‣ ఉపాధి.. నైపుణ్యాభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు
‣ కొత్త ఉద్యోగులకు ఒక నెల వేతనం ప్రోత్సాహకం
దిల్లీ: దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో మొత్తం రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. ప్రభుత్వానికి ఉన్న నవ ప్రాధాన్యాల్లో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కీలకమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటికోసం ఐదు పథకాలు, పలు చొరవలను ప్రధానమంత్రి ప్యాకేజిలో అందిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, మధ్యతరగతి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
ప్రధాని ప్యాకేజిలోని స్కీం-ఎలో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరినవారిని ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి, వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. దీన్ని రూ.15 వేల వరకు మూడు వాయిదాల్లో ఇస్తారు. గరిష్ఠంగా నెలకు రూ.లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు. ఇది 2.10 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుస్తుందని అంచనా.
స్కీం-బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరేవారికి, వారి యజమానులకు కూడా తొలి నాలుగేళ్లపాటు నిర్ధారిత వేతన స్కేళ్లలో ఈపీఎఫ్లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. దీనివల్ల 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది.
స్కీం-సిలో ప్రతి కొత్త ఉద్యోగికి ఈపీఎఫ్ఓ వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్ల పాటు నెలకు రూ.3వేల వరకు అందిస్తారు. దీనివల్ల 50 లక్షల ఉద్యోగాలు అదనంగా వస్తాయి.
ఐదేళ్లలో కోటి మందికి ఇంటర్న్షిప్
దేశంలోని అగ్రశ్రేణి 500 సంస్థల్లో ఐదేళ్లలో కోటిమంది యువతకు ఇంటర్న్షిప్ అందిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నెలకు రూ.5వేల ఇంటర్న్షిప్ భృతి ఇస్తామని, ఏకకాల సాయం మరో రూ.6వేలు అందుతుందని తెలిపారు. దీనివల్ల ఏడాదిపాటు పూర్తిస్థాయి వృత్తి నైపుణ్యాలు నేర్చుకోగలరన్నారు. ఆయా కంపెనీలు శిక్షణకు అయ్యే ఖర్చుతో పాటు ఇంటర్న్షిప్ భృతిలో 10 శాతాన్ని సీఎస్ఆర్ నిధుల్లోంచి భరిస్తాయని ఆమె చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వాలంటరీ వర్క్తో ఐటీ ఉద్యోగానికి తోవ!
‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!