• facebook
  • whatsapp
  • telegram

టెట్‌ జరపక తప్పదు!

* నిర్వహించకుండా ముందుకెళ్లలేమన్న ఆలోచనలో ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్: కొత్తగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) జరపడం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. అది నిర్వహించకుండా ముందుకెళ్లలేమని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన వారితోపాటు మరింత స్కోర్‌ పెంచుకునేందుకు పాత విద్యార్థుల నుంచి టెట్‌ నిర్వహించాలని ఒత్తిడి వస్తోందని, దాన్ని జరపకుంటే న్యాయపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. గత ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు కూడా టెట్‌ జరపడం గమనార్హం. టీఆర్‌టీ రాయాలంటే టెట్‌లో పాస్‌ కావడం తప్పనిసరి. టెట్‌లో మార్కులకు టీఆర్‌టీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆ తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. అందుకే అభ్యర్థులు ఒకసారి ఉత్తీర్ణులైనా ఎక్కువ మార్కుల కోసం మళ్లీ మళ్లీ రాస్తారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చివరిసారిగా 2017 జులై 23న టెట్‌ నిర్వహించారు. తాజాగా పరీక్ష జరిపితే దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది బీఈడీ, డీఈడీ పూర్తయిన వారు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి టెట్‌ను ఆన్‌లైన్‌లో జరిపే అవకాశం ఉంది.  టెట్‌ను ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు-సీబీటీ)లో జరపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా కిషన్‌ ఉన్నప్పుడే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేపర్‌-పెన్‌ విధానం కంటే ఆన్‌లైన్‌ విధానమే మంచిదన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం పంపిన ఫార్మాట్‌ను ఆయా డీఈఓలకు పంపారు.

* ఇక ఆ రెండు టెట్ల స్కోరే మిగిలింది ...
ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు సార్లు టెట్‌ నిర్వహించారు. కాలపరిమితి ఏడేళ్లు కావడంతో ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన మూడు టెట్ల స్కోర్‌కు గడువు ఇప్పటికే తీరిపోయింది. చివరి సారిగా 2014 మార్చిలో నిర్వహించిన టెట్‌ కాలపరిమితి కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి ముగుస్తుంది. తెలంగాణ లో 2016 మేలో మొదటిసారి, 2017 జులై 23న చివరిసారిగా పరీక్ష జరిపారు. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిపిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారే ఉపాధ్యాయ కొలువులకు నిర్వహించే టీఆర్‌టీకి అర్హులవుతారు. అందుకే మరోసారి పరీక్ష జరపనున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.