• facebook
  • whatsapp
  • telegram

మర విహంగాలతో పెనుముప్పు

ఆందోళనకరంగా డ్రోన్ల జోరు

సోవియట్‌ యూనియన్‌ 1957లో తొలి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని అమెరికా ఏ మాత్రం ఊహించలేదు. ఈ ఘటన తన జాతీయ భద్రతకు ముప్పని గ్రహించింది. దీన్ని ‘స్పుత్నిక్‌ మూమెంట్‌’గా వ్యవహరిస్తారు. అమెరికా రక్షణ రంగ భవిష్యత్తును అది సమూలంగా మార్చేసింది. మరుసటి ఏడాది నుంచే ప్రత్యేక ఏర్పాట్లతో, భవిష్యత్తు సాంకేతికతను ముందుగానే గ్రహించి ఒడిసిపట్టుకోవడం మొదలు పెట్టింది. భారత్‌కు ఇటీవల ‘స్పుత్నిక్‌ మూమెంట్‌’ స్థాయి ప్రమాద హెచ్చరికే జారీ అయ్యింది. జమ్మూలోని వైమానిక దళం స్థావరంపై మరడేగల వంటి అజ్ఞాత డ్రోన్లు పేలుడు పదార్థాలను జారవిడవడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారత్‌ అత్యాధునిక యుద్ధసామర్థ్యాలకు ఇది పరీక్ష. మరవిహంగాన్ని (డ్రోన్‌) ముందే పసిగట్టడం లేదా కూల్చివేయడం సంగతి పక్కన పెడితే, కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తరవాత పలు డ్రోన్లు వివిధ సైనిక స్థావరాల సమీపంలో దర్శనమిచ్చాయి. భారత్‌ వేగంగా మేలుకోకపోతే వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పాక్‌, దాని ఉగ్రసంస్థలకు అప్పనంగా అప్పజెప్పినట్లే.  

ముంచుకొస్తున్న ప్రమాదం

కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడంతో స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్ళడం కొంత తగ్గింది. ఫలితంగా  పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. చౌకగా లభించే వాణిజ్యశ్రేణి క్వాడ్‌కాప్టర్లు సైతం- సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, రాకెట్‌ లాంఛర్లను దెబ్బతీయగలవు. ఇలాంటి పరిస్థితినే అజర్‌బైజాన్‌తో యుద్ధంలో అర్మీనియా ఎదుర్కొంది. 2018లో వేలమంది దేశ సైనికుల ఎదుటే వెనెజువెలా అధ్యక్షుడు మడురోపై డ్రోన్‌తో హత్యాయత్నం జరిగింది. చైనా, పాక్‌, టర్కీలు డ్రోన్ల వినియోగంలో ఇప్పటికే మనకంటే చాలా ముందున్నాయి. చైనా, టర్కీ ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి డ్రోన్లను ఎగుమతి చేస్తున్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్‌ అల్లుడు బేరక్తర్‌ కుటుంబానికి చెందిన ‘బేకర్‌’ కంపెనీ డ్రోన్లు సిరియా, అర్మీనియా, లిబియాల్లో అరాచకం సృష్టించాయి. భారత స్థావరాలపై నిఘాకు ఇప్పటికే చైనా భారీ ఎత్తున డ్రోన్లను మోహరించింది. డ్రాగన్‌ అమ్ములపొదిలో చిన్నపాటి నానో డ్రోన్ల నుంచి సుదీర్ఘ సమయం గాలిలో ఎగురుతూ లక్ష్యాలను గుర్తించి దాడిచేసే లాయిటర్‌ మ్యూనిషన్ల దాకా ఉన్నాయి. 2011 ముందు కేవలం అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ మాత్రమే సాయుధ డ్రోన్లు వినియోగించాయి. చైనా సరళీకృత ఎగుమతుల విధానంతో 2015 నుంచి పాక్‌, ఇరాక్‌, నైజీరియా, సౌదీ, యూఏఈ, ఈజిప్ట్‌, జోర్డాన్లకు సరఫరా చేస్తున్నట్లు ‘న్యూఅమెరికా.ఓఆర్‌జీ’ పేర్కొంది. పాక్‌ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన నెస్‌కామ్‌ బుర్రాక్‌ డ్రోన్‌ ఉన్నా, చైనా నుంచి వింగ్‌లూంగ్‌ శ్రేణి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.

