• facebook
  • whatsapp
  • telegram

TET Results: టెట్‌లో 1,09,168 మంది పాస్‌

* పేపర్‌-1లో అత్యధికంగా 67.13 శాతం మంది ఉత్తీర్ణత 

* పేపర్‌-2లో 34.18% మంది ఉత్తీర్ణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో మొత్తం 1,09,168 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది అర్హత సాధించారు. మే  20వ తేదీ నుంచి జూన్‌  2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగగా.. వాటి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 12న విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు) బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల అర్హతకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన పాల్గొన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు, టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి లేకుండానే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.

  టెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 


భారీగా పెరిగిన ఉత్తీర్ణత

గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన టెట్‌తో పోల్చుకుంటే ఈసారి పేపర్‌-1, 2లలో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. గతసారి పేపర్‌-1లో 36.89 శాతం మంది పాస్‌ కాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం 67.13కు పెరిగింది. అంటే 30.24 శాతం అధికం. పేపర్‌-2లో ఉత్తీర్ణత శాతం 15.30 నుంచి 34.18కి పెరిగింది. పేపర్‌-2లో గణితం-సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలకు రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. గణితం-సామాన్య శాస్త్రంలో 37.40 శాతం మంది, సాంఘిక శాస్త్రంలో 30.61 శాతం మంది పాసయ్యారు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు టెట్‌ నిర్వహించగా... ఈసారి పేపర్‌-1లో అత్యధికంగా 67.13 శాతం మంది పాస్‌ కావడం విశేషం. 

వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

ఈసారి టెట్‌ పరీక్షలకు దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఫీజు తగ్గింపు నిర్ణయం అమలుకు ఎన్నికల సంఘం అంగీకరించలేదని ప్రభుత్వం తాజాగా తెలిపింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని జూన్‌ 12న ప్రకటించింది. తాజా టెట్‌లో అర్హత సాధించనివారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించినవారు డీఎస్సీకి ఒకసారి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.




 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.