• facebook
  • whatsapp
  • telegram

అడవిలో సంస్కరణల అలజడి

అటవీ చట్టంలో కీలక మార్పులు

భారతీయ అటవీ చట్టం(ఐఎఫ్‌ఏ) సవరణకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోమారు అందుకు సిద్ధమైంది. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఎదురైన దృష్ట్యా ఈసారి పక్కా ప్రణాళికతో ప్రక్రియను ప్రారంభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ- ‘ఐఎఫ్‌ఏ-1927’ సవరణ కోసం తగిన ముసాయిదాను రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థలను ఆహ్వానించింది. ఐఎఫ్‌ఏ వ్యవహారాలపై నైపుణ్యం, చట్టంలోని లోపాలపై అవగాహన, అడవిలోని వాస్తవిక పరిస్థితులపై అనుభవం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఎంపికయ్యే సంస్థలు- రాష్ట్రాల అటవీ ఉత్పత్తుల రవాణా, వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దోహదపడాలి. అవశేష అటవీ భూములు, అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకానికి ప్రైవేటు రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలనే అంశంపైనా సూచనలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు, అడవిలో నివసించే ప్రజలు, అటవీ కార్యకర్తలతో- ఆయా సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగాలి. భారత అటవీ చట్టం ఉల్లంఘన కారణంగా దాఖలైన ఎన్నో కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నానుతున్నాయి. అందువల్ల న్యాయశాఖలోని ముఖ్యమైన తీర్పులతో పాటు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలపైనా ఈ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

చాపకింద నీరులా...

చట్టంలోని నిబంధనలు పాతబడిపోయాయని, వాటిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చడానికే ఐఎఫ్‌ఏను సమీక్షిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2019 ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను విడుదల చేసింది. దీనిపై గిరిజనుల హక్కుల బృందాలు, పర్యావరణ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో అటవీ అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టినట్లవుతుందని, ఆయుధాల వినియోగానికి సైతం అనుమతులున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా వ్యతిరేకత తీవ్రం కాకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. అప్పటికి ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను పక్కనపెట్టింది. మరోవైపు రాష్ట్రాల ఆమోదం పొందేందుకు 2019 మార్చిలోనే పావులు కదిపింది. ప్రతిపాదిత సవరణల ముసాయిదాను అన్ని రాష్ట్రాలకూ పంపించింది. ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు, పౌర సమాజ సంస్థలతో రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు జరపాలని కోరింది. 90రోజుల్లోగా అభిప్రాయాలను వ్యక్తం చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువుపై పర్యావరణ కార్యకర్తలు మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద ఎన్నికలకు ప్రజలు సన్నద్ధమవుతున్న వేళ 90రోజుల గడువు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.

ఐఎఫ్‌ఏ సవరణలతో భారీ పరిణామాలు ఉంటాయన్నది వాస్తవం. అటవీ ఉత్పత్తుల రవాణా నిబంధనలు, ప్రభుత్వ అధీనంలో లేని అటవీభూములపై ఈ సవరణ దృష్టి సారించింది. ఇలాంటి అటవీభూముల్లో చెట్ల పెంపకం కోసం ప్రైవేటు రంగానికి అనుమతులివ్వడం అత్యంత వివాదాస్పదంగా మారింది. దేశంలో గిరిజనుల జనాభా 8.6శాతం. 47లోక్‌సభ స్థానాలను ఎస్‌టీలకు కేటాయించారు. వీటితో సహా మొత్తం 133 స్థానాల్లో, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 24,710 ఎకరాల అటవీ భూమి ఉంది. వీటిలోని 20శాతం ఓటర్లు అడవుల్లో నివసించేవారే. అభిప్రాయాలను వ్యక్తపరచడానికి 2019 జూన్‌ 15తో గడువు ముగిసింది. అప్పటికి కొన్ని రాష్ట్రాలే స్పందించడంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందడుగూ వేయలేదు. కానీ, భారీ మెజారిటీతో గెలుపొంది రెండోసారి పదవి చేపట్టిన అనంతరం మోదీ ప్రభుత్వం 2019 జులైలో గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. క్షీణించిన అటవీ భూముల్లో చెట్ల పెంపకానికి ప్రైవేటు పరిశ్రమలకు అనుమతులిస్తూ రూపొందించిన మార్గదర్శకాలను ఆమోదించింది. ఈ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో ఇంకా పుర్తిగా అమలులోకి రాలేదు. ఐఎఫ్‌ఏ-1927కు ఎలాంటి మార్పులు చేసినా తాము వ్యతిరేకిస్తామని పర్యావరణ కార్యకర్తలు, గిరిజన హక్కుల సంరక్షణ బృందాలు తేల్చిచెబుతున్నాయి. ప్రతిపాదిత సవరణలతో అడవి బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే భావన ఆయా వర్గాల్లో నెలకొంది.

భారత అటవీ శాఖ అంచనాల (2019) ప్రకారం...

దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా 21.67శాతం (7,12,249 చదరపు కిలోమీటర్లు).

చెట్ల వాటా 2.89శాతం.

2017తో పోల్చుకుంటే 2019నాటికి దేశంలో అడవి, చెట్ల విస్తీర్ణం 0.65శాతం పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా 17.88శాతం.

ఏపీలో స్థానికంగా లభించే రక్తచందనం చెట్లకు మంచి డిమాండ్‌ ఉంది.

కలప కాకుండా నేలఉసిరి ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువ (98.8శాతం)

తెలంగాణలో 18.36శాతం అటవీ భూమి ఉంది.

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు అయిదు శాతం సంరక్షిత ప్రాంతం.

గోదావరి నది ఒడ్డున దట్టమైన టేకు అడవులు కనపడతాయి.

ఎదురయ్యే సవాళ్లెన్నో!

అటవీభూముల యాజమాన్యం, విస్తీర్ణం, అటవీ ఉత్పత్తులు వంటి పలు అంశాలు- 94ఏళ్ల చరిత్ర గల ఈ భారతీయ అటవీ చట్టం చుట్టూ అల్లుకున్నాయని విధాన పరిశోధనా కేంద్రానికి చెందిన న్యాయ పరిశోధకులు కంచి కోహ్లీ పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అటవీ అధికార వ్యవస్థ, అటవీ హక్కులు కలిగిన ప్రజలు, అటవీ కార్మికుల మధ్య ఈ చట్టం వ్యత్యాసాన్ని చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఐఎఫ్‌ఏకు ఎలాంటి సవరణలు చేసినా అధికార సమీకరణలు మారతాయని, అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. ఐఎఫ్‌ఏకు ప్రతిపాదించిన సవరణలు ప్రాథమికంగా అటవీ అధికారులు, ప్రైవేటు సంస్థల హక్కులను పెంచే దిశగా ఉండటం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవేమీ ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మరింత నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది. అడవుల్లో నివసించేవారికి 1927 భారతీయ అటవీ చట్టం నిరుపయోగమని, బ్రిటిషర్లు సొంత ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని రూపొందించారని ప్రభుత్వం వాదిస్తోంది. అడవి బిడ్డలకు అండగా ఉన్నట్టు కనపడే ఈ చట్టం, వాస్తవానికి వారికి- అడవి తల్లికి మధ్య ఉన్న బంధాన్ని పావుగా ఉపయోగించుకుంది. ఫలితంగా ఇన్నేళ్లూ వారు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రయత్నం అడవి బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. 

- రాజీవ్‌ రాజన్‌
 

Posted Date: 04-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం