* సుప్రీంకోర్టులో పిటిషన్
* కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు
దిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ(2024) పరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం శుక్రవారం (జూన్ 14) కేంద్రం, పరీక్ష నిర్వహించిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), సీబీఐ, బిహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ఓ న్యాయవాది ప్రస్తావనకు తీసుకురాగా.. సర్వోన్నత న్యాయస్థానం సున్నితంగా మందలించింది.. ‘‘కోటాలో ఆత్మహత్యలకు నీట్ యూజీ ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు’’ అని సూచించింది. మరోవైపు నీట్ పరీక్షపై వివిధ హైకోర్టుల్లో వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది. నీట్ పరీక్ష మే 5న జరిగింది. అయితే పరీక్షకు ముందు, ఫలితాల తర్వాత పలు అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా పేపర్ లీక్, గ్రేస్ మార్కులు, పరీక్ష కేంద్రాల విషయంలో అక్రమాలు.. తదితర అంశాలపై కేసులు వేశారు. గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నామని ఎన్టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జులై 8న విచారణ నిర్వహించనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.