* ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (AI).. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటినుంచి చర్చ జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే వాదన ఓవైపు ఉండగా.. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకునే ఉద్యోగులు భారీ జీతాలు అందుకునే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు చెబుతున్న మాట. దీనిపై ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) సీటీఓ రఫీ తరఫ్దర్ (Rafee Tarafdar) మాట్లాడారు. ఏఐని సమర్థంగా అర్థం చేసుకోగల వారిదే భవిష్యత్ అన్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ టూల్స్ నేర్చుకోవడం ముఖ్యమన్నారు.
నైపుణ్యాలను పెంచుకోవాలి
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రఫీ తరఫ్దర్ విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. ‘ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ప్రపంచం రెండుగా ఉంది. ఒకటి ఏఐ సృష్టికర్తలు. మరొకటి ఏఐ వినియోగదారులు. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లోని సమర్థుల కోసం కంపెనీలు ఎదురుచూస్తున్నాయన్నారు రఫీ. ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారు ఏఐ వినియోగదారులుగా మారడంపై దృష్టిపెట్టండి. ఎందుకంటే వీరు ఎక్కువగా ఏఐ సాధనాలు ఉపయోగించగలగడంలో నైపుణ్యాలు పెంచుకోగలిగితే మరింత ఉత్పాదకతను అందించేందుకు సమర్థులవుతారు. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్నవారైతే ఏఐ సృష్టికర్తలుగా మారేందుకు తమ నైపుణ్యాలనుపెంచుకోవాలి. వారైతేనే ఏఐ మోడల్లను చక్కగా తీర్చిదిద్దగలరు. కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయగలరు’’ అని ఆయన అన్నారు.
హైరింగ్ మోడల్ మార్పు
ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ సాంకేతికతపై ట్రైనింగ్ను ఇవ్వడం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫీలోని 2,50,000 మంది ఉద్యోగులు జెన్ ఏఐని నేర్చుకున్నారు. ఇక ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలూ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వ్యక్తులనే ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో రఫీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాదు ఇటీవల ఇన్ఫీ కూడా తన హైరింగ్ మోడల్ను మార్చినట్లు ఏప్రిల్లో ప్రకటించింది. ఇప్పుడు సగానికి పైగా ఫ్రెషర్లను క్యాంపస్ వెలుపల నుంచే తీసుకుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.