• facebook
  • whatsapp
  • telegram

భూతాపం.. మానవాళికి శాపం!

మునుపెన్నడూ లేనంత వేగంగా భూమి కొంతకాలంగా   వేడెక్కుతోంది. దాంతో తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మానవాళిని అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ అంశాన్ని దేశంలోని అన్ని వైద్య కోర్సుల్లోనూ భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఆ దిశగా దేశంలోని అన్ని వైద్యవిద్య మండళ్లతో కలిసి కసరత్తు ఆరంభించింది.

భూఉష్ణోగ్రత మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. పారిశ్రామిక కార్యకలాపాలు, కర్బన ఉద్గారాలు, అటవీ ప్రాంతాలు కుంచించుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. పారిశ్రామిక విప్లవానికి ముందుకన్నా ఇప్పుడు భూఉష్ణోగ్రత 1.2 డిగ్రీలు పెరిగింది. ఈ తేడాకే భూగోళమంతా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ధ్రువాలు, హిమాలయాలు, ఆల్ప్స్‌ వంటి పర్వతశ్రేణుల్లో మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయి. ఎడారులు విస్తరిస్తున్నాయి. ప్రచండమైన ఎండలు, కుండపోత వర్షాలు సర్వసాధారణమవుతున్నాయి. నగరాలను తరచూ వరదలు ముంచెత్తుతున్నాయి. ఆర్థిక నష్టాలు ఉద్ధృతం అవుతుండటంతో జనం వలసబాట పడుతున్నారు. సాయుధ సంఘర్షణలు పెచ్చరిల్లుతూ ఆహార, ఇంధన కొరతలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి.

ఆరోగ్యానికి పెనుముప్పు

భూతాపం మానవాళి ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 2015 పారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం- భూఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌లోపే కట్టడి చేయాలని ప్రపంచదేశాలు నిర్ణయించాయి. కానీ పరిస్థితి మారలేదు. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి  నాటికి భూఉష్ణోగ్రత 2.7 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే కర్బన ఉద్గారాలు 2030కల్లా సగం తగ్గాలి. 2050కల్లా కర్బన ఉద్గారాల తటస్థత (జీరోఎమిషన్స్‌)కు చేరుకోవాలి. పారిశ్రామిక విప్లవకాలం నుంచి బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వెలికితీత, వినియోగం ఎక్కువై కర్బన ఉద్గారాలు విజృంభిస్తున్నాయి. 2019లో భూవాతావరణంలో బొగ్గుపులుసు వాయువు 48శాతం, మీథేన్‌ 160శాతం పెరిగాయి. బొగ్గుపులుసు వాయువు పెరుగుదలతో అధిక వేడి, దీర్ఘకాల అనావృష్టి ఏర్పడి వ్యవసాయ ఉత్పాదకత తగ్గింది. ముఖ్యంగా మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్‌ దిగుబడులు పెరగడంలేదు. సముద్రాలు వేడెక్కడంతో మత్స్య సంపద తరుగుతోంది. ఫలితంగా ప్రపంచమంతటా మరో 18.3 కోట్ల మంది ఆకలి బాధకు గురయ్యే పరిస్థితి నెలకొంది. పోనుపోను నీటి ప్రవాహాలు తగ్గిపోయి కోట్లాది ప్రజల జీవానాధారం దెబ్బతింటుంది. తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడుతుంది. సముద్ర మట్టాలు పెరిగి చిన్నచిన్న దీవులు కనుమరుగవుతాయి. పంటల దిగుబడి తగ్గడం వల్ల ఆకలి బాధతో పాటు పోషకాహారలోపం బారినపడే బాలల సంఖ్య పెరిగిపోతుంది. భూతాపం పెరిగేకొద్దీ జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడదెబ్బ, శ్వాసకోశ వ్యాధులు, హృద్రోగాలు, మానసిక సమస్యలు  అధికమవుతాయి. వాతావరణ మార్పుల వల్ల 2030-2050 మధ్య ఏటా అదనంగా 2,50,000 మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రధానంగా వృద్ధులు, చిన్నారుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఆహార కొరత వల్ల 2050కల్లా ఏటా అయిదు లక్షల మంది వయోజనులకు మరణముప్పు పొంచి ఉంది! ఈ సవాళ్లను సమర్థంగా అధిగమించేందుకు భారత్‌ సిద్ధపడుతోంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలను చుట్టుముడుతున్న వ్యాధులను నియంత్రించేందుకు వైద్య విద్యార్థులందరికీ శిక్షణ ఇప్పించాలని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) నిర్ణయించింది. ఈ విషయమై జాతీయ వైద్య, దంత వైద్య మండళ్లు, ఆయుష్‌, నర్సింగ్‌ కౌన్సిళ్లతో తాజాగా సమాలోచనలు జరిపింది.

పునరుత్పాదక ఇంధనాలతో...

కొత్తగా 2019లో నెలకొల్పిన విద్యుత్‌ కేంద్రాల్లో 75శాతం సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 2050 కల్లా బొగ్గును పూర్తిగా పక్కనపెట్టి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్ళితేనే కర్బన ఉద్గార తటస్థత లక్ష్యాన్ని అందుకోగలం. విద్యుత్‌ వాహనాల వినియోగం, హీట్‌ పంపుల వంటి కొత్త సాంకేతికతలు కర్బన ఉద్గారాలను తగ్గిస్తాయి. వాహనాలతో పాటు నౌకలు, విమానాల్లోనూ పునరుత్పాదక ఇంధనాలను ఎక్కువగా వినియోగించాలి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు విధానాలను రూపొందించి, పటిష్ఠంగా అమలు చేయాలి. వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలించేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలి. వాతావరణంలో మీథేన్‌ పాళ్లను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు 2021 నవంబరులో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శీఘ్రంగా అమలుచేయాలి. వర్ధమాన దేశాలు వాతావరణ మార్పులను అధిగమించడానికి ధనిక దేశాలు ఆర్థిక సహాయం అందించాలి. ఇందుకు అవి గతంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భద్రతామండలి ప్రక్షాళన ఇంకెప్పుడు?

‣ వ్యూహాత్మక ముందడుగే ఉపయుక్తం

‣ తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ తెలంగాణ బ‌డ్జెట్ 2023-24

Posted Date: 17-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం