• facebook
  • whatsapp
  • telegram

Revanth reddy: ఐటీఐలను ఆధునికీకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

* స్వదేశంలోనే  యువతకు ఉపాధి 

హైదరాబాద్‌: మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 18న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయి. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వాటిని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే నిర్ణయించాం. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టాం. నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజినీరింగ్ గ్రాడుయేట్స్‌ వచ్చి రూ.15 వేలు, రూ.20 వేలకు పనిచేస్తామని వచ్చారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ.60 వేలు అడిగారు. 

రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను తీర్చిదిద్దుతాం..

సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడం లేదని అప్పుడే అర్థమైంది. అందుకే ఎంతోమంది గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నాం. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. ముఖ్యమంత్రిగా నేను ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తా. ప్రతి నెలా సమీక్ష చేస్తా’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చుచేయనుంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ అప్‌గ్రేడ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చనుంది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటా 15, 860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ లభించనుంది. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు కాగా.. టీటీఎల్‌ వాటా రూ.2016.25 కోట్లు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్‌ ఉద్యోగాలు కల్పించనుంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.