'నాకు చదివింది గుర్తు రావడంలేదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది..' అంటూ చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి జ్ఞాపకశక్తి పెరగడం, తగ్గడం అంటూ ఉండదు. అదీ విద్యార్థి దశలో..
చదివిన అంశాలు సమయానికి గుర్తుకు రావడంలేదంటే దానికి కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. అనేక పనులను నిర్వహించే బాధ్యతను స్వీకరించడంవాటిలో ఒకటి. అవసరం లేని విషయాలన్నిటినీ బుర్రలోకి ఎక్కించడం, తక్కువ సమయంలో ఎక్కువ పనులను భుజాలకెత్తుకోవడం, రకరకాల ఒత్తిళ్లు వంటివెన్నో ఇందుకు కారణమవుతాయి. కొన్ని విషయాలు సమస్యాత్మకంగా, జటిలంగా తయారవడం; పరిష్కారం సాధ్యం కాదనేంతగా సమస్య మెలిక పడటం వంటవీ మరపునకు దారితీస్తాయి.
మనకు అప్పుడప్పుడు మన కారు తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తు ఉండదు. ఆఫీసులో ఫైలు ఉంచిన చోటులో కనబడక తెగ వెతుకుతాం. ఆఫీసుకు తొందర అవుతుంది. తాళాలు కనిపించవు, ఫైలు కనిపించదు. ఏదీ పెట్టిన చోటులో ఉండదు. ఎక్కడో ఉంచి మరెక్కడో వెతుకుతాం. ఇంట్లో వాళ్ల మీద చికాకుపడతాం.