• facebook
  • whatsapp
  • telegram

ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలు

క్రెమ్లిన్‌ పట్టు విడుపుల ఉచ్చు

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ గొంతుపై కత్తిపెట్టి మరీ చర్చలు జరిపి డిమాండ్లను సాధించుకొనేందుకు సిద్ధమైన క్రెమ్లిన్‌- ఆ దేశంపై దాడులు చేసేందుకు అవసరమైన బలగాలను క్రిమియా, బెలారస్‌ సరిహద్దులకు తరలించింది. ఆ మోహరింపులు ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటో కూటమి నిర్వహించిన అతిపెద్ద యుద్ధ విన్యాసాలైన ‘రీఫోర్జర్‌’ కంటే పెద్దవి. ఆ పరిణామాలను విశ్లేషించిన అమెరికా ఫిబ్రవరి 16 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలవుతాయని ప్రకటించింది. దానికి ఒక రోజు ముందు పాక్షిక సైనిక విరమణను ప్రకటించిన రష్యా- అమెరికా ప్రచారాన్ని తప్పుగా నిరూపించే యత్నం చేసింది. మరోవైపు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. రష్యా మాటలు, చేతలను పాశ్చాత్య దేశాలు విశ్వసించడంలేదు. అతి త్వరలోనే ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్‌ దాడికి దిగే ప్రమాదం ఉందని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.

తిరుగుబాటుదారులకు సహకారం

ప్రస్తుతం నాటో విస్తరణ మాస్కోను అధికంగా భయపెడుతోంది. అటు ఐరోపా సమాఖ్యతో, ఇటు రష్యాతో సరిహద్దు పంచుకొనే ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరితే- భవిష్యత్తులో క్రిమియాను సైతం చేజార్చుకోవాల్సి వస్తుందన్నది పుతిన్‌ భయం. వాస్తవానికి ఉక్రెయిన్‌ రష్యాలో భాగమేనని గతేడాది క్రెమ్లిన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో పుతిన్‌ స్పష్టం చేశారు. 2014లో క్రిమియా విలీనం సమయంలోనే ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌లో (దొనెట్క్స్‌, లుహాన్స్క్‌) వేర్పాటువాదాన్ని క్రెమ్లిన్‌ ప్రోత్సహించింది. అక్కడ హింసకు ముగింపు పలికేందుకు 2015లో బెలారస్‌ రాజధాని మిన్స్క్‌లో ఉక్రెయిన్‌, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాధినేతలు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. మిన్స్క్‌ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌, మాస్కోలు వేర్వేరుగా అన్వయించుకోవడం సమస్యకు మూలంగా నిలుస్తోంది. ఆ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని మాస్కో డిమాండు చేస్తోంది. కొన్ని నామమాత్రపు అధికారాలు కేటాయించి తిరిగి డాన్‌బాస్‌ ప్రాంతంపై పట్టు సాధించడానికి ఆ ఒప్పందం ఉపయోగపడుతుందని ఉక్రెయిన్‌ భావిస్తోంది. మరోవైపు ఉత్తర క్రిమియా కాల్వకు నీటి సరఫరాను ఉక్రెయిన్‌ తొక్కిపట్టడం క్రెమ్లిన్‌కు ఆగ్రహం కలిగించింది. క్రిమియాలో తగిన జల వనరులు లేవు. దాంతో రష్యాలోని నీపెర్‌ నది నుంచి ఉక్రెయిన్‌ మీదుగా ‘ఉత్తర క్రిమియా కాల్వ’ ద్వారా నీటిని తరలిస్తారు. 2014 తరవాత నీటి సరఫరాలో ఉక్రెయిన్‌ సమస్యలు సృష్టించడంతో క్రిమియాలో కరవు పరిస్థితి నెలకొంది. 

ఉక్రెయిన్‌కు మద్దతు గురించి యోచించడానికి సైతం మిత్రదేశాలు భయపడేలా చేసేందుకే పుతిన్‌ తాజాగా సైనిక మోహరింపులు చేపట్టారని ర్యాండ్‌ కార్పొరేషన్‌కు చెందిన రాజకీయ విశ్లేషకులు శామ్యూల్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని తిరుగుబాటుదారులను బలోపేతం చేయడం, నాటో-అమెరికాను అడ్డుకోవడం పుతిన్‌ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో గత డిసెంబరులో బైడెన్‌తో జరిగిన భేటీలో పుతిన్‌ పలు డిమాండ్లను బయటపెట్టారు. తూర్పు ఐరోపాలో నాటో కార్యకలాపాలను నిలిపివేసి 1997 నాటి స్థితికి నాటో వెళ్ళాలని; పోలండ్‌, రొమేనియాల్లో మోహరించిన క్షిపణులను తొలగించాలని రష్యా కోరింది. ఇష్టం ఉన్నా లేకపోయినా, మిన్స్క్‌ ఒప్పందం ప్రకారం దొనెత్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని క్రెమ్లిన్‌ డిమాండు చేసింది. పైగా సరిహద్దు ఇవతలి నుంచి తిరుగుబాటుదారులకు సహకారం అందిస్తోంది. ఈ చర్యలు ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులు మరిన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు దారులు తెరవవచ్చు. మరోవైపు డాన్‌బాస్‌ ప్రాంతంలోని దాదాపు ఏడు లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు ఇచ్చింది. తిరుగుబాటుదారుల ఆక్రమణలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలనే బిల్లును రష్యా చట్టసభ డుమా- పుతిన్‌ ముందుకు తీసుకొచ్చింది. 2014లో క్రిమియా ఆక్రమణ తరవాతి పరిణామాలను విశ్లేషించిన పుతిన్‌- రష్యా ఆర్థిక వ్యవస్థపై పశ్చిమ దేశాల ఆంక్షలు ప్రభావం చూపకుండా చర్యలు తీసుకొన్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద సుమారు 63 వేల కోట్ల డాలర్ల విలువైన కరెన్సీ నిల్వలు ఉన్నాయి. అందులో డాలర్లను 16శాతానికే పరిమితం చేసి, అత్యధికంగా యూరో, రెన్‌మిన్‌బి (చైనా కరెన్సీ), బంగారం ఉండేలా చూసుకొన్నారు. 

భారత్‌ ఆచితూచి...

ఉక్రెయిన్‌ సంక్షోభంతో అమెరికా-రష్యాల్లో ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి భారత్‌కు తలెత్తే అవకాశం ఉంది. వాషింగ్టన్‌తో ఇండియా దాదాపు 14,500 కోట్ల డాలర్లకుపైగా వ్యాపారం సాగిస్తోంది. మరోవైపు మాస్కో నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకొంటుంది. దాంతో ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ‘ఉక్రెయిన్‌ అంశం’ ప్రస్తావనపై జరిగిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. మాస్కో నుంచి ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోళ్లపై అమెరికా కాట్సా ఆంక్షలు ప్రయోగించే ముప్పు పొంచి ఉంది. మరోవైపు రష్యాకు గ్యాస్‌ ఆదాయం తగ్గకుండా ఉండాలన్నా, అగ్రరాజ్యం ఆంక్షలను ఎదుర్కోవాలన్నా చైనా సహకారం తప్పనిసరి. అదే సమయంలో అమెరికా దృష్టి క్వాడ్‌తో పోలిస్తే నాటోపై ఎక్కువగా కేంద్రీకృతమవుతోంది. అది డ్రాగన్‌ మరింత బలపడటానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్‌ దుశ్చర్యలను ఎదుర్కొనేందుకు క్రెమ్లిన్‌ మద్దతు ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి. అమెరికా-రష్యాలతో సంబంధాల సమతౌల్యం కాపాడుకొంటూ చైనాను ఎదుర్కోవడం భారత్‌కు సవాలుగా మారనుంది.

గ్యాస్‌ రాజకీయం

రష్యా బడ్జెట్‌లో గ్యాస్‌, చమురు నుంచి వచ్చే ఆదాయమే కీలకం. ఐరోపా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన గ్యాస్‌లో 40శాతం రష్యా నుంచే సరఫరా అవుతోంది. జర్మనీ అవసరాలను తీర్చడంలో దానిదే కీలక పాత్ర. క్రెమ్లిన్‌పై ఆంక్షలు విధించాల్సివస్తే కొత్తగా నిర్మించిన నార్డ్‌స్ట్రీమ్‌-2 గ్యాస్‌ పైప్‌లైన్‌ను మినహాయించాలని జర్మనీ కోరుకొంటోంది. అందుకోసం అమెరికాను ఒప్పించేందుకు జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ విఫలయత్నం చేశారు. ‘స్విఫ్ట్‌’ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) నుంచి రష్యా బ్యాంకులను దూరం చేయడం, పుతిన్‌ ఆంతరంగికులపై ఆంక్షలు విధించడం వంటివి అమెరికా పరిశీలనలో ఉన్నాయి. పుతిన్‌తో చర్చల కోసం జర్మన్‌ ఛాన్స్‌లర్‌ మాస్కో చేరుకొన్న వేళ- పరిమిత సంఖ్యలో బలగాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించి దౌత్య పరిష్కారంపై సానుకూల సంకేతాలను క్రెమ్లిన్‌ పంపింది. కానీ, తూర్పు ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల దుశ్చర్యలు తీవ్రమయ్యాయి. మరోవైపు నేటి నుంచి తమ వ్యూహాత్మక దళాల యుద్ధ విన్యాసాలను పుతిన్‌ నేరుగా పర్యవేక్షించనున్నట్లు మాస్కో ప్రకటించింది.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మర్యాదలకూ మేనేజర్లు!

‣ సమయం ఇలా సద్వినియోగం!

‣ బ్లాక్‌ టెక్నాలజీలో కొలువుల చెయిన్‌!

‣ IISC: ఐఐఎస్సీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

‣ సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 19-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం