దిల్లీ, చండీగఢ్: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ - యూజీ పరీక్ష - 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం శనివారం నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డీజీ సుబోధ్కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదన్న సుబోధ్కుమార్ సింగ్.. ఆ అభ్యర్థుల ఫలితాల్ని సమీక్షించడం ప్రవేశాల ప్రక్రియపైనా ఏ ప్రభావమూ చూపదన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కులే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. కమిటీ సిఫార్సులనుబట్టి నిర్ణయం ఉంటుందన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.