• facebook
  • whatsapp
  • telegram

పత్తికి పరిశ్రమ తోడైతేనే భవిత

శ్రమజీవుల్ని గట్టెక్కించే లాభాల కలనేత

భారత జౌళి రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అప్పరెల్‌ పార్క్స్‌ (పీఎం మిత్ర)’గా వ్యవహరించే ఈ పథకంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రూ.4,445 కోట్ల వరకు వెచ్చించి భారీ సమీకృత ప్రాంతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ సమూహాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పంట క్షేత్రం నుంచి విదేశాలకు వస్త్రాల ఎగుమతి వరకు తోడ్పడే సౌకర్యాలతో జౌళి పార్కులను సిద్ధం చేయనున్నారు. ‘పీఎం మిత్ర’ కింద తమ రాష్ట్రాల్లో జౌళి పార్కుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, ఒడిశా, గుజరాత్‌, అస్సాం, రాజస్థాన్‌లతోపాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. వరంగల్‌ జిల్లాలో ప్రతిపాదిత కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూసేకరణ చేపట్టి, పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో రాష్ట్రానికి మెగా జౌళి పార్కును మంజూరు చేయాలని కోరింది. ఈ పథకం కింద అవకాశం వస్తే ఒక్కో జౌళి పార్కుకు రూ.300 నుంచి రూ.500 కోట్లు దక్కే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష నుంచి రెండు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సమకూరుతాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు పీఎం మిత్ర పథకం కింద మెగా జౌళి పార్కుల నిధులు పొందేందుకు పూర్తి స్థాయి అర్హతలు కలిగి ఉన్నాయి.

మేలి రకం ఉత్పత్తి

దేశంలో పత్తి పంట ఉత్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వరసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌, మహారాష్ట్రల తరవాత తెలంగాణ 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి చేస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని రాష్ట్ర రైతులు పండిస్తున్నారు. ఏపీలో ఈ ఏడాది 14 లక్షలకుపైగా ఎకరాల్లో 19 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పత్తి పంటకు అనుకూలించే భౌగోళిక పరిస్థితుల వల్ల ఉభయ రాష్ట్రాల్లో 31 మిల్లీమీటర్ల పొడవుతో పండే పత్తికి వస్త్ర పరిశ్రమల్లో మంచి డిమాండు ఉండటం మనకు కలిసివచ్చే అంశం. దేశంలోని మొత్తం పత్తి దిగుబడిలో సింహభాగం గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల నుంచే రావడం వల్ల ఈ ప్రాంతాలను ‘కాటన్‌ బాస్కెట్ ఆఫ్‌ ఇండియా’గా వ్యవహరిస్తున్నారు. వస్త్ర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ఈ రంగంలో ఆశించినంత పురోగతి సాధించలేకపోతున్నాం. రెండు రాష్ట్రాల్లో పోచంపల్లి, గద్వాల, మంగళగిరి, వెంకటగిరి లాంటి చేనేత రకం చీరలు, ఏలూరు, వరంగల్‌ కొత్తవాడ తివాచీలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటిపై ఆధారపడ్డ చేనేతకారులకు సరిపడా ఉపాధి లేకపోవడంతో కొన్ని దశాబ్దాల క్రితమే మన నేతకారులు పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వలసవెళ్ళారు. అక్కడి వస్త్ర పరిశ్రమల్లో చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల్లో మెగా జౌళి పార్కులు ఏర్పాటు చేస్తే మన వద్ద ఉపాధి ఉద్యోగాలు పెరగడంతోపాటు, వస్త్ర పరిశ్రమ పుంజుకొని అటు రైతులకు మంచి ధర దక్కడంతోపాటు, ఇటు నేతన్నల జీవితాలూ బాగుపడతాయి. ఇప్పటికీ మన రైతులు పండించే పంటలో సింహభాగాన్ని ముడి సరకుగా ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవడమే కాకుండా, పారిశ్రామిక విధానాన్ని సవరించి, పెట్టుబడిదారులను ఆహ్వానించాలి. విరివిగా వస్త్ర యూనిట్లు నెలకొల్పాలి. తద్వారా రాష్ట్రాలకు పారిశ్రామికంగా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

సరైన విధానం రావాలి

భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో జౌళి రంగం వాటా రెండు శాతం. ఎగుమతుల్లో 12శాతం, ప్రపంచ వాణిజ్యంలో అయిదు శాతం మేర వాటా కలిగిఉంది. వ్యవసాయం తరవాత అత్యధికంగా 3.5 కోట్ల మందికి ఉపాధి మార్గాన్ని కల్పిస్తోంది. దిగుబడిలో ముందంజలో సాగుతున్న తెలుగు రాష్ట్రాలు జౌళి పరిశ్రమల వాటాలో మాత్రం వెనకబడే ఉన్నాయి. తెలంగాణలో రమారమి 50వేల మరమగ్గాలు, 17వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. సిరిసిల్ల, వరంగల్‌ మినీ టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటైన పవర్‌లూం యూనిట్లతో క్రమంగా వస్త్ర పరిశ్రమలు పుంజుకోవడానికి బాటలు పడుతున్నాయి. ఈ క్రమంలో పత్తి రైతులను వస్త్ర పరిశ్రమలకు అనుసంధానం చేసి వారికి గిట్టుబాటు ధర వచ్చేలా జౌళి విధానాన్ని రూపొందించాలి. వస్త్రాలకు కావాల్సిన ముడి సరకుగా మేలైన పత్తిని అన్నదాతలు పుష్కలంగా పండిస్తున్నారు. వస్త్రాల తయారీకి అవసరమైన నేర్పుగల మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినా వస్త్రోత్పత్తిలో వెనకంజలో ఉండటానికి ప్రధాన కారణం- జౌళి రంగంలో సరైన పారిశ్రామిక విధానం లేకపోవడమే. ఈ దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టడంతోపాటు పత్తి ప్రయోగశాలలు, నూనె మిల్లుల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. సీసీఐ సామాజిక బాధ్యత కింద ఇటీవల దేశవ్యాప్తంగా అయిదువేల వరకు పత్తిని కోసే కపాస్‌ యంత్రాలను రైతులకు ఉచితంగా అందజేసింది. పత్తి పంట యాంత్రీకరణలో ఇది ముందడుగే. ఇలా విత్తు నుంచి విపణి వరకు పత్తి రైతును ప్రోత్సహించే విధానాలు తీసుకొచ్చినప్పుడే తెల్ల బంగారాన్ని పండించే కర్షకుల జీవితాలు వికసిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో జౌళి పరిశ్రమల ఏర్పాటు జరిగితే పారిశ్రామికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

పెరగాల్సిన అవగాహన  

నాణ్యమైన పత్తిని పండిస్తున్న రైతులు అమ్ముకోవాల్సినప్పుడు మాత్రం మద్దతు ధర కోసం పడిగాపులు కాయాల్సి రావడం బాధాకరం. విపణిలో పత్తికి రికార్డు ధరలు పలుకుతున్నట్లు మార్కెటింగ్‌ వర్గాలు గొప్పలు చాటుతున్నాయి. దళారుల ప్రమేయంతో సగానికి సగం మంది రైతులు తెచ్చే సరకుకు సవాలక్ష కొర్రీలు పెట్టి ధరలు తగ్గించడం సర్వసాధారణమైంది. విపణిలో ధర తగ్గినప్పుడు మద్దతు ధర చెల్లించి సరకు కొనాల్సిన బాధ్యత భారత పత్తి సంస్థ(సీసీఐ)దే. అధిక తేమ, నాణ్యతను బూచిగా చూపి రైతులు తెచ్చే పత్తిని తిరస్కరిస్తున్నారు. చేసేది లేక అన్నదాతలు ఒక్కోసారి పెట్టుబడి ధర కూడా పొందలేక, పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ క్రమంలో పత్తి అధికంగా పండే జిల్లాల్లో రైతులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం దిగుబడిపైనే కాక, పత్తిని గ్రేడింగ్‌ చేయడమూ ఎంతో అవసరం.

- గుండు పాండురంగశర్మ
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారతీయ రైతులపై రాయితీల ఆంక్షలు

‣ పేదరికంలోకి జారుతున్న మధ్యతరగతి

Posted Date: 29-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం