• facebook
  • whatsapp
  • telegram

‘ఆమె’ ప్రాతినిధ్యం అరకొరే!

చట్టసభల్లో పెరగాల్సిన మహిళాశక్తి

ఐరోపా దేశం ఐస్‌లాండ్‌ పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో 47శాతానికి పైగా స్థానాలను మహిళలు కైవసం చేసుకొన్నారు. స్వీడన్‌, ఫిన్లాండ్‌ చట్టసభల్లోనూ 45శాతానికి పైగా మహిళా సభ్యులు కొలువుతీరారు. రాజకీయ రంగంలో నారీశక్తి భాగస్వామ్యం సమధికంగా ఉన్న దేశాల్లో రువాండా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అక్కడి పార్లమెంటరీ దిగువసభలో స్త్రీల వాటా 61శాతం. క్యూబా, నికరాగువా, మెక్సికోల్లో సైతం ప్రజాప్రతినిధులుగా గణనీయ సంఖ్యలో మహిళలు రాణిస్తున్నారు. ఇండియాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. రాజకీయ రంగంలో, ముఖ్యంగా చట్టసభల్లో నారీమణులకు భారత్‌లో నేటికీ సంతృప్తికర స్థాయిలో ప్రాతినిధ్యం లభించడంలేదు.

త్రిశంకుస్వర్గంలో బిల్లు

పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని అన్ని రాజకీయ పార్టీలూ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాయి. వాస్తవానికి వచ్చేసరికి ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తిగా పరిస్థితి ఉంటోంది. భారత్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం తొమ్మిది శాతమే అయినా, లోక్‌సభకు ఎన్నికైన వారిలో 14శాతం మంది స్త్రీలు ఉన్నారు. 1980-2007 మధ్య కాలంలో రాష్ట్రాల అసెంబ్లీలకు 4.4శాతం మహిళలే పోటీచేసినా, ఎన్నికైన శాసనసభ్యుల్లో 5.5శాతం మహిళలు ఉన్నారు. దీన్నిబట్టి ఎన్నికల్లో స్త్రీలకు విజయావకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయని అర్థమవుతోంది. 2010 నుంచి పార్లమెంటు, శాసనసభ ఎన్నికల పోలింగ్‌లో పురుషులతో సమంగా మహిళలు పాల్గొంటున్నారు. అయినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో ఇప్పటికీ పురుషాధిక్యతే కొనసాగుతోంది. ప్రస్తుతం పార్లమెంటు, శాసనసభల్లో మహిళాసభ్యులు 15శాతం కన్నా తక్కువే. వీరిలో అత్యధికులు పట్టణ నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారే. నగరాలు, పట్టణాల్లో విద్యాస్థాయులు, లింగ సమానత్వ భావనలు ఎక్కువగా ఉండటం వల్ల మహిళలను చట్టసభలకు ఎన్నుకోవడానికి అక్కడి ఓటర్లు సంకోచించడం లేదు. గ్రామీణ నియోజకవర్గాల్లో గెలుపొందే మహిళలు ప్రధానంగా స్థానికంగా పలుకుబడి ఉండే రాజకీయ కుటుంబాలకు చెందినవారై ఉంటున్నారు. సినిమా, టీవీ రంగాల్లో రాణించిన మహిళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉండటంతో వారు గ్రామీణ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువ. మొత్తంగా చూస్తే ఇలాంటి అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువ. వీరి విజయాలను చూసి చట్టసభలకు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికవుతున్నారని భ్రమపడకూడదు. చట్టసభల్లో లింగసమానత్వ సాధనకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరి.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుగా పరిగణిస్తున్న దీన్ని ఇంతవరకు లోక్‌సభకు పంపకపోవడంతో దశాబ్ద కాలానికి పైగా ఆ బిల్లు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో మూడో వంతును మహిళలకు ర్యాండమ్‌ (నిర్దిష్టంగా కాకుండా యాదృచ్ఛిక) పద్ధతిలో కేటాయించడానికి 1993లో రాజ్యాంగ సవరణ చేశారు. అదే రిజర్వేషన్‌ను లోక్‌సభ, శాసనసభలకు విస్తరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్‌ విధానాన్ని అమలుపరచే విషయంలో పురుష అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపుతుండటం మహిళా ప్రాతినిధ్య పెంపునకు పెద్ద ప్రతిబంధకంగా నిలుస్తోంది. మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తే, ఇక ఆ నియోజకవర్గాల్లో పురుషులు పోటీచేయడానికి అవకాశం ఉండదు. తమ నియోజకవర్గాల్లో బలంగా వేళ్లూనుకోవడానికి, ప్రజాదరణ పలుకుబడి పెంచుకోవడానికి ఏళ్లతరబడి కృషి చేశామని, ఉన్నట్టుండి ఆ నియోజకవర్గాలను మహిళలకు కేటాయిస్తే తమ శ్రమ మొత్తం వృథా అవుతుందని పురుష అభ్యర్థులు వాదిస్తున్నారు. ఇటువంటి భావాలను దూరం చేస్తూ, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెంచే విషయంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

అవరోధాలెన్నో...

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే స్త్రీ శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే విధానాలు రూపుదిద్దుకొంటాయి. శిశు మరణాలు తగ్గడం, అక్షరాస్యత పెరగడం వంటి ప్రయోజనాలు చేకూరతాయని ఇతర దేశాల అనుభవాలు చాటుతున్నాయి. కేవలం ఒక కలం పోటుతో మహిళా రిజర్వేషన్లు పెంచినంతమాత్రాన సరిపోదు. వారిలో రాజకీయ చైతన్యమూ పెరగాలి. ఉదాహరణకు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలు రాజకీయ, ఎన్నికల సభలకు హాజరు కావడం, నాయకులు అభ్యర్థుల ప్రసంగాలు వినడం, రాజకీయ పార్టీల సభ్యత్వం తీసుకోవడం చాలా అరుదు. తక్కిన రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంతకన్నా మెరుగ్గా ఏమీ లేదు. చాలా చోట్ల అనాదిగా వస్తున్న పితృస్వామ్య భావజాలం కారణంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల పాత్ర తక్కువగానే ఉంటోంది. ఇదే స్థితి రాజకీయ భాగస్వామ్యంలోనూ ప్రతిబింబిస్తోంది. గ్రామీణ మహిళలు దగ్గర్లోని బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లాలన్నా పురుషుల అనుమతి తీసుకోవలసిందే. పట్టణ మహిళలు భద్రతా కారణాల వల్ల స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఇటువంటి అనేక అవరోధాల నడుమ రాజకీయాల్లో వారు చురుగ్గా పాలుపంచుకోలేక పోవడంలో ఆశ్చర్యం ఏముంది? మహిళా రిజర్వేషన్లు ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి సహకరిస్తాయి. మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించి, రాణిస్తున్న కొద్దీ ఇతర స్త్రీలోకానికి వారు స్ఫూర్తిగా నిలుస్తారు. ముఖ్యంగా వారిని చూసి యువతుల్లో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. తద్వారా పోనుపోను చట్టసభల్లో మహిళా భాగస్వామ్యం ఇతోధికంగా ఇనుమడించడానికి మార్గం సుగమమవుతుంది.

దశలవారీగా పెంపు

ప్రస్తుతం క్రీడల్లో స్త్రీ పురుషులు విడివిడిగా తమ విభాగాల్లో పోటీపడుతున్నారు. రాజకీయాల్లో అటువంటి పద్ధతి పాటించకుండా, ఒకే సీటు కోసం స్త్రీ పురుషులు పోటీపడే అవకాశం కల్పించడం మంచిదని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. దీన్ని ఉన్నపళాన అమలు చేయాల్సిన అవసరం లేదని, క్రమంగా ఆచరణలోకి తీసుకురావచ్చని పేర్కొంటున్నారు. మహిళా అభ్యర్థులు మొదట ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడానికి పార్టీలు సహకరించాలి. ఆ తరవాత వారిని పోటీలో నిలిపితే మేలు అన్నది నిపుణుల భావన. పార్లమెంటు, శాసనసభల్లో ఒక్కసారిగా 33శాతం సీట్లను మహిళలకు కేటాయించేకన్నా రాబోయే ఎన్నికల్లో దశలవారీగా పెంచుకొంటూ పోవడం ఉత్తమమని పలువురు పేర్కొంటున్నారు. ఉదాహరణకు 2024లో 20శాతం, 2029 ఎన్నికల్లో 25శాతం చొప్పున పెంచే విషయం ఆలోచించాలని అంటున్నారు. మహిళలకు నియోజకవర్గాలను గంపగుత్తగా కేటాయించేకన్నా పార్టీలు పంపిణీ చేసే టికెట్లలో నిర్ణీత శాతాన్ని కేటాయించవచ్చు. గత ఎన్నికల్లో మహిళలు గెలిచిన లేదా రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాల్లో మరోసారి వారినే పోటీలో నిలపవచ్చు.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 29-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం