• facebook
  • whatsapp
  • telegram

Study: బీసీ స్టడీ సర్కిళ్లలో 10% ఈడబ్ల్యూఎస్‌ కోటా

* ప్రస్తుతం డీఎస్సీకి ఒక్కో స్టడీ సర్కిల్‌లో 200 సీట్లు
 


ఈనాడు, అమరావతి: బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్‌కుగానూ ఆర్థికంగా వెనుకబడినవర్గాల వారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేసేందుకు బీసీ సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్టడీ సర్కిళ్లలో ఉన్న సీట్లకు అదనంగా 10 శాతం మేర పెంచి ఆ కోటాను ఆర్థికంగా వెనుకబడినవర్గాల వారితో భర్తీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాల్లో 13 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జాబ్‌ నోటిఫికేషన్లకు అనుగుణంగా ఇక్కడ ఉచితంగా కోచింగ్‌ ఇస్తారు. ఇప్పటివరకు ఇక్కడ బీసీలకు-66, ఎస్సీలకు-20, ఎస్టీలకు 14 శాతం మేర సీట్లను కేటాయించి ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారు. తాజాగా ఈ రిజర్వేషన్‌కు ఎలాంటి భంగం కలగకుండా ఇప్పుడున్న సీట్లను 10శాతం మేర పెంచి....అదనంగా వచ్చే సీట్లకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద వర్తింపజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. 

*డీఎస్సీకి ఉచిత కోచింగుకు 2 వేల దరఖాస్తులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణపై చేశారు. మొత్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక్కో జిల్లాలోని స్టడీ సర్కిల్‌లో 200 మందికి ఉచితంగా కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఇప్పటికే బీసీ సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రెండు వేల మంది నుంచి డీఎస్సీ కోచింగుకు దరఖాస్తులు అందాయి. ఇంకా 600 మందికి అవకాశముంది. తాజా ప్రతిపాదనలు ఆమోదం పొందితే... ప్రతి జిల్లాలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇప్పుడున్న 200 సీట్లకు మించి 10 శాతం రిజర్వేషన్‌ మేర మరో 20 సీట్లు అదనంగా కేటాయించాలి. ఆ మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

నోటిఫికేషన్‌ విడుదలైన వెంట కోచింగ్‌ ప్రారంభం.. 

ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ఉచిత కోచింగ్‌ ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. రెండు నెలలపాటు ఈ కోచింగ్‌ ఉంటుంది. ఇందుకుగాను రూ.2 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో బీసీ స్టడీ సర్కిళ్లలో నిత్యం ఏదో ఒక పోటీ పరీక్షకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంతో స్టడీ సర్కిళ్లకు పూర్వవైభవం వచ్చింది. అధికారంలోకి రావడంతోనే డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇదేకాకుండా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.