• facebook
  • whatsapp
  • telegram

NEET PG: నేటి ‘నీట్‌ పీజీ’ వాయిదా

* ఎన్‌టీఏ డీజీకి ఉద్వాసన

* నీట్‌ యూజీపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

దిల్లీ: నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతోపాటు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

వాయిదావల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆదివారమే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉసూరుమంటూ ఇంటి బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. శనివారమే ఎన్‌టీఏ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు తొలగించింది. ఆయనను సిబ్బంది వ్యవహారాలశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఛైర్మన్, ఎండీ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాకు ఎన్‌టీఏ బాధ్యతలను అప్పగించింది. నీట్‌ యూజీతోపాటు యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ‘అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతోపాటు మోసం, మాల్‌ ప్రాక్టీస్‌ల వంటివి చోటుచేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీంతో సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశంతోపాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్‌టీఏ అధికారులంతా పరిశీలనలో ఉన్నారని తెలిపారు. సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకవలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.