* కౌన్సెలింగ్కు రంగం సిద్ధం
* రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 5,628.. బీ-కేటగిరీలో 1,955
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతోంది. నీట్-యూజీ పరీక్షపై వచ్చిన ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ తదితర అంశాలతో ఏర్పడిన గందరగోళం ఎట్టకేలకు వీడటంతో కౌన్సెలింగ్ నిర్వహణ దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. 2024-25 విద్యాసంవత్సర తరగతులను అక్టోబరు 1వ తేదీ నాటికి ప్రారంభించడమే లక్ష్యంగా కౌన్సెలింగ్ ప్రక్రియకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహణపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కూడా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,915.. ప్రైవేటు కాలేజీల్లో 4,600 కలిపి మొత్తం 8,515 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న 3,915 సీట్లలో జాతీయ కోటా కింద 15 శాతం సీట్లు(587) మినహాయిస్తే.. కన్వీనర్ కోటాలోని 3,328 సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 2,300, బీ-కేటగిరీలో 1,955, సీ-కేటగిరీలో 345 ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి.. మొత్తం 5,628 కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో కొత్తగా మరో పది వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్ఎంసీ ఇప్పటికే ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. వీటిలో ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. మరో రెండు ప్రైవేటువి. వీటికి తుది అనుమతులు లభిస్తే మరో 500 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2024-25 విద్యాసంవత్సరానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏకకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
నిరుటి కన్నా పెరిగిన అర్హులు..
రాష్ట్రంలో ఈసారి నీట్-యూజీ పరీక్షను 77,849 మంది విద్యార్థులు రాయగా.. 47,371 (60.8%) మంది అర్హత సాధించారు. గత ఐదేళ్లలో 60 శాతం మందికి పైగా అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లకు పోటీ మరింత పెరిగింది. గత ఆరేళ్లుగా నీట్-యూజీ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల గణాంకాలను విశ్లేషిస్తే.. పరీక్ష రాసే విద్యార్థులతో పాటు అర్హత సాధించేవారు ఏటేటా పెరుగుతున్నారు. గత ఏడాది 72,842 మంది పరీక్షకు హాజరు కాగా.. 42,654 (58.5%) మంది అర్హత సాధించారు.
ఆ 520 కన్వీనర్ కోటా సీట్లూ తెలంగాణ విద్యార్థులకే..
తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు-2017లో సవరణ చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గత ఏడాది ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలోని వంద శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ అవుతాయి. గతంలో జాతీయ కోటా 15 శాతం పోను.. మిగిలిన 85 శాతం సీట్లను 100గా పరిగణించి.. వాటిలో 85 శాతం సీట్లను తెలంగాణకు కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఈ 15 శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన కాలేజీల్లో ఈసారి జాతీయ కోటా పోను మిగిలే 520 ఎంబీబీఎస్ సీట్లూ పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే లభించే అవకాశం ఉందంటున్నారు. కౌన్సెలింగ్ నాటికి దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.