* 13 వేల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు
* నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లో పోస్టింగులు!
ఈనాడు - హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తికాగా, టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంకు జాబితా (జీఆర్ఎల్) వెల్లడైన నోటిఫికేషన్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి రెండు, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్-4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈనెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
నియామక ప్రక్రియ తుది దశలో...
ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్ఎల్ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్ఎల్ విడుదలైంది. పురపాలక శాఖలో ఎకౌంటెంట్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్య క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది. సాంకేతికవిద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్య విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.