* పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాదుడు
* పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమా?
* స్థానికేతర ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు, జోన్ల జాబితా
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)కి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. ఎన్నికల ముందు ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన విడుదల చేసి, అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఫిర్యాదు చేయాలంటే సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పని చేయవు. తప్పులు వస్తే సరిచేయడానికి ఐచ్ఛికం ఇవ్వకుండా మరోసారి రూ.750 ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇది ప్రభుత్వమా? ఓ ప్రైవేటు వ్యాపార సంస్థనా? ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి దుస్థితి ఉందా? ఒక అభ్యర్థి దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పుడు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసే వారిలో చాలా మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికితోడు దరఖాస్తులకే అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
స్థానికత.. స్థానికేతర కనిపించదు..
డీఎస్సీలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఐచ్చికాన్ని ఎంపిక చేసుకుంటే 13 జిల్లాల పేర్లు చూపించాలి. కానీ, దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం ఒక్కటే వస్తుంది. జిల్లాల జాబితా చూపడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 2,280 ఉంటే ఒక్క కర్నూలు జిల్లాలోనే 1,022 పోస్టులున్నాయి. ఒకవేళ వేరే జిల్లా అభ్యర్థి ఈ జిల్లాలో మెరిట్ కోటా 15 శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండాపోయింది. ఇలా స్కూల్ అసిస్టెంట్, ఇతరత్రా వాటిల్లోనూ స్థానికేతర కోటాలో దరఖాస్తు చేసేందుకు జిల్లాల జాబితా కనిపించాలి. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తుల్లో ఈ సదుపాయం లేకుండాపోయింది. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నా ఎవ్వరు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి. ఒక జోన్లో ఉన్న వారు మరో జోన్కు దరఖాస్తు చేసుకుంటారు. స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ను ఎంచుకుంటారు. డీఎస్సీ దరఖాస్తులో స్థానికేతర ఐచ్చికం వస్తుందే తప్ప జోన్ల జాబితా చూపడం లేదు. దీంతో పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఆందోళనకు గురవుతున్నారు.
డబ్బులు చెల్లిస్తున్నా ఐడీ రావట్లేదు..
దరఖాస్తు చేసే సమయంలో మొదట దరఖాస్తు ఫీజు చెల్లించే ఐచ్చికాన్ని పెట్టారు. దరఖాస్తు చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ రావాలి. కొన్నిసార్లు ఇది సక్రమంగా రావడం లేదు. కొంతమందికి 8 అంకెల నంబరు వస్తే.. మరికొందరికి 9 అంకెల నంబరు వస్తోంది. తొమ్మి అంకెలను నమోదు చేస్తే దరఖాస్తును స్వీకరించడం లేదు.
దరఖాస్తుకు 10 రోజుల సమయం ఇచ్చారు. సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.