* డిసెంబరులో టెట్ నిర్వహణ తర్వాతే..
* ‘జీరో’ పాఠశాలలను మినహాయిస్తే మిగిలే ఖాళీలు 5 వేలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత డీఎస్సీ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని, 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరుపుతామని.. వాటిని జూన్, డిసెంబరులో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీఓ జారీచేసింది. దాని ప్రకారం డిసెంబరులో టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినా 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
* ఖాళీల లెక్క ఇదీ..
రాష్ట్రంలో ఇటీవల 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. అందులో 10,449 మంది భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించినా పోస్టుల ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడవు. అంటే ఇక మిగిలినవి 9,268 ఖాళీలు మాత్రమే. ప్రస్తుతం 1,739 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ లేరు. వాటిని జీరో స్కూళ్లుగా పిలుస్తారు. వాటిల్లో దాదాపు 2,000 మంది టీచర్లు ఉంటారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలల్లో 400 మంది ఉపాధ్యాయులున్నారు. 6, 7 తరగతుల్లో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు (యూపీఎస్) 600 ఉన్నాయి. వాటిల్లో 2,000 నుంచి 2,400 మంది వరకు ఉపాధ్యాయులున్నారు. ఆ మొత్తం 4,400 నుంచి 4,800 వరకు అవుతాయి. వాటిని మినహాయిస్తే చివరకు 4,400 నుంచి 5,200 వరకు ఉపాధ్యాయ ఖాళీలుంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200-300 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. పనిచేస్తున్నవారు 1.03 లక్షల మంది ఉన్నారు. జులై 18న ప్రారంభమయ్యే డీఎస్సీ ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు రానున్నారు.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.