• facebook
  • whatsapp
  • telegram

బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 

అమ్మభాషలో సాగే భావ వ్యక్తీకరణ హృదయాలను తాకుతుందని నా విశ్వాసం. సాంఘిక జీవన క్రమంలో, సాంస్కృతికంగా ప్రజలను ఏకం చేయడంలోనూ మాతృభాష కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాచీన కాలంనుంచి భారతదేశం వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయంగా భాసిల్లుతోంది. ఈ భాషా సాంస్కృతిక వైవిధ్యమే ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. నిజానికి మన భాషా వైవిధ్యం ప్రాచీన నాగరికత మూలస్తంభాల్లో ఒకటి. మన దృష్టి, ఆకాంక్షలు, విలువలు, ఆదర్శాలు, సృజనాత్మకతవంటి అనేక అంశాలకు ఓ సానుకూల వ్యక్తీకరణను అందించే సాధనం మాతృభాష అని అనేక సందర్భాల్లో నేను ఉద్ఘాటించాను. ఒక దేశ సాంస్కృతిక, నాగరికతల అభివృద్ధి క్రమంలో తరాల మధ్య భాషలే ప్రధాన వారధులు. ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణతో మన సంస్కృతి, భాషలతో పాటు అనేక మాండలికాలు ప్రభావితమయ్యాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం భారతీయులకు మరింత ప్రత్యేకమైనది, ప్రాముఖ్యం కలిగినది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో 1999 నవంబర్‌లో ఫిబ్రవరి 21వ తేదీని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా యునెస్కో ప్రకటించింది. సభ్యదేశాల భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షించేందుకు యునెస్కో కృషి చేస్తోంది. ‘బహుళ భాషా అభ్యసనానికి సాంకేతికత వినియోగం: సవాళ్లు, అవకాశాలు’ అనేది 2022 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ఇతివృత్తం. బహుళ భాషా అభ్యసనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో సాంకేతికత పాత్రను చర్చించడం ఈ ఇతివృత్తంలోని అంతర్లీన భావన. బహుళ భాషా బోధన, అభ్యసనాన్ని మరింత మెరుగుపరచేందుకు సాంకేతికత వినియోగం కీలకమన్నది ప్రధాన ఆలోచన. ఒకరి మాతృభాష వినియోగంలో పెరుగుదలను అంచనా వేసి, బహుళ భాషావిద్యలో చేర్చడం ఇందులో కీలకాంశం. భారతీయ తరగతి గదులకు దీన్ని వర్తింపజేసినప్పుడు- ప్రాంతీయ, ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఇది నూతన అభ్యసన మార్గాలను సృష్టించింది. మొత్తంగా ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్న ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ దార్శనికతను ప్రతిబింబిస్తుంది.

విద్యార్థుల ఆసక్తి

జాతీయ విద్యావిధానం, 2020- ప్రాథమిక స్థాయిలో కనీసం అయిదో తరగతి వరకు మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రోత్సహించే దార్శనిక పత్రం. అయితే దీన్ని అయిదో తరగతితో ఆపకుండా, కనీసం ఎనిమిదో తరగతి వరకు, ఆపైతరగతులకూ వినియోగించడం ఉత్తమమైన పద్ధతి అనేది నా ఆలోచన. భారతీయ భాషల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిభాషలను రూపొందించడం, మెరుగుపరచడం అత్యంత ఆవశ్యకం. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్‌ సి.వి.రామన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుంది. ‘మన మాతృభాషల్లో విజ్ఞానాన్ని అభ్యసించాలి. లేదంటే విజ్ఞానం కేవలం ప్రత్యేక వర్గాలకు చెందినది మాత్రమే అనే అపోహ మొదలై, విజ్ఞానశాస్త్రం ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. వైద్య, ఇంజినీరింగ్‌ విద్యలో ఉన్నతమైన ఆంగ్ల ఆధారిత విద్యా వ్యవస్థను మాత్రమే మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే సి.వి.రామన్‌ మాటల్లోని అంతర్లీన సందేశం మనకు అవగతమవుతుంది. ఈ తరహా వ్యవస్థతో మన దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఉన్నత విద్యకు మరింత దూరమయ్యారు. అందుకే భిన్న విభాగాల్లో, విభిన్న రంగాల్లో సమర్థమైన బహుళ భాషా విద్యా వ్యవస్థను నిర్మించడం అత్యంత ఆవశ్యకం. 2020 ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్వహించిన ఓ సర్వేలో 83 వేల మంది విద్యార్థుల్లో దాదాపు 44శాతం తమ మాతృభాషలో ఇంజినీరింగ్‌ చదివేందుకు ఆసక్తి చూపుతూ ఓటు వేశారు. సాంకేతిక విద్యలో మాతృభాష అత్యంత కీలకమని ఈ సర్వే చాటి చెప్పింది. ఈ సందర్భంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, గుజరాతీ వంటి ఎనిమిది భారతీయ భాషల్లోకి పలు కోర్సులను అనువదించడానికి ఏఐసీటీఈ, ఐఐటీ-చెన్నై మధ్య సహకారం అభినందనీయం. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా 11 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ విద్యను అనుమతించాలనే ఏఐసీటీఈ నిర్ణయం- తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషలకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విస్తృత అవకాశాలు కల్పించే ఓ చరిత్రాత్మక చర్య.

అన్నింటికీ సమ గౌరవం

అన్ని భాషలకూ సమాన గౌరవం ఇవ్వాలనేది నా ఆకాంక్ష. అయితే కొందరు విద్యావేత్తలు, తల్లిదండ్రుల మనసుల్లో భారతీయ భాషల్లో విద్యను బోధించడం కంటే ఆంగ్లభాష అభ్యసనానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విచారకరమైన ధోరణి పెరిగిపోయింది. ఈ కారణంగా విద్యార్థులు మాతృభాషలో కనీసం ప్రాథమిక విద్యను నేర్చుకొనేందుకూ ముందుకు రావడం లేదు. ఇది ఓ విధమైన సామాజిక- సాంస్కృతిక మూలాధారం లేని స్థితికి దారితీస్తుంది. ఈ విషయంలో ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, ఆంగ్లంలో నైపుణ్యం సాధించడం మాత్రమే మేధాపరమైన ఔన్నత్యానికి కొలమానంగా లేదా జీవితంలో విజయం సాధించడానికి ఆంగ్లం మాత్రమే అవసరమనే అపోహ పిల్లల మనసుల్లో నాటుకుపోయే ప్రమాదం ఉంది. మాతృభాషలు, జాతీయ భాషల్లో విద్య విషయంలో మన విధాన నిర్ణేతలు, తల్లిదండ్రులు, నాయకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఐరోపా దేశాలతో పాటు జపాన్‌, చైనా, కొరియా వంటి దేశాల మాతృభాషల్లో బోధనా విధానాల నుంచి కూడా స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. తరాలుగా సహజీవనం చేస్తూ, పదాలను ఇచ్చిపుచ్చుకుంటూ, పద సంపదను పెంచుకుంటూ అభివృద్ధి చెందుతున్న భాషలు మన వ్యక్తిగత, స్థానిక, జాతీయ గుర్తింపు వంటి అంశాలతో ముడివడి ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లలు దాటి పద సంపదను పెంచుకున్న తెలుగు వంటి అజంత భాషకు సాంకేతికత విప్లవ దన్ను అత్యంత ఆవశ్యకం. అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, సాంకేతికంగా ఊతం ఇవ్వడం ద్వారా మన మాతృభాషలను సగర్వంగా ముందు తరాలకు అందించగలం.

సవాళ్లను అధిగమించాలి

కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూత పడాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు విద్యావేత్తలు, విద్యార్థులు తమను తాము ఆన్‌లైన్‌ విద్యకు అనుగుణంగా మార్చుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యారంగంలో సాంకేతికత పాత్ర తెరమీదకు వచ్చింది. వారాలు, నెలల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ విషయంలో నైపుణ్యాన్ని సాధించగలిగారు. ఇందులో కొత్త సవాళ్లు సైతం లేకపోలేదు. దూరవిద్యా బోధన, అంతర్జాల సదుపాయం, ముఖ్యంగా విభిన్న భాషల్లో అభ్యసన అంశాలు, పాఠ్యాంశాలు వంటి వాటిలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్‌ విద్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన చర్యలు తీసుకుంటున్నా, డిజిటల్‌ అంతరాలు లేకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.

సాంస్కృతిక సంపదలు

నాలుగేళ్ల కిందటి భాషా జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 19,500 భాషలు, మాండలికాలు ఉన్నాయి. వాటిలో 121 భాషలను మన దేశంలో 10 వేలకు మించి ప్రజలు మాట్లాడుతున్నారు. అంతరించి పోతున్న విభాగంలోకి వచ్చే 196 భారతీయ భాషలను పునరుద్ధరించడం మనందరి సమష్టి బాధ్యత. మనవైన విలువలు, సంప్రదాయాలు, కథలు, ప్రవర్తన, నిబంధనలు, సామెతలు, సూక్తుల సమాహారమైన ప్రతి భాషా ఓ సాంస్కృతిక చిహ్నం అనే విషయాన్ని మనం మరవకూడదు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణానికి దెబ్బ

‣ కశ్మీర్‌పై డ్రాగన్‌ వ్యూహాత్మక అడుగులు

‣ ఒకే దేశం... ఒకే రిజిస్ట్రేషన్‌!

‣ ఉత్తరాఖండ్‌లో ఉత్కంఠ పోరు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం