• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధికి ఆమడ దూరం

వసతుల లేమిలో గిరిజనం

దేశంలో మారుమూల పల్లెల్లో నివసించే గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఫలితంగా వారి అభివృద్ధి కుంటువడుతోంది. భారత్‌లో ఆదివాసుల జనాభా 10.43 కోట్లు. వీరు దేశ వ్యాప్తంగా 483 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. 1.17 లక్షల గ్రామాల్లో వీరి జనాభా 25 శాతానికి పైనే ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికీ 18.5 శాతం గిరిజన గ్రామాలకు సరైన రహదారుల సౌకర్యం లేదు. ఒక్క తెలంగాణలోనే 289 గ్రామాల ప్రజలు వాన కురిస్తే ఊరు దాటలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు కేవలం 28.2 శాతం గిరిజన గ్రామాలు మాత్రమే బస్సు సౌకర్యం కలిగి ఉన్నాయి. మానవ అభివృద్ధిలో విద్య పాత్ర చాలా కీలకం. ఇప్పటికీ 11.5 శాతం ఆదివాసి గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడం ఆశ్చర్యకరమే! విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్‌ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి. గిరిజన గ్రామాల్లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా నేటికీ వీరి అక్షరాస్యత దేశ సగటు కంటే 14 శాతం వెనకంజలో ఉంటోంది. ప్రభుత్వాలు గట్టిగా సంకల్పించి రహదారుల సౌకర్యాలు కల్పించాలి. పాఠశాలల్ని అందుబాటులోకి తేవడంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్యా కోర్సుల్లో వారికి శిక్షణ ఇవ్వాలి. లేదంటే నిరక్షరాస్యతతో పాటు నిరుద్యోగమూ జోరెత్తుతుంది.

సమస్యల సుడులు

మారుమూల కొండా కోనల్లో నివసించే గిరిజనులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అంతుచిక్కని రోగం వచ్చిపడినా తక్షణమే సహాయం అందించే వెసులుబాటు లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అక్కడక్కడా అందుబాటులో ఉన్నా, మౌలిక వసతుల కొరతతో పాటు మానవ వనరుల లేమీ పీడిస్తోంది. వర్షాలు జోరందుకున్న తరుణంలో వ్యాధులు ముప్పిరిగొనే ముప్పుపొంచి ఉంది. అందుకే, ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాలి. సుమారు 6.2 శాతం గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సదుపాయం కల్పించి చీకట్లను తరిమేయాలి. కేవలం అయిదు శాతం గ్రామాల్లో మాత్రమే సాధారణ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 2.5 శాతం గ్రామాల్లోనే మండీలు కొనసాగుతున్నాయి. 15 శాతం గ్రామాల్లో వారానికోసారి జరిగే సంతే ప్రజలకు ఆధారం. సమీకృత సంతలను ఏర్పాటు చేస్తే ప్రజలకు సరకులు అందుబాటులో ఉండటంతో పాటు, కొందరికి ఉపాధి దొరుకుతుంది. వారి ఉత్పత్తులకు మంచి ధరా లభిస్తుంది. 50 శాతానికి పైగా గ్రామాల్లో రేషన్‌ దుకాణాలు అందుబాటులో లేక ప్రభుత్వాలు అందించే సబ్సిడీ సరకులు సకాలంలో అందడం లేదు. వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. 18 శాతం గ్రామాల్లో నేటికీ తపాలా సౌకర్యం లేదు. చాలా చోట్ల బ్యాంకులు ఉన్నా, ఏడు శాతం గ్రామాల్లోనే ఏటీఎం సౌకర్యం కనిపిస్తుంది. జనాభా ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఏటీఎంలను అందుబాటులోకి తేవాలి. సమాచారాన్ని పంచుకోవడంలో ప్రస్తుతం సెల్‌ఫోన్లు కీలకంగా ఉన్నాయి. 15 శాతం మారుమూల గిరిజన గ్రామాల్లో సెల్‌ టవర్లు అందుబాటులో లేక ప్రజలు బయటి ప్రపంచానికి దూరమవుతున్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని అన్ని ప్రాంతాలకూ సెల్‌ సిగ్నళ్లు అందేలా చూడాలి.

తగిన కేటాయింపులు అవసరం  

గిరిజన గ్రామాల్లో తాగు నీరు కూడా పెద్ద సమస్యే. ఇప్పటికీ శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేక డయేరియా, ఇతర సమస్యలతో పసి పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దాదాపు 53 శాతం గ్రామాల్లో కొళాయి నీరు అందుబాటులో లేదు. 2024 నాటికి గ్రామీణ భారత్‌లోని ప్రతి కుటుంబానికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో 2019 ఆగస్ట్‌ 15న కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. అది ప్రస్తుతం 23.28 శాతం మేర లక్ష్యం సాధించింది. ఆ పథకాన్ని త్వరితగతిన గిరిజన గూడేలకు విస్తరించాలి. నేటికీ సగానికి పైగా గిరిజన గ్రామాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రభుత్వాలు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయలేకపోవడం వల్లే నేటికీ చాలా ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో కేటాయించిన నిధులను కూడా సరైన సమయంలో ఖర్చు చేయలేకపోవడం విచారకరం. ఆరేళ్లలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రూ.29.58 వేల కోట్లను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించినా అందులో 16.5 శాతం నిధులు దేనికి వినియోగించారో అంతుచిక్కడంలేదు. గిరిజనుల కోసం కేటాయించే నిధులను సకాలంలో వారికే ఖర్చు చేయాలి. అప్పుడే ఆ ప్రాంతాలు పురోగతి సాధిస్తాయి. వారి జీవితాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. 

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌

(‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

Posted Date: 15-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం