• facebook
  • whatsapp
  • telegram

కులగణనకు పెరుగుతున్న డిమాండ్లు

సుముఖత చూపని కేంద్ర సర్కారు

భారత్‌లో జనగణన ప్రక్రియ బ్రిటిష్‌కాలం నుంచి ప్రారంభమైంది. 1872 నుంచి 1941 వరకు ప్రతి పదేళ్లకోసారి బ్రిటిష్‌ పాలనలో ఈ గణాంకాలను సేకరించేవారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత భారత ప్రభుత్వం అదే కాలవ్యవధితో ఆ కార్యక్రమాన్ని 1951 నుంచి కొనసాగించింది. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం కులాలవారీగా గణాంకాల సేకరణ చేపడితే, భారత ప్రభుత్వం కేవలం ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ గణాంకాలు తప్ప- ఓబీసీల కులాల వివరాలను పరిగణనలోకి తీసుకోలేదు. 1953లో భారత ప్రభుత్వం కాకా కలేల్కర్‌ నేతృత్వంలో నియమించిన మొదటి ఓబీసీ కమిషన్‌, 1978లో బి.పి.మండల్‌ ఆధ్వర్యంలో నియమించిన రెండో ఓబీసీ కమిషన్‌ తప్పనిసరిగా కులగణన చేపట్టాలని సిఫార్సు చేశాయి. అయినా భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఓబీసీల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌- బ్రిటిషర్లు చేపట్టిన 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 46 సంవత్సరాల వరకు కేంద్ర సర్వీసుల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు కాలేదు. కేంద్రీయ విద్యాసంస్థల్లో ఓబీసీల రిజర్వేషన్ల అమలును 2008 వరకు ప్రభుత్వాలే అడ్డుకున్నాయి. 1990 ఆగస్టు ఏడో తేదీన అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం- మండల్‌ కమిషన్‌ సూచించిన రీతిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వీపీ సింగ్‌ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ దేశంలో గ్రూప్‌-ఎ సర్వీసుల్లో కేవలం 4.7శాతం మాత్రమే ఓబీసీకి చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. 2011లో అది 6.9శాతానికి, 2013 నాటికి 11.11శాతం స్థాయికి చేరిందని గణాంకాలు సూచిస్తున్నాయి. గ్రూప్‌-బి సర్వీసుల్లోనూ అదే పరిస్థితి. అప్పట్లో యూపీఎస్‌సీలో 651 మంది సిబ్బందిలో ఓబీసీల వాటా తొమ్మిది శాతం మాత్రమే. అప్పటివరకూ భారత సర్కారు పాటిస్తున్న సామాజిక దుర్విచక్షణకు ఈ వివరాలు అద్దం పట్టాయి. ఓబీసీ రిజర్వేషన్ల ప్రకటనతో నేషనల్‌ ఫ్రంట్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్న భాజపా- కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు ఏడో తేదీన వీపీ సింగ్‌ సర్కారు అధికార పగ్గాలు కోల్పోయింది.

ఒత్తిడి పెంచుతున్న రాష్ట్రాలు

ఈసారి జరగనున్న జనగణనలో కుల ప్రాతిపదికన వివరాలు సేకరించాలంటూ అన్ని రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు ఈ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అగ్ర నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు కులగణనకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. తెలంగాణ బీసీ ఫ్రంట్‌, మహారాష్ట్రలే కాకుండా- జాతీయ బీసీ సంక్షేమ సంఘమూ కులగణన చేపట్టాల్సిందేనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌లో జనాభాను కులాల వారీగా లెక్కించడం కష్టసాధ్యమని పేర్కొంది. 1931లో బ్రిటిష్‌ సర్కారు జరిపిన సర్వేలో దేశంలో 4,147 కులాలున్నట్లు తేలింది. ప్రస్తుతం కేంద్రంలో ఓబీసీ జాబితాలో 2,642 కులాలుంటే, 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక సర్వేలో 45 లక్షలకు పైగా కులాలు, ఉపకులాలున్నట్లు తేలిందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. ఇది పలువురిని ఆశ్చర్యపరచింది. నిజానికి అగ్రకులాలన్నింటినీ కలిపినా మొత్తం కులాలు 6000 కన్నా ఎక్కువ ఉండవనేది ఒక అంచనా. భాజపా 2010లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2011లో కులగణన చేపట్టాలని నాటి యూపీఏ సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. 2018 ఆగస్టు 31న నాటి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2021లో జరగబోయే జన గణనలో కులాలవారీగా వివరాలు సేకరించాలని నిర్ణయం సైతం తీసుకున్నారు. అయితే ఇప్పుడు కులగణనకు ఎన్‌డీఏ సర్కారు ఎందుకు విముఖత చూపుతోందనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.

లోపించిన శాస్త్రీయత

కేంద్రం తరహాలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలూ బీసీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేయకుండా అన్ని కులాలనూ ఒకే జాబితాలో పెట్టాయి. దీనివల్ల కులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు తలెత్తాయి. రిజర్వేషన్ల ఫలాలు అన్ని కులాలకూ సమానంగా అందలేదు. చాలా కులాలు... ముఖ్యంగా సంచార జాతుల్లో పేదరికం, నిరక్షరాస్యత కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 800 బీసీ కులాలవారు ఇప్పటివరకు పాఠశాల గడప తొక్కలేదు. 1,400 బీసీ కులాలు 10వ తరగతి స్థాయికీ చేరలేదు. వెనకబడిన కులాలను వర్గీకరించాలని వీపీ సింగ్‌ హయాములో మంత్రివర్గం నిర్ణయించింది. ఆ వర్గీకరణ కార్యరూపం దాలిస్తే ప్రభుత్వ పథకాల్లో ఇన్నాళ్లూ వెనక వరసలో ఉన్న కులాలు ఇకపై ముందు వరసలో ఉంటాయి. ప్రస్తుతం జనాభా గణన పట్టికలో ఉన్న 35 వరసలకు అదనంగా కులం కోసం 36వ కాలమ్‌ చేరిస్తే సరిపోతుంది. కుల గణనవల్ల కులతత్వం పెరుగుతుందనే భావన అర్థరహితమని నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబాలవారీగా సమాచారం పాలకుల వద్ద ఉంటే వెనకబడిన కులాల అభివృద్ధి ప్రణాళికలు, పథకాల అమలు సాధ్యమవుతుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీల విషయంలో గణాంకాల సేకరణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు- బీసీల సమాచారం సేకరించడం ఎందుకు వీలుకాదని పలువురు ప్రశ్నిస్తున్నారు. బహుశా జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలనే ఒత్తిళ్లు పెరగవచ్చని పాలకులు భయపడుతున్నట్లు భావించాల్సి వస్తోంది. కొత్త కులాలను చేర్చాలన్నా, అభివృద్ధి చెందిన కులాలను గుర్తించాలన్నా కులగణన ఎంతో అవసరం, ప్రయోజనకరం!

సిఫార్సులు బుట్టదాఖలు

కుల ఆధారిత జనాభా గణన అవసరమేనని కలేల్కర్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. వీలైతే 1957లోపు లేదా కనీసం 1961లో కుల ఆధారిత జన గణనను పూర్తి చేయాలని సూచించింది. కుల గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు, పథకాలు, అమలు చేయడం అసాధ్యం. సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులు సైతం పలుమార్లు ఇదే అంశాన్ని చెబుతూ వచ్చాయి. ఇంతవరకు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 240కి పైగా బీసీ కమిషన్లు సైతం కులగణనకు సిఫార్సు చేశాయి. 2010లో పార్లమెంటులో దాదాపు అన్ని పార్టీలూ కుల గణనకు ఒత్తిడి చేయగా- యూపీఏ సర్కారు మొదట అంగీకరించి, తరవాత మాట మార్చింది. 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టినా- ఆ వివరాలను బయట పెట్టలేదు. 50శాతానికి పైగా కులాలు కనీస అభివృద్ధికీ నోచుకోకుండా అన్ని రంగాల్లో వెనకబాటుకు గురైనందువల్లే ఆ సమాచారాన్ని తొక్కిపెట్టారని కొంతమంది బీసీ నేతల అభిప్రాయం.

- ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు 

(ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దట్టంగా అవినీతి కాలుష్యం

‣ చైనాపై అమెరికా దూకుడు

‣ మళ్ళీ జిన్‌పింగ్‌దే సింహాసనం

Posted Date: 17-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం