• facebook
  • whatsapp
  • telegram

మసిబారిన ఇంధన విధానాలు

ప్రత్యామ్నాయ విద్యుదుత్పత్తి మార్గాలే శరణ్యం

దేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను తీవ్ర బొగ్గు కొరత పీడిస్తోంది. ఇప్పట్లో ఈ కొరత తీరే అవకాశాల్లేవని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒకరకంగా ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణం. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును తీర్చడంలో థర్మల్‌ కేంద్రాల పాత్ర కీలకం. రోజువారీ జాతీయ విద్యుత్‌ డిమాండు రికార్డు స్థాయిలో రెండు లక్షల మెగావాట్లకు చేరింది. అందులో 70శాతం బొగ్గుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ వల్లే తీరుతోంది. ఇది బొగ్గు కొరతకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్యంగా పెరుగుతున్న బొగ్గు ధరలు చైనా, భారత్‌ వంటి దేశాల ఇంధన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని సవాలు చేస్తున్న చైనాలో రోజూ గంటల కొద్దీ కరెంటు కోతలు విధించాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన బొగ్గు ధరలు, కొరతలే అందుకు ప్రధాన కారణాలు. ప్రపంచమంతా వాడే బొగ్గులో 65శాతం వాటా చైనా, ఇండియాలదే. వీటి తరవాతి స్థానాల్లో ఆసియా దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా ఉన్నాయి.

బకాయిల ఊబిలో డిస్కమ్‌లు

ఇండియాలో కొవిడ్‌ సంక్షోభానికి ముందు 2019 ఆగస్టు నెలలో 10,600 కోట్ల యూనిట్ల విద్యుత్‌ డిమాండు నమోదైతే, 2021 ఆగస్టులో అది 12,400 కోట్ల యూనిట్లకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో రోజూవారీ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 13 వేల మెగావాట్లుంటే, ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రోజువారీ డిమాండు 13,608 మెగావాట్లకు చేరింది. ఇక ఏపీలో మరో     10 వేల మెగావాట్లుంది. అంటే ఏడేళ్లలోనే దాదాపు 80శాతం అదనంగా కరెంటు డిమాండు పెరిగింది. ఇప్పుడు దేశంలోని మొత్తం 135 థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. పలు థర్మల్‌ కేంద్రాలు నిత్యం బొగ్గు కొంటున్నా ఆ సొమ్మును గనుల యాజమాన్యాలకు నిర్ణీత గడువులోగా చెల్లించడం లేదు. బొగ్గు తవ్వకం నుంచి మొదలుపెడితే దాన్ని తీసుకెళ్ళి మండించి, కరెంటు ఉత్పత్తి చేసి, ప్రజలకు విక్రయించేదాకా సాగుతున్న ప్రక్రియను రాష్ట్రాల ప్రభుత్వాలు ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇది అంతిమంగా దేశ ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బొగ్గు తవ్వితే దాన్ని విద్యుదుత్పత్తి కేంద్రాలు కొంటాయి. దానికి సొమ్ము చెల్లించాలి. విద్యుదుత్పత్తి కేంద్రా(జెన్‌కో)లకు సొమ్ము రావాలంటే అవి ఉత్పత్తి చేసిన కరెంటును విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు అమ్మాలి. కరెంటును కొన్న డిస్కమ్‌లు సొమ్ము చెల్లించాలంటే అవి ప్రజలకు విక్రయించి డబ్బు రాబట్టాలి. ఇక్కడే మెలిక ఉంది. బొగ్గు తవ్వకానికి అవుతున్న ఖర్చులను గానీ, దాని విక్రయ ధర లేదా కొనుగోలు ధర, లేదా కరెంటు కొనుగోలు ధరలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. డిస్కమ్‌లు ప్రజలకు కరెంటు విక్రయించే అంతిమ ధరను మాత్రం ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు విక్రయించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తున్నాయి. నష్టాలొస్తే రాయితీల రూపంలో నిధులిస్తామని చెబుతున్నా, ఆ హామీ సరిగ్గా అమలు కావడంలేదు. దానివల్ల డిస్కమ్‌లు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిస్కమ్‌ల నష్టాలు రూ.55 వేల కోట్లకు చేరాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డిస్కమ్‌ల నష్టాలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. డిస్కమ్‌లు దేశంలో జెన్‌కోలకు రూ.90 వేల కోట్లకు పైగా బకాయి పడ్డాయి. ఈ సొమ్ము చేతికి రాక జెన్‌కోలు బొగ్గు గనులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడుతున్నాయి. ఈ చక్రవ్యూహంలో ఏ సంస్థలూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేకపోతున్నాయి. 

‘థర్మల్‌’ వాటాయే అధికం

అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దాల క్రితం నుంచే బొగ్గు వినియోగాన్ని క్రమంగా తగ్గించే ప్రణాళికలకు చోటుపెడుతున్నాయి. సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికా వాడుతున్న కరెంటులో బొగ్గు ఆధారిత థర్మల్‌ కేంద్రాల నుంచి వచ్చేది కేవలం 9.2 శాతమే. జర్మనీలో అయితే ఒక్కశాతంలోపే థర్మల్‌ విద్యుత్‌ ఉంది. భారతదేశంలో ఈ ఏడాది మొత్తం కరెంటులో థర్మల్‌ విద్యుత్‌ 64 శాతానికి చేరింది. కరెంటు కోసం అడ్డగోలుగా బొగ్గును మండిస్తున్నందువల్ల గాలిలోకి 244 కోట్ల టన్నుల కాలుష్యకారక వాయువులు విడుదలవుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులొచ్చి పంటలు సరిగ్గా పండటం లేదు. సౌర, పవన విద్యుత్తు రంగాల్లో 2022 కల్లా లక్షా 75 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఉత్పత్తి కేంద్రాలను స్థాపించనున్నట్లు ప్రధాని మోదీ ఆరేళ్ల క్రితం ప్రకటించారు. కానీ ఇప్పటికింకా లక్ష మెగావాట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాలనే ఏర్పాటు చేశారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి  పెరగకపోతే 2040 నాటికి భారత్‌లో బొగ్గు వినియోగం మరో 40 శాతం అధికమై కాలుష్యం విపరీతమై, అనేక అనర్థాలు తప్పవని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నా రాష్ట్రాలు సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచకుండా- థర్మల్‌ కేంద్రాలపై అధికంగా ఆధారపడటంవల్లే నేడు దేశంలో బొగ్గు సంక్షోభం కోరలు చాస్తోంది. వ్యవసాయానికి వాడే విద్యుత్‌పై ఏటా దేశంలో లక్ష కోట్ల రూపాయలమేర రాయితీలిస్తున్నారు. వ్యవసాయబోర్లకు సౌరవిద్యుత్‌ ఏర్పాటుచేస్తే ఈ లక్ష కోట్లు మిగలడమే కాకుండా బొగ్గు ఆధారిత కరెంటు వినియోగం, కాలుష్యం తగ్గుతాయి. ఇలాంటి దీర్ఘకాలిక ఇంధన అభివృద్ధి ప్రణాళికలు లేకుండా భూమిలో బొగ్గున్నంత వరకు తవ్వుకుంటూ పోయి కరెంటును ఉత్పత్తి చేస్తామనే ప్రస్తుత విధానాలనే కొనసాగిస్తే- ఏదో ఒకనాటికి ఎటు చూసినా గాఢాంధకారమే ఎదురయ్యే ముప్పు పొంచి ఉంది.

వినియోగం పెరిగి... బొగ్గు కొరత

బొగ్గు లేకపోతే చాలా దేశాలు కరెంటు కోతలతో గాఢాంధకారంలో మునిగిపోవడం ఖాయం. నిరుడు కొవిడ్‌ కారణంగా పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బొగ్గు డిమాండు 2019తో పోలిస్తే 2020లో నాలుగు శాతం మేర తగ్గింది. 2020తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం అదనంగా పెరిగింది. చైనాలో 2020 జనవరి-జులై మధ్యకాలంతో పోలిస్తే 2021లో అదే కాలానికి ఏకంగా 13.5శాతం ఎక్కువగా విద్యుదుత్పత్తి చేశారు. ఇందుకోసం 2021 జులైలో 16శాతం అధికంగా బొగ్గు దిగుమతుల్ని పెంచారు. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు టన్ను ధర ఏడాది వ్యవధిలోనే 60 డాలర్ల నుంచి 220 డాలర్లకు చేరి, విద్యుత్‌రంగంపై తీవ్ర ఆర్థికభారం పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలకూ రెక్కలొస్తున్నాయి.

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 19-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం