* 85% ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం
* బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా వెల్లడి
ముంబయి: ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీపికబురు చెప్పింది. ఐటీ సెక్టార్లో నియామకాలు నెమ్మదించిన వేళ.. ఫ్రెషర్లకు ప్రత్యామ్నాయం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. 3 వేల మంది పీఓలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి ఆపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమించుకోనున్నట్లు చెప్పారు.
ఎలాంటి వివక్ష ఉండబోదు
ఒకప్పటిలా కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లోనూ సాంకేతికతపై ఆధారపడడం పెరిగిందని ఖారా చెప్పారు. సాంకేతికత ఆధారంగా కస్టమర్లకు కొత్తగా ఏ విధంగా సేవలందించాలనే దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలోనే కొన్ని బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. శిక్షణ పొందిన వారిని.. వారి వారి ప్రతిభను బట్టి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. దీనివల్ల బ్యాంకింగ్ సెక్టార్కు తగిన స్థాయిలో టెక్ మ్యాన్పవర్ అందించడం సాధ్యపడుతుందన్నారు. బాధ్యతల విషయంలో ఎలాంటి వివక్ష కూడా ఉండబోదన్నారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సాంకేతికత విషయంలో ఎస్బీఐ సిబ్బందికి ఇన్హౌన్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం ఎక్కువ మొత్తమే ఖర్చవుతోందని తెలిపారు. ప్రతి సిబ్బందీ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు చాలా వరకు లావాదేవీలు టెక్నాలజీ ఆధారంగానే జరుగుతున్నందున దీన్నెవరూ విస్మరించలేనిదని చెప్పారు. ఈ విషయంలో రెగ్యులేటర్ అయిన ఆర్బీఐ నుంచి కూడా తగిన మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. మరోవైపు సాంకేతిక అంశాలపై ఆర్బీఐ ఇప్పటికే దృష్టి సారించింది. ఈ విషయంలో ఏదైనా బ్యాంక్లో లోపాలు గుర్తిస్తే పెద్ద ఎత్తున జరిమానా విధిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.