* కేంద్ర విద్యాశాఖ ప్రకటన
దిల్లీ: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ జూన్-2024 (UGC-NET) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ (Education Ministry) జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ గురువారం వెల్లడించారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
‘‘నెట్ పరీక్ష (NET Exam)లో అవకతవకలు జరిగాయని, విశ్వసనీయత దెబ్బతిందని ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో మాకు అర్థమైంది. అందుకే పరీక్షను రద్దు చేశాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినందుకు ఇంతకంటే వివరాలను మేం వెల్లడించలేం. త్వరలోనే మళ్లీ పరీక్షను నిర్వహిస్తాం. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని జైశ్వాల్ వెల్లడించారు.
జూన్ 18వ తేదీన దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్ (పెన్ను, పేపరు) విధానంలో యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష జరిగింది. దీనిని ఎన్టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షను రద్దు చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.