* డీఎస్సీ అభ్యర్థుల్లో అయోమయం
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్-2024) రాసి ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. గత ఫిబ్రవరిలో టెట్ ప్రకటన వెలువడటంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు పూర్తవగా.. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది.
16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన
ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మెగా డీఎస్సీ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటగా సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. నియామక ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సాధనకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో టెట్ రాసిన అభ్యర్థులు ఫలితాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు విడుదలైతేనే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. టెట్ అర్హత సాధిస్తే ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఫలితాల విడుదల తేదీ, డీఎస్సీ విధివిధానాలపై ప్రకటన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.