్టాల వెలుగులో పాలన సాగినప్పుడే అది ‘చట్టబద్ధమైన పాలన’ అవుతుందని స్పష్టంచేశారు. ఈ క్రమంలో బలమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ ఆవశ్యకతను నొక్కిచెప్పారు. చట్టసభల్లో రూపొందే చట్టాలు రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉన్నాయా, లేదా అని పరిశీలించడమే న్యాయవ్యవస్థ ప్రధాన విధిగా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత న్యాయపాలికపైనే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉందన్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఈ తీర్పులు, వ్యాఖ్యలను లోతుగా విశ్లేషిస్తే సర్వోన్నత న్యాయస్థానం సందేశం విస్పష్టమవుతుంది. హక్కుల హననానికి అక్కరకొస్తున్న చట్టాల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడాలన్న సదాశయం అందులో ద్యోతకమవుతుంది. సర్వోన్నత న్యాయస్థానం దిద్దుతున్న ఈ కొత్త ఒరవడిని అర్థం చేసుకోలేనివారు భారీ మూల్యం చెల్లించక తప్పదు!


 

Posted Date: 03-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం