• facebook
  • whatsapp
  • telegram

భారత అమ్ములపొదిలో కొత్త ఆయుధం

రష్యాతో ‘ఏకే-203’ కొనుగోలు ఒప్పందం

కదనరంగంలో కనురెప్ప పాటులో జయాపజయాలు మారిపోతుంటాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వైరిపక్షంపై దాడి చేసే సమయానికి చేతుల్లో ఆయుధాలు మొరాయిస్తే- సైనికులకు అది ప్రాణాంతకమే అవుతుంది. భారత దళాలు కొన్నేళ్లుగా ఒక రైఫిల్‌తో అటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాయి. అయినా, దాన్ని మార్చి భద్రతా బలగాలకు సమర్థమైన ప్రాథమిక ఆయుధాన్ని సమకూర్చడంపై దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు జాప్యం చేస్తూ వచ్చాయి. చివరికి చైనా రూపంలో శత్రువు వచ్చి ముంగిట మోహరించడంతో కొత్త రైఫిళ్ల సమీకరణ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. రష్యా నుంచి ఆధునిక ఏకే-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు తాజాగా ఒప్పందం కుదిరింది. దాదాపు 70 వేల తుపాకులను దిగుమతి చేసుకోవచ్చని తెలుస్తోంది.  

ఇన్సాస్‌లతో ఇక్కట్లు

భారత సైన్యం, పారామిలిటరీ, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలు 1998 నుంచి స్వదేశీ ఇన్సాస్‌ రైఫిల్‌ను వాడుతున్నాయి. డీఆర్‌డీఓ పరిధిలోని ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ(ఏఆర్‌డీఈ) రూపొందించిన దీన్ని ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ) ఉత్పత్తి చేసింది. ఈ తుపాకీతో కార్గిల్‌ యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన సైన్యం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఉత్పత్తిలో నాణ్యత లోపించడంతో అతిశీతల వాతావరణంలో పనిచేయకపోవడం, ప్లాస్టిక్‌ కాట్రిడ్జిలు(తూటాలుంచే పెట్టెలు) పగిలిపోవడం, దానంతటకదే యాంత్రిక(ఆటొమేటిక్‌) మోడ్‌లోకి వెళ్ళిపోయి తూటాలను వెదజల్లడం, కాల్పులు జరిపే సమయంలో రైఫిల్‌లోంచి చమురు వెలువడి సైనికుల కళ్లలో పడటం వంటి సమస్యలు తలెత్తాయి. ఇండియా ఈ తుపాకులను నేపాల్‌, భూటాన్‌, స్విట్జర్లాండ్‌లకూ ఎగుమతి చేసింది. నేపాల్‌ సైనిక స్థావరంపై 2005లో మావోలు దాడిచేశారు. ఆ సమయంలో సైనికుల దగ్గరి ఇన్సాస్‌లు మొరాయించాయి. దాంతో మావోయిస్టులు పైచేయి సాధించి 43 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ తరవాత ఇన్సాస్‌పై నేపాల్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ దీపక్‌ గురుంగ్‌ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆయుధం తమ అవసరాలు తీర్చలేదని భారత సైన్యం సైతం 2010లో తేల్చిచెప్పేసింది. ఇన్సాస్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నించినా విజయవంతం కాలేదు. ఆ క్రమంలోనే కశ్మీర్‌లో నిత్యం ఉగ్రవాదులతో పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్‌ దళాలు ఇన్సాస్‌ స్థానంలో ఏకే-47ను ఎంచుకొన్నాయి. భూమిలో కొన్నాళ్ల పాటు పాతిపెట్టినా, బురదలోంచి తీసి వాడినా ఇవి సమర్థంగా పనిచేస్తాయి. అత్యంత శీతల ప్రాంతాల్లోనూ మొరాయించవనే పేరుంది. అందుకే బలగాలు వీటికి ప్రాధాన్యమిస్తున్నాయి.

ఇన్సాస్‌ల స్థానంలో 7.5 లక్షల మల్టీ క్యాలిబర్‌ రైఫిళ్లను సమకూర్చుకునేందుకు ఇండియా 2014లో గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. సైన్యం అవసరాలకు తగిన ప్రతిపాదనలతో ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. సైన్యం కోరుకుంటున్న రైఫిల్‌ శక్తిసామర్థ్యాలు వాస్తవదూరంగా ఉన్నాయని నాటి సైన్యాధిపతి బిక్రమ్‌సింగ్‌ సమక్షంలోనే రక్షణ మంత్రి మనోహర్‌ పారేకర్‌ విమర్శించారు. మరుసటి సంవత్సరం టెండర్లను రద్దు చేశారు. ఇన్సాస్‌లను క్రమంగా తొలగించాలని మరో మూడేళ్లకు ప్రభుత్వం నిర్ణయించింది. త్రివిధ దళాలకు కొత్త తుపాకులు, తేలికపాటి మెషీన్‌గన్‌లను అందించడానికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వాటిలో కొన్నింటిని నేరుగా దిగుమతి చేసుకొని, మిగిలినవి దేశీయంగా తయారు చేయించాలని తలపోశారు. రష్యా 2018లో వినియోగంలోకి తెచ్చిన ఏకే-203 రైఫిల్‌ను ఎంపిక చేశారు. ఈ తుపాకుల్లో 7.62 ఎం.ఎం.క్యాలిబర్‌ తూటాలను వినియోగిస్తారు. ఒక్క తూటాతోనే అవతలి వ్యక్తిని నేలకూల్చవచ్చు. అమెరికా నుంచి నిరుడు కొనుగోలు చేసిన సిగ్‌సావర్‌ 716 రైఫిళ్లలోను స్వల్పమార్పులతో ఇటువంటి తూటాలనే వాడుతున్నారు. ఇన్సాస్‌లో వాడే 5.56 ఎం.ఎం. తూటాలు అంత ప్రాణాంతకమైనవి కావు. కశ్మీర్‌లో మన బలగాలతో తలపడుతూ గాయపడిన ముష్కరులు- అలాగే ఎదురుదాడికి దిగిన సందర్భాలున్నాయి. ఇన్సాస్‌లపై భారత బలగాల అయిష్టతకు ఇదీ ఒక కారణమే!  

సరిహద్దు రక్షణలో కీలకం

దిగుమతులు పోగా దాదాపు ఆరు లక్షలకు పైగా ఏకే-203 తుపాకులను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళిక రచించారు. దీనికోసం 2019లో ఉత్తరప్రదేశ్‌ అమేఠీ జిల్లాలోని కొర్వా ఆయుధ తయారీ కర్మాగారం పరిధిలో ఇండో-రష్యా రైఫిల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో మన ఓఎఫ్‌బీకి అధిక వాటా (50.5శాతం) ఉండగా, రష్యాకు చెందిన కలెష్నికొవ్‌కు 42.5శాతం, రొసొబొర్నో ఎక్స్‌పోర్ట్‌కు 7.5శాతం వాటాలున్నాయి. మేజర్‌ జనరల్‌ సంజీవ్‌ సెన్‌గార్‌ను ఈ సంస్థకు సీఈఓగా నియమించారు. రైఫిల్‌ ధర విషయంలో మరో రెండేళ్లు మల్లగుల్లాలు పడ్డారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరుడు, సైన్యాధిపతి నరవణే ఈ ఏడాదిలో రష్యాకు వెళ్ళి ఒప్పందాన్ని ఓ కొలిక్కితెచ్చారు. భారత్‌లో ఉత్పత్తి అయ్యే ఒక్కో తుపాకీపై రష్యాకు ఆరు వేల రూపాయలకు పైగా రాయల్టీ చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న దళాలు ఇప్పటికీ ఇన్సాస్‌లనే వాడుతున్నాయి. చైనా దూకుడును దృష్టిలో పెట్టుకొని వీలైనంత వేగంగా వాటికీ ఆధునిక ఆయుధాలను అందించాల్సిన అవసరం ఉంది.

- లక్ష్మీతులసి
 

Posted Date: 25-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం