• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌కు యుద్ధపోటు

బీఆర్‌ఐ భవితపై నీలినీడలు

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు ప్రతిష్ఠాత్మకమైన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌కు (బీఆర్‌ఐ) ఉక్రెయిన్‌ సంక్షోభం గొడ్డలిపెట్టుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకపక్షంగా యుద్ధం ఆరంభించిన రష్యాకు డ్రాగన్‌ పరోక్షంగా మద్దతు పలుకుతుండటమే అందుకు కారణం. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం పాటుపడే అగ్రరాజ్యంగా తనను తాను ప్రచారం చేసుకుంటున్న చైనా- ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న తీరు ఐరోపా దేశాలకు అసంతృప్తి కలిగిస్తోంది. జిన్‌పింగ్‌ మాటలు ఎంతమాత్రమూ విశ్వసనీయం కాదని తాజా పరిణామాలతో స్పష్టమైందని అవి భావిస్తున్నాయి. బీఆర్‌ఐలో భాగంగా బీజింగ్‌తో వాణిజ్య, సాంకేతిక, రవాణా సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై అవి పునరాలోచనలో పడుతున్నాయి.

సరఫరా గొలుసులో కీలకం

భూతల, జల మార్గాల ద్వారా ఆఫ్రికా, ఐరోపాలతో ఆసియాను అనుసంధానించి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా అవతరించాలన్న ధ్యేయంతో బీఆర్‌ఐను డ్రాగన్‌ తలపెట్టింది. ఆధునిక సిల్క్‌ రోడ్డుగా దాన్ని వ్యవహరిస్తున్నారు. చైనాలోని లియాన్‌యూన్‌గాంగ్‌ నుంచి నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యాం వరకు ఏర్పాటుచేసిన ‘న్యూ యూరేసియన్‌ ల్యాండ్‌ బ్రిడ్జ్‌’ (ఎన్‌ఈఎల్‌బీ)- బీఆర్‌ఐలోని కీలక ప్రాజెక్టుల్లో ఒకటి. పోలాండ్‌, బెలారస్‌, రష్యాల గుండా సాగే ఈ మార్గం పొడవు 10 వేల కిలోమీటర్ల పైమాటే. 2017లో ఐరోపా, చైనాలను అనుసంధానిస్తూ 40 సరకు రవాణా మార్గాలు ఉండేవి. బీఆర్‌ఐతో ప్రస్తుతం ఆ సంఖ్య 78కి పెరిగింది. 23 ఐరోపా దేశాల్లోని 180 నగరాలను చైనాతో అవి అనుసంధానిస్తున్నాయి. 2017లో భూతల మార్గాల్లో చైనా నుంచి 800 కోట్ల డాలర్ల విలువైన సరకు రవాణా జరిగింది. 2021లో అది ఏకంగా దాదాపు 7500 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆ రవాణా మార్గాలు కీలకంగా ఎదిగాయని చెప్పేందుకు అది నిదర్శనం. ఉక్రెయిన్‌ సంక్షోభంలో రష్యా పక్షాన నిలవడం చైనాకు ఇబ్బందులు కొనితెచ్చే అవకాశముంది. ముఖ్యంగా బీఆర్‌ఐ రైల్వే ప్రాజెక్టుల్లో కీలకంగా ఉన్న పోలాండ్‌... అమెరికా, చైనాల మధ్య సంబంధాలను సమతుల్యం చేసుకోలేక కొన్నేళ్లుగా తంటాలు పడుతోంది. రష్యా ఆధిపత్య ధోరణిని ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి శరణార్థులు పోటెత్తుతుండటం పోలాండ్‌కు కొత్త తలనొప్పిగా మారింది. డ్రాగన్‌ మద్దతు వల్లే పుతిన్‌ తాజా యుద్ధానికి తెగబడ్డారని అత్యధికులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలాండ్‌ పూర్తిగా అమెరికా వైపు మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, పుతిన్‌ వైఖరిని ఖండిస్తూ పలు ఈయూ దేశాలు తమ గగనతలంలో రష్యా విమానాల ప్రవేశాన్ని ఇప్పటికే నిషేధించాయి. మున్ముందు అవి రష్యా గుండా రైళ్ల రాకపోకలపైనా ఆంక్షలు ప్రకటించడం లాంఛనమేనని అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఎన్‌ఈఎల్‌బీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. నాణ్యత లేని ప్రాజెక్టులు, భారీ వడ్డీతో కూడిన రుణాల కారణంగా బీఆర్‌ఐపై చాలా దేశాలు ఇప్పటికే పెదవి విరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాల ఆంక్షల సెగ తగిలితే బీఆర్‌ఐ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశముంది. 

మధ్య, తూర్పు ఐరోపా దేశాలతో (సీఈఈ) చైనా సంబంధాల మెరుగుదల కోసం 2012లో ‘17+1 ఇనీషియేటివ్‌’ ఆవిర్భవించింది. దాన్నుంచి లిథువేనియా బయటకు వచ్చేయడం, ఆ దేశ రాజధాని విల్నీయస్‌లో తైవాన్‌ ప్రతినిధి కార్యాలయం ఏర్పాటుకావడం వంటి పరిణామాలతో చైనా-ఐరోపా సంబంధాలకు 2021లో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన వాస్తవాలను తొలినాళ్లలో దాచిపెట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెను నష్టానికి డ్రాగన్‌ కారణమైందనీ పలు ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ ఆక్రమణ తరవాత పుతిన్‌ పశ్చిమ ఐరోపాలోని మరిన్ని దేశాలు/ప్రాంతాలపై కన్నేయవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో నాటో విస్తరణ, స్వీయ భద్రతకు సంబంధించి రష్యా ఆందోళనలు న్యాయమైనవేనని చైనా చెబుతుండటం ఈయూకు రుచించడం లేదు. తాజా పరిణామాల దృష్ట్యా మరిన్ని సీఈఈ దేశాలు ‘17+1’ నుంచి బయటకురావచ్చు. తైవాన్‌తో అవి సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకొన్నా ఆశ్చర్యం లేదు.

చైనాకు మరో నష్టం

ఉక్రెయిన్‌ 2017లో బీఆర్‌ఐలో చేరింది. అప్పటి నుంచి డ్రాగన్‌ కంపెనీలు ఆ దేశంలో ఓడరేవులు, సబ్‌వేల ఆధునికీకరణ పనులు చేపడుతున్నాయి. చైనాకు చెందిన హువావీ టెక్నాలజీస్‌తో 2020లో కీవ్‌ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న ఉక్రెయిన్‌- షామీ వంటి చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు మంచి విపణిగా ఉపయోగపడుతుందనే విశ్లేషణలు అప్పట్లో వెలువడ్డాయి. కీవ్‌ నుంచి బీజింగ్‌కు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులూ ఎక్కువే. 2021లో చైనా మొక్కజొన్న దిగుమతుల్లో ఆ దేశం వాటాయే 30శాతం వరకు ఉంటుంది. తాజా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ వంటి కీలక విపణినీ డ్రాగన్‌ కోల్పోయినట్లయింది.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధునిక యుగంలోనూ అసమానతలు

‣ మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం