• facebook
  • whatsapp
  • telegram

డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌



చైనాతో సరిహద్దు వివాదాలున్న 14 దేశాల్లో భారత్‌, భూటాన్‌ మినహా మిగతావన్నీ బీజింగ్‌తో పరిష్కారం కుదుర్చుకున్నాయి. సుదీర్ఘకాలంగా భూటాన్‌తో డ్రాగన్‌ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు దిల్లీ రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.


భారత్‌, భూటాన్‌ల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు దేశాలు 1949లోనే స్నేహ, సహకార ఒప్పందం కుదుర్చుకొన్నాయి. దాని ప్రకారం భూటాన్‌ సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ, ఆ దేశ విదేశాంగ విధానానికి భారత్‌ మార్గదర్శకత్వం వహిస్తోంది. ఆ ఒప్పందం ఉమ్మడి భద్రతకు భరోసా ఇస్తోంది. తదనుగుణంగా భారత సైన్యం భూటాన్‌లో స్థావరాలు ఏర్పరచుకుని, చైనా-భూటాన్‌ సరిహద్దులో పహరా కాస్తోంది. భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్‌లో పలు మౌలిక వసతులను నిర్మించింది. భూటాన్‌ సైనికులకు భారత సైన్యం శిక్షణ ఇస్తోంది. భూటాన్‌పై దాడిని భారత్‌పై దాడిగా పరిగణిస్తామని 1958లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. చైనా అప్పటికే టిబెట్‌ను ఆక్రమించుకుని లద్దాఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లను టిబెట్‌ హస్తానికి అయిదు వేళ్లుగా ప్రకటించింది. భూటాన్‌లో డోక్లాం సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్‌ దబాయించింది. భూటాన్‌ విదేశాంగ విధానానికి 2007 వరకు భారతదేశమే సారథిగా వ్యవహరించింది. 2008లో భూటాన్‌లో రాజరికం స్థానంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి విదేశాంగ విధానంలో, ఆయుధ కొనుగోళ్లలో భూటాన్‌కు దిల్లీ ఎక్కువ స్వయం నిర్ణయాధికారం ఇవ్వసాగింది. ఆ మేరకు 1949నాటి సహకార ఒప్పందాన్ని సవరించారు. భారత్‌, భూటాన్‌లు తమకు హానికరమైన విధంగా తమ భూభాగాలను ఇతర దేశాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వబోమని ప్రకటించాయి. అందుకే 2017లో చైనా భూటాన్‌లోని డోక్లామ్‌లో అతిక్రమణలకు పాల్పడినప్పుడు భారత్‌ దాన్ని ప్రతిఘటించింది. దాంతో చైనా 2020లో భూటాన్‌లోని డోక్లాం సహా మరింత భూభాగం తనదేనని బుకాయించసాగింది.


భూటాన్‌లోని డోక్లాం సహా మొత్తం 269 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే, ప్రతిగా 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు దఖలు పరుస్తామని 1996లోనే చైనా ప్రతిపాదించింది. కానీ భూటాన్‌ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 1984 నుంచే చైనా, భూటాన్‌లు సరిహద్దులను గుర్తించడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల బీజింగ్‌లో జరిగిన 25వ విడత చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు గుర్తింపునకు నియమించే సాంకేతిక బృందం విధివిధానాలపై సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల ద్వారా భూటాన్‌ డోక్లామ్‌ను చైనాకు కానుకగా సమర్పిస్తుందని చెప్పలేం. ఉత్తరాన భారీ విస్తీర్ణంలోని వివాదాస్పద భూభాగాలను భూటాన్‌కు వదులుకొన్నందుకు ప్రతిగా చైనా కోరుతున్న పశ్చిమ ప్రాంతాలు వైశాల్యంలో చిన్నవి. కానీ, వ్యూహపరంగా చాలా కీలకమైనవి. పశ్చిమ ప్రాంతంలోని డోక్లాం పీఠభూమి- టిబెట్‌, భారత్‌, భూటాన్‌ కూడలిలో ఉంది. డోక్లాం చైనా చేతుల్లోకి వెళితే, అది భారత్‌ మీద సైనికంగా పైచేయి సాధించడానికి ఉపకరిస్తుంది. భారతదేశాన్ని ఈశాన్య భారతంతో కలిపే సిలిగురి కారిడార్‌ (చికెన్స్‌ నెక్‌)పై డోక్లాం నుంచి దాడిచేసే సత్తా చైనాకు లభిస్తుంది. ఇప్పటికే టిబెట్‌ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని షిగాట్సె పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను దక్షిణ టిబెట్‌లోని చుంబీ లోయ వరకు పొడిగించాలని డ్రాగన్‌ యోచిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో చైనా డోక్లామ్‌ను స్వాధీనం చేసుకుంటే చుంబీ నుంచి చికెన్స్‌ నెక్‌పై సులభంగా దాడి చేయగలుగుతుంది. అందుకే డోక్లామ్‌పై కుదిరే ఏ ఒప్పందమైనా చైనా, భూటాన్‌లకు మాత్రమే పరిమితం కారాదని, భారత్‌తో కూడిన త్రైపాక్షిక ఒప్పందంగానే అది ఉండాలని దిల్లీ డిమాండ్‌ చేస్తోంది. ఇదే విషయాన్ని భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌ బెల్జియన్‌ పత్రిక లా లిబ్రే ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు.


భారతదేశం భూటాన్‌కు బయటి ప్రపంచానికి ముఖద్వారంగా ఉపయోగపడుతోంది. ఆ సౌలభ్యం చైనాతో ఉండదు. భూటాన్‌ ఆర్థికాభివృద్ధికి భారత్‌ మూల స్తంభంగా నిలుస్తోంది. చైనా, భూటాన్‌ తాజా చర్చలపై ఇంతవరకు భూటాన్‌, భారత్‌లు అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. సరిహద్దు సమస్యపై తమ విదేశాంగ మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారంటూ చైనా చేసిన ప్రకటన పలు భాష్యాలకు తావిస్తోంది. ఏదేమైనప్పటికీ, డోక్లామ్‌ను చైనాకు అప్పగించేందుకు భారత్‌ అంగీకరించదు.


- కైజర్‌ అడపా
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాజెక్టు కుశ.. గగనతల రక్షణ కవచం!

‣ వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోత

‣ అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

Posted Date: 07-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం