* ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య
* వివరాలు సమర్పించాలని ఆదేశం
* విచారణ రేపటికి వాయిదా
ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ-డీఎస్సీ)లను ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూల్, ప్రస్తుత తేదీలను పరిశీలిస్తే ఈ వ్యవహారం అర్థమవుతోందని పేర్కొంది. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఫిబ్రవరి 19న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న, ఉపాధ్యాయుల భర్తీ కోసం ఫిబ్రవరి 12న వెలువరించిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులని.. టెట్ ఫలితాలు మార్చి 14న ప్రకటిస్తారని, మరుసటి రోజే (15వ తేదీ) టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. సిలబస్ ఎక్కువ ఉండటంతో తక్కువ వ్యవధిలో టెట్ పరీక్షకు సిద్ధమవడం సాధ్యపడదని పేర్కొన్నారు. కేవలం 19 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని చెప్పారు. మరోవైపు టీఆర్టీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం లేదన్నారు. పరీక్షలను హడావుడిగా ముగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని వెల్లడించారు. అభ్యర్థులకు సముచిత సమయం ఇవ్వాలని కోరారు. వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. ప్రభుత్వం హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేశారు.
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై నేడు విచారణ
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా పడింది. వాస్తవానికి ఈ వ్యాజ్యాలు హైకోర్టు సీజే (ప్రధాన న్యాయమూర్తి) ధర్మాసనం ముందు ఫిబ్రవరి 19న లిస్ట్ అయ్యాయి. సీజే సెలవు కావడంతో.. వాటిపై త్వరగా విచారణ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వారి అభ్యర్థన మేరకు ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ ఆరు మెట్లతో ఆఫర్ లెటర్ అందుకోండిలా!
‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.