ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వం సంస్కరణల పేరుతో చేసిన విధ్వంసం కారణంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది విద్యార్థుల చేరికలు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 మందిలోపు విద్యార్థులు చేరిన బడులు 6,216 ఉన్నాయి. ఐదుచోట్ల ఒక్కరూ చేరలేదు. ఇక్కడ సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. మరికొన్ని బడుల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే చేరారు. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు, ఏకోపాధ్యాయ బడులు పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 33,480 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గతేడాది పిల్లలు లేక 118 వరకు బడులు మూతపడ్డాయి. ఎయిడెడ్ పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. గత ప్రభుత్వం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానమంటూ 4,300 పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తీసుకెళ్లి ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేసింది. ఇలాంటి చోట 1,2 తరగతులే మిగిలాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!