• facebook
  • whatsapp
  • telegram

AP Inter: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 59% ఉత్తీర్ణత

* రెండో ఏడాది పరీక్షల ఫలితాలు విడుదల

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 59% ఉత్తీర్ణత  నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,15,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 68,070 మంది పాసయ్యారు. ఈ  ఫలితాలను కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (సీఓఈ) సుబ్బారావు జూన్‌ 18న విడుదల చేశారు. అమ్మాయిల కంటే  అబ్బాయిలు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. 63,595 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా 38,075 (60%), 51,724  మంది అమ్మాయిలు పరీక్ష రాయగా 29,995 (58%) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా ఫలితాలు చూస్తే  పార్వతీపురం మన్యం 84% ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించగా, అల్లూరి సీతారామరాజు 81%, పల్నాడు 74  శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కృష్ణా 46%, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ 44%, పశ్చిమ  గోదావరి 41% ఉత్తీర్ణతతో వరసగా అట్టడుగున ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సుల్లో 11,871 మంది పరీక్షలు రాయగా,  6,798 (57%) మంది పాసయ్యారు. పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణతతో కలిపి ఈ ఏడాది మొత్తం  87% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు పర్యాయాలు కలిపి 4,31,432 మంది పరీక్షలకు హాజరయ్యారు.  మార్చిలో జరిగిన పబ్లిక్‌ పరీక్షల్లో 3,06,528 మంది, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 68,070 మంది కలిపి మొత్తంగా  3,74,598 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఆన్‌లైన్‌ మూల్యాంకనంతో ఆలస్యం

ఈ ఏడాది ప్రయోగాత్మకంగా జవాబు పత్రాలను ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేశారు. ఈ కారణంగానే మూల్యాంకనంతో  పాటు ఫలితాల విడుదలకు సైతం ఐదు రోజులు అదనంగా సమయం పట్టింది. గతంలో మొదటి, రెండో సంవత్సరం  ఫలితాలను ఒకేసారి విడుదల చేసేవారు. ఈసారి మూల్యాంకనంలో ఆలస్యమైనందున తొలుత రెండో ఏడాది ఫలితాలు  మాత్రమే ప్రకటించారు. మొదటి ఏడాది ఫలితాలను ఈనెల 26న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సీఓఈ  సుబ్బారావు తెలిపారు. 
ఆన్‌లైన్‌ మూల్యాంకనం కారణంగా పునర్‌ లెక్కింపు (రీకౌంటింగ్‌) విధానాన్ని తొలగించారు. మార్కుల లెక్కింపును  కంప్యూటర్‌ ద్వారా చేస్తున్నందున పొరపాట్లు ఉండవంటూ ఈ పద్ధతికి   స్వస్తి పలికారు. రీవెరిఫికేషన్‌ ఫీజు గతంలో  ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300 చొప్పున ఉండగా, ఈసారి   రూ.వెయ్యికి తగ్గించారు. జూన్‌ 20 నుంచి 24 వరకు  రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.