1998లో ఇజ్రాయెల్‌కు చెందిన సెర్చెర్‌మార్క్‌1 కొనుగోలుతో భారత్‌ డ్రోన్ల ప్రస్థానం మొదలైంది. దాదాపు 23 ఏళ్లు గడుస్తున్నా మనదేశం సొంతంగా సాయుధ డ్రోన్‌ను రూపొందించుకోలేదు. పాక్‌లో బుర్రాక్‌ సాయుధ డ్రోన్‌ 2009లో తొలి పరీక్ష జరుపుకొంటే, 2013లో ఆ దేశ వైమానిక దళంలో చేరింది. భారత్‌ 2010లో మొదలుపెట్టిన రుస్తుం-2 (తాపస్‌) ప్రాజెక్టు మందకొడిగా సాగుతోంది. పాక్‌ కంటే వనరులు, నిధులు అధికంగా ఉన్నా ఈ ప్రాజెక్టు బాలారిష్టాలను దాటలేదు. దాడిచేసే సామర్థ్యం ఉన్న ‘ఘాతక్‌’ మానవరహిత విమానం పరీక్షలు గతవారం మొదలయ్యాయి. ఇది 2024లో అందుబాటులోకి రావచ్చు. ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన హెరాప్‌లకు మాత్రమే దాడి చేసే సామర్థ్యం ఉంది. అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోళ్లపై ఏళ్ల తరబడి మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి దిగుమతి చేసుకొన్న డ్రోన్ల నిర్వహణలో అయ్యే ఖర్చులో పదోవంతు కూడా పరిశోధనలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి.  

నిబంధనల కొరడా ఝళిపించాలి

భారత్‌లో ఆన్‌లైన్‌లో వాణిజ్య శ్రేణి డ్రోన్ల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటం ప్రమాదకరమే. వాణిజ్య డ్రోన్ల విక్రయాలను నియంత్రించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి డ్రోన్‌కూ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయాలి. విడిపరికరాల సరఫరాలపై నిఘా ఉంచాలి. సున్నితమైన ప్రదేశాల సమీపంలోకి రాకుండా ‘జియోఫెన్సింగ్‌’ సాంకేతికతను అమర్చేలా తయారీదారుల్ని ఆదేశించాలి. భారత్‌లో డ్రోన్ల దాడులను ఎదుర్కొనే పటిష్ఠమైన సమగ్ర రక్షణ వ్యవస్థలు లేవు. ఇప్పటి వరకు డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన డీ-4గా పిలిచే వ్యవస్థ నాలుగు కిలోమీటర్ల వరకు రక్షణ కల్పిస్తుంది. దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాల్సి ఉంది. వినియోగంలో ఉన్న ఈ వ్యవస్థ పరిమిత ప్రదేశాలకు వాడే రక్షణ వ్యవస్థగా మాత్రమే ఉపయోగపడుతుంది. మరోపక్క నావికాదళం ఇజ్రాయెల్‌ నుంచి డ్రోన్లను కూల్చే ‘స్మాష్‌2000 ప్లస్‌’ రైఫిళ్లను కొనుగోలు చేసింది. తాజాగా డ్రోన్లను ఎదుర్కొనే ‘ఈఎల్‌ఐ- 4030’ వ్యవస్థలను భారత్‌ కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జెన్‌ టెక్నాలజీ సంస్థ సిద్ధం చేసిన జెడ్‌ఏడీఎస్‌ వ్యవస్థ 15 కి.మీ. పరిధిలోపు వరకే రక్షణ ఇవ్వగలదు. ‘జటాయు’ సంస్థకు చెందిన డ్రోన్‌ నిరోధక రైఫిల్‌ 15 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ప్రత్యేక తరంగాల ద్వారా నిర్వీర్యం చేయగలదు. ఇవి కాకుండా హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ రోబోటిక్స్‌ తయారు చేసిన ‘ఇంద్రజాల్‌’ పరిజ్ఞానంతో అత్యధికంగా రెండు వేల కిలోమీటర్ల వరకు డ్రోన్లను కృత్రిమ మేధ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి ఆధునిక సాంకేతికతల సామర్థ్యాలను వేగంగా పరీక్షించి వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. వాటి పనితీరును బట్టి అవసరాల మేరకు మెరుగుపరచుకోవచ్చు.

వేగవంతంగా ప్రాజెక్టులు

శతఘ్నులు, యుద్ధట్యాంకులకు దాదాపుగా కాలం చెల్లిపోయిన విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. వీటితో పోలిస్తే మెరుగైన కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే డ్రోన్లకు అయ్యే ఖర్చు చాలా స్వల్పం. ప్రభుత్వం ఐఐటీలు, ఇతర ప్రైవేటు సంస్థలతో కలిసి దేశీయ డ్రోన్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. ఐఐటీ చెన్నైలో చేపట్టిన ప్రాజెక్టుకు రూ.10 కోట్లలోపు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వ సంస్థలు వెనకాడగా ఎంఎస్‌ఎంఈల సహకారంతో మొదలుపెట్టారు. కోయంబత్తూరులో ఒక సంస్థ డ్రోన్ల ఇంజిన్లను జర్మనీకి ఎగుమతి చేస్తున్న విషయాన్ని వీరు గుర్తించి, అక్కడి నుంచి ఇంజిన్లు తీసుకొన్నట్లు ఐఐటీ చెన్నైలో వైమానిక విభాగం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ రవిశంకర్‌ వెల్లడించారు.

- పెద్దింటి ఫణికిరణ్‌

Posted Date: 08-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని