• facebook
  • whatsapp
  • telegram

బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

10 తరగతి తర