* వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు కూడా..
* ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని దివ్యాంగులకు విద్యాసంస్థల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రభుత్వ విభాగాలను నిర్దేశించింది. వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, న్యాయ, అటవీ, పశు సంవర్ధక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థల ప్రవేశాల్లో ఇప్పటివరకు దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటిని అయిదు శాతానికి పెంచాలని దివ్యాంగులు కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల శిశు సంక్షేమ శాఖ సమీక్షలో దివ్యాంగుల చట్టం ప్రకారం దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఇతర విద్యాసంస్థల్లో కేంద్ర చట్టం ప్రకారం దివ్యాంగులకు 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలుచేయాలని ఆదేశాల్లో సూచించారు. అలాగే, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో అయిదేళ్ల వయోపరిమితి మినహాయింపునివ్వాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు అయిదేళ్ల వయోపరిమితి తక్షణమే అమలుచేయాలని స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.