* ఇప్పటివరకు నాన్చి.. అనుమతి ఇవ్వనున్న విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: బీటెక్ అదనపు సీట్ల మంజూరుపై ఇన్నాళ్లూ నాన్చివేత ధోరణి ప్రదర్శించిన విద్యాశాఖ.. వాటికి అనుమతి ఇచ్చేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలోనే వెబ్ ఆప్షన్ల గడువు కూడా పొడిగించింది. ప్రస్తుతం సుమారు 99 వేల బీటెక్ సీట్లున్నాయి. అందులో కన్వీనర్ కోటా కింద 70,500 వరకు ఉన్నాయి. వాటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, పలు కళాశాలలు డిమాండ్ లేని బ్రాంచీలను మూసివేసుకొని.. ఆయా సీట్లను డిమాండ్ ఉన్న సీఎస్ఈకి మార్చుకుంటామని (కన్వర్షన్) దరఖాస్తు చేశాయి. అలాంటివి దాదాపు 6,500 సీట్ల వరకు ఉండొచ్చని అంచనా. వాటికి అనుమతి ఇవ్వడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం కూడా లేదు. అయినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. దానికితోడు ఏఐసీటీఈ ఇచ్చిన వెసులుబాటుతో దాదాపు 20,500 వరకు సీట్లను కళాశాలలు పెంచుకున్నాయి. ప్రభుత్వం వద్ద వాటి అనుమతి పెండింగ్లో పడింది. ఇప్పుడు కేవలం కన్వర్షన్కే అనుమతి ఇస్తారా? కొత్త సీట్లకు కూడా పచ్చజెండా ఊపుతారా? అన్నది నేడో రేపో తేలనుంది.
‘ఇంజినీరింగ్’ వెబ్ ఆప్షన్ల గడువు 17 వరకు పొడిగింపు
ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును జులై 17 వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్లకు తుది గడువు జులై 15 తో ముగియాల్సి ఉంది. అయితే, అదనపు సీట్లను కౌన్సెలింగ్కు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున గడువును జులై 17 వరకు పెంచినట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. జులై 15న మొత్తం 93,167 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.