* జులై 12 వరకు గడువు ఇచ్చిన ఎస్సీ గురుకుల సొసైటీ
ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ గురుకుల సంక్షేమ సొసైటీలో అయిదు నుంచి తొమ్మిదో తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి మరోసారి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. విద్యార్థులు రూ.100 చెల్లించి https://tgswadtr.cgg.gov.in వెబ్సైట్ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి కోరారు. అలాగే విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని సూచించారు. జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బ్యాక్లాగ్ సీట్ల కోసం ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేయాలన్న నిర్ణయంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇప్పటికే సొసైటీ పరిధిలో దాదాపు 800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై ఇప్పటివరకు సొసైటీ అధికారులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అయిదో తరగతి మినహాయిస్తే 6, 7, 8, 9 తరగతి ఖాళీలు భర్తీ చేయకుండా తాత్సారం చేశారని, సీట్ల భర్తీ కోసం మరోసారి రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు.
గతంలో ప్రవేశ పరీక్షకు ఒకసారి ఫీజు చెల్లించామని, ఖాళీ సీట్ల భర్తీకి మరోసారి ఫీజు వసూలు చేయకూడదని కోరుతున్నారు. ఎస్సీ సొసైటీలో ఖాళీ సీట్ల భర్తీలో ప్రాధాన్యక్రమం పాటిస్తామని సొసైటీ వెల్లడించింది. తొలుత సొసైటీలో ప్రవేశాలు పొందినా చేరని వారికి, ప్రవేశపరీక్ష రాసిన వారికి, అనాథలు, సింగిల్ పేరెంట్ ఉన్నవారికి, దివ్యాంగులు, ప్రవేశపరీక్ష రాయని వారికి వరుస క్రమ ప్రాధాన్యత కింద భర్తీ చేస్తామని తెలిపింది. తల్లిదండ్రులు ఎవరూ సొసైటీ, ప్రాంతీయ సమన్వయకర్తల కార్యాలయాలకు రాకూడదని పేర్కొంది. విద్యార్థుల దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అడ్మిషన్కు అర్హులైతే రిజిస్టరు మొబైల్నంబరుకు సమాచారం పంపిస్తామని ఎస్సీ సొసైటీ వివరించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.