* పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని పునరుద్ఘాటన
![]() |
చెన్నై: దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. పరీక్షకు ముందే పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో.. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతోపాటు విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు. ఇదే అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని పునరుద్ఘాటించారు. నీట్ పరీక్ష వద్దని తమిళనాడు పదేపదే చెబుతోందని గుర్తు చేసిన ఆమె.. నీట్ నిర్వహణ డొల్ల అని ఇప్పుడు రుజువైందన్నారు. ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ఎంతో కోల్పోతున్నారని పేర్కొన్నారు.
కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. ఓ వైపు దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా.. నీట్ పీజీ-2024 పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.