* తొలివిడతలో దాదాపు 80 శాతం సీట్ల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. మెరిట్ ఆధారంగా ఇప్పటికే తొలివిడత ప్రవేశాలు పూర్తిచేసిన సొసైటీలు.. మిగిలిన సీట్ల భర్తీకి రెండు, మూడు రోజుల్లో రెండోవిడత ప్రవేశాల జాబితాను వెల్లడించనున్నాయి. ఈ నెలాఖరు నాటికి రెండో విడత కౌన్సెలింగ్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల్లోని 643 గురుకులాల్లో 51,924 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్షకు 1.13 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను విడుదల చేసిన సొసైటీలు తొలివిడత ప్రవేశాల జాబితా ప్రకటించాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులు సంబంధిత గురుకుల పాఠశాలలో మే 6(గడువుతేదీ)లోగా రిపోర్టు చేశారు. తొలివిడత ప్రవేశాల్లో దాదాపు 80 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలిసింది. మిగిలిన 20 శాతం భర్తీ చేసేందుకు మెరిట్ ఆధారంగా రెండో జాబితా సిద్ధమవుతోంది. రెండోవిడత ప్రవేశాల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి సంబంధిత గురుకుల వెబ్సైట్లలో ఆన్లైన్ దరఖాస్తును సొసైటీలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. పరీక్ష రాసిన, రాయలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ క్రమంలో మెరిట్తోపాటు అనాథలు, సింగిల్ పేరెంట్ ఉన్నవారికి, ఇతర అసహాయ పరిస్థితుల్లోని విద్యార్థులకు తొలిప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.