• facebook
  • whatsapp
  • telegram

కొవిడ్‌ తిరగబెడుతుందా?

శాస్త్రీయంగా రుజువుకాని వైనం
 

కొవిడ్‌ ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక రాజకీయ ముఖచిత్రాలను మార్చేసింది. పలు అగ్రదేశాలు సైతం అతలాకుతలమయ్యాయి. కరోనా వైరస్‌ మన దేశంలో ప్రతి ఒక్కరినీ ఏదో విధంగా ప్రభావితం చేసింది. ఇప్పటికీ అనేక కుటుంబాల్లో కొవిడ్‌ మిగిల్చిన విషాదం మరవలేనిది. ఇంతలోనే, కొవిడ్‌ రెండోసారి కూడా రావచ్చన్న వార్త అందరికీ అశనిపాతంలా మారింది. కరోనా వైరస్‌ సోకి పూర్తిగా నయమయ్యాక తొంబై రోజుల తరవాత మళ్ళీ కొవిడ్‌గా నిర్ధారణకు రావడాన్ని ‘రీఇన్‌ఫెక్షన్‌’గా వ్యవహరిస్తారు. సాధారణంగా అన్ని వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు మనిషికి ఒకసారి సోకిన తరవాత, జీవిత కాలానికి సరిపడా రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కొన్నిసార్లు ఇతరత్రా కారణాలతో తాత్కాలికంగా అలాంటి రోగనిరోధక శక్తి తగ్గితే, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ మరోసారి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు ఆయా వైరస్‌లు పెద్దమొత్తంలో ప్రతిరక్షకా(యాంటీబాడీ)లను తయారు చేయడంతో జీవితకాలం రక్షణ కవచం ఏర్పడుతుంది. అదే వైరస్‌ మరోసారి శరీరంలోకి ప్రవేశిస్తే, సత్వరమే ప్రమాదాన్ని గుర్తించి, తీవ్రంగా ప్రతిఘటించి వ్యాధిగా మారకుండా కాపాడుతుంది.
 

ప్రతిరక్షకాలే కీలకం
ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో కొన్ని ప్రతిరక్షకాలు అయిదారు రోజుల్లోనే తయారవుతాయి. తాత్కాలికంగా ఉత్పత్తయి శరీరానికి ‘తక్షణ రక్షణ’ కల్పిస్తాయి. దీర్ఘకాలికంగా ఏర్పడే ప్రతిరక్షకాలు కొంత ఆలస్యంగా రెండు మూడు వారాల్లో రూపొంది, శరీరంలో సుదీర్ఘంగా ఉంటూ అదే రకమైన ఇన్‌ఫెక్షన్‌ మళ్ళీ రాకుండా రక్షణగా నిలుస్తాయి. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఈ రకమైన వ్యవస్థ అద్భుతంగా నిర్మితమై ఉంటుంది. కాకపోతే, యాంటీబాడీల తయారీ కాలం, నిలిచి ఉండే తత్వం మొదలైనవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇదంతా- జన్యుపరమైన అంశాలతోపాటు, వైరస్‌ సంక్రమించిన పద్ధతి, వ్యక్తి ఆహార పోషణ స్థాయులపై ఆధారపడుతుంది. దీర్ఘకాలికంగా నిలిచిఉండే ప్రతిరక్షకాలు తయారవ్వాలంటే వైరస్‌ పదార్థం శరీరంలోకి యాభైరెట్లు అధికంగా చేరిఉండాలి. ఈ కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్రతి వ్యక్తిలో ఒకే రకమైన ప్రతిస్పందన కనిపించదు. కొంతమందిలో దీర్ఘకాలిక ప్రతిరక్షకాలు సైతం చాలా రోజుల వరకూ సరిపడా ఏర్పడవు. అందువల్లే జీవిత కాలానికి సరిపడా ఏర్పడాల్సిన యాంటీబాడీలు కొంతమందిలో త్వరితగతిన నిష్క్రమిస్తాయి. ఇలాంటి వారికి మరోసారి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సహజ రూపంలో ఏర్పడిన ప్రతిరక్షకాలు టీకా ద్వారా కృత్రిమంగా ఏర్పడిన వాటికన్నా ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. ఇప్పటిదాకా ఎంతమందికి రెండోసారి సోకిందనేదీ నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రతిరక్షకాలను లెక్కించి చెప్పే పరీక్షల్లో తేడాలు, ఏవీ పూర్తిస్థాయిలో సరైన విధానాలుగా గుర్తించకపోవడం ఇందుకు కారణం. కోట్ల మందికి వైరస్‌ సోకినా లక్షల్లో కూడా పరీక్షలు జరగకపోవడంతో ఎంతమందికి కరోనా సోకిందన్న విషయంలో సమగ్ర సమాచారం లేదు. అనేకమంది అత్యంత తక్కువ స్థాయిలో వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం, ఇన్‌ఫెక్షన్‌ సోకినా లక్షణాలు కనిపించకుండా ఉండటం పరిస్థితిని జటిలం చేస్తోంది. మనదేశంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినవారిలో ఎంతమందికి యాంటీబాడీలు ఏ స్థాయిలో, ఎప్పుడు ఏర్పడి, ఎంతకాలం స్థిరంగా ఉన్నాయి, ఏ అంశాలు వాటి తయారీ, నిల్వ కాలాన్ని నిర్ధాస్తున్నాయనే పరిశోధనలు జరగకపోవడం సైతం అనిశ్చితికి కారణమవుతోంది.
 

టీకా పైనే అందరి దృష్టి
ఒక్కోవ్యక్తిని అనేకసార్లు పరీక్షించడం ద్వారా కొవిడ్‌ మళ్లీ వచ్చిందా లేదా అనేది తేల్చిచెప్పవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ పోతూ పోతూ మనిషి శరీరంలో తనదైన కొంత జన్యు భాగాన్ని వదిలివెళ్తుంది. రెండోసారి భిన్న జన్యువులు ఉన్నట్లు నిర్ధారిస్తేగాని కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మరోసారి వచ్చిందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పటిదాకా రెండోసారి కొవిడ్‌ బారిన పడిన వారెవ్వరిలోనూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. వైరస్‌ తన జన్యు స్థితిని మార్చుకొని కొత్తగా రూపాంతరం చెంది, అంతకుముందు ఏర్పడిన రోగనిరోధక శక్తిని తోసిరాజని మరోసారి వ్యాధిని కలిగించిన దాఖలాలు శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. సహజంగా మనుషుల్లో ఉండే స్మృతి (మెమరీ) కణజాలం ఏదైనా వైరస్‌ రెండోసారి శరీరంలో ప్రవేశిస్తే దాన్ని గుర్తించి అవసరమైన యాంటీబాడీలను సత్వరమే, సమృద్ధిగా తయారు చేస్తుందన్న సంగతి శాస్త్రీయంగా తెలిసిందే. రెండోసారి వ్యాధి తీవ్రంగా ఉంటుందన్న వాదనకూ అంతగా బలం లేదు. ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నా, ఏవీ రెండోసారి కొవిడ్‌ రావడాన్ని సశాస్త్రీయంగా సమర్థించడం లేదు. కొంతమందికి రెండోసారి వచ్చినా అలాంటి కేసుల్ని వ్యక్తిగత స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. కొవిడ్‌ యాంటీబాడీలు దాదాపు వంద రోజులు శరీరంలో ఉంటాయని, ఆ తరవాతా  అవి శరీరంలో నిలిచి ఉండటం గురించి ఇప్పుడే చెప్పలేమని భారత వైద్య పరిశోధన మండలి తేల్చింది. మొత్తానికి- అనేక పరిశోధనల్లో ఇప్పటిదాకా వాడవచ్చని భావించిన మందులు పెద్దగా ప్రభావం చూపకపోవడం, ప్రపంచ జనాభాకంతటికీ టీకాల పంపిణీ సామర్థ్యం ప్రశ్నార్థకమైన వేళ- నివారణ ఒక్కటే పరిష్కారమని చెప్పకతప్పదు.
 

పరిశోధనల్లో వేగం
వైద్య విజ్ఞాన శాస్త్రానికి పూర్తిగా కొత్తదైన కరోనా వైరస్‌పై మొదటి నుంచీ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే మార్గం ఏమిటి అనేది మాత్రమే కాకుండా- నివారణ చర్యలు, వ్యాధి లక్షణాలు, అవయవాలపై దాని ప్రభావం, మరణానికి కారణమవుతున్న విధానంపై సైతం అవగాహన ఏర్పడక అనేక అపోహలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అనేక ప్రశ్నలకు వైద్యరంగం సంతృప్తికరమైన సమాధానాలను రాబట్టగలిగింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వంటి అనేక వైద్యవిద్యా సంస్థలు భారత వైద్య పరిశోధన మండలితో కలిసి పరిశోధనలు చేపట్టడంతోపాటు, చికిత్స విధానాలపై మార్గదర్శకాలు రూపొందించాయి. త్వరితగతిన ఒక చికిత్సా విధానాన్ని ఏర్పరచడంలో ఎన్నో దేశాల వైద్య సంస్థలూ పోటీ పడ్డాయి. తత్ఫలితంగా ఈ ఏడాది ఇప్పటిదాకా అనేక వైద్య సంచికల్లో 34 వేలకుపైగా పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. బహుశా వైద్యశాస్త్ర చరిత్రలో ఇంతకుమున్నెప్పుడూ ఒక వ్యాధిపై ఇంత వేగంగా పరిశోధనలు జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఇదొక మంచి పరిణామమే.

 

Posted Date: 21-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం