• facebook
  • whatsapp
  • telegram

బ్రిటన్‌తో వాణిజ్య బంధానికి రాచబాట

ఎఫ్‌టీఏ తొలివిడత చర్చలు పూర్తి

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో అయిదు, ఆరో స్థానాల్లో ఉన్న బ్రిటన్‌, ఇండియాలు ద్వైపాక్షిక వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ముందడుగు వేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై తొలి విడత చర్చలు ఇటీవల విజయవంతంగా ముగిశాయి. రెండో విడత సంప్రతింపులు ఈ ఏడాది మార్చి ఏడు నుంచి 18 వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌ 17 (ఈస్టర్‌) కల్లా పాక్షిక ఒప్పందాన్ని అమలులోకి తెచ్చి, ఈ సంవత్సరం చివరినాటికి పూర్తిస్థాయిలో ఎఫ్‌టీఏను కుదుర్చుకోవాలని రెండు దేశాలు లక్షిస్తున్నాయి.

ఎగుమతులకు ఊతం

ఐరోపా సంఘం (ఈయూ)లో భాగంగా ఉన్నప్పుడే బ్రిటన్‌తో ఇండియా ఎఫ్‌టీఏ సంప్రతింపులు ప్రారంభించింది. అవి ప్రతిపాదిత ఈయూ-ఇండియా ఎఫ్‌టీఏలో భాగం. ప్రస్తుతం బ్రిటన్‌తో విడిగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవలి సంప్రతింపుల్లో ఇరు దేశాల నిపుణులు ఆర్థిక సేవలు, టెలి కమ్యూనికేషన్లు, పెట్టుబడులు, మేధాసంపత్తి, కస్టమ్స్‌ సహా పలు రంగాలకు సంబంధించి విధానపరమైన 26 అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా తోలు, జౌళి, శుద్ధిచేసిన వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆభరణాలవంటి రంగాల్లో బ్రిటన్‌కు భారత్‌ నుంచి ఎగుమతులు పెరిగేందుకు ఎఫ్‌టీఏ దోహదపడుతుందని కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే 2035కల్లా ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్య బంధం విలువ రూ.2.8లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), ఇజ్రాయెల్‌, కెనడా తదితర దేశాలతోనూ ఇండియా ఎఫ్‌టీఏ చర్చలు జరుపుతోంది. బ్రెగ్జిట్‌ ఫలితంగా ఐరోపా మార్కెట్లలో బ్రిటన్‌ లావాదేవీలు ఇంతకుముందులా సాఫీగా సాగే అవకాశాల్లేవు. అమెరికాతో బోరిస్‌ జాన్సన్‌ సర్కారు ఎఫ్‌టీఏ చర్చల్లోనూ పురోగతి కనిపించడంలేదు. అందువల్ల యూకే ప్రత్యామ్నాయాల అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇండియావంటి భారీ విపణిలో స్వేచ్ఛాయుత ప్రవేశాన్ని కలిగి ఉండటమూ ఆ దేశానికి అవసరం. అందుకు మార్గాన్ని ఎఫ్‌టీఏ సుగమం చేస్తుంది. భారత్‌తో ఈ ఒప్పందం కుదిరితే, బ్రెగ్జిట్‌ అనంతరం యూకేకు దక్కే అతిపెద్ద బహుమతి ఇదే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. 2050 కల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. అందువల్ల బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ చర్చల్లో మనదే పైచేయిగా కనిపిస్తోంది.

బ్రిటన్‌ పర్యాటకం, వర్క్‌ వీసాల కోసం ప్రస్తుతం భారతీయులు రూ.1.4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. దాన్ని తగ్గించాలని, గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక భారతీయ విద్యార్థులు యూకేలో కొన్నాళ్లు కొనసాగేందుకు అనుమతించాలని, భారతీయులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎఫ్‌టీఏ చర్చల్లో మోదీ ప్రభుత్వం షరతులు విధించే అవకాశముంది. ఆల్కహాల్‌, ఆటొమొబైల్‌, డెయిరీ రంగాలు సైతం ఎఫ్‌టీఏ చర్చల్లో ప్రధానంగా నిలవనున్నాయి. భారత్‌లో తయారయ్యే కొన్ని విస్కీలపైనా బ్రిటన్‌ నిషేధాజ్ఞలున్నాయి. వాటిపై మోదీ సర్కారు ఎఫ్‌టీఏ సంప్రతింపుల్లో గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. యూకే నుంచి ఎగుమతి అవుతున్న స్కాచ్‌ విస్కీపై ఇండియాలో ప్రస్తుతం 150శాతం ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నారు. దాన్ని తగ్గించాలని బ్రిటన్‌ సర్కారు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఫ్రాన్స్‌, అమెరికాల తరవాత భారత్‌కు స్కాచ్‌ విస్కీ అధిక మొత్తంలో బ్రిటన్‌ నుంచే వస్తోంది. మరోవైపు, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ మన డెయిరీ ఎగుమతులను బ్రిటన్‌ నిషేధించింది. ఆ దేశ డెయిరీ ఉత్పత్తులు మాత్రం ఇండియాకు వస్తున్నాయి.

పట్టువిడుపులు అవసరం

బ్రిటన్‌లో 800కు పైగా భారతీయ కంపెనీలున్నట్లు అంచనా. వాటిలో దాదాపు 1.1 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పింఛను తీసుకొనే వయసుదాకా ఆ దేశంలో పనిచేసే అవకాశాలు లేకపోయినా, భారతీయ నిపుణుల నుంచి సామాజిక భద్రత పేరిట బ్రిటన్‌ రుసుములు వసూలు చేస్తోంది. ప్రస్తుతం కొంతమందికే ఉన్న మినహాయింపులను భారతీయ నిపుణులందరికీ వర్తింపజేయాలని ఇండియా దీర్ఘకాలంగా డిమాండు చేస్తోంది. వీటికి అంగీకరించడంవల్ల బ్రిటన్‌ కోల్పోయేదానితో పోలిస్తే, భారత్‌తో ఒప్పందం కుదిరితే ఒనగూడే ప్రయోజనాలు అధికం. మరోవైపు ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఇండియా డిమాండ్లను అంగీకరిస్తే బ్రిటన్‌కే మంచిదన్నది విశ్లేషకుల మాట. బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈయూ దేశాల నుంచి బ్రిటన్‌కు కార్మికులు, నిపుణుల రాక తగ్గిపోయింది. ఆతిథ్యం, రవాణా వంటి రంగాల్లో మానవ వనరుల కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది. అందువల్ల భారతీయులకు వీసాల మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే యూకేకు మేలే. ఇరుదేశాలు ఎఫ్‌టీఏ సంప్రతింపుల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఉభయతారక డిమాండ్లను అంగీకరించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసుకోవాల్సి ఉంది.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మధ్యాసియాతో బంధం బలోపేతం

‣ పొడిబారుతున్న పుడమి

‣ విస్తరిస్తున్న చైనా వల

‣ ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?

‣ జీవవైవిధ్యానికి పెనుముప్పు

‣ గిట్టుబాటుకాని మద్దతుధర

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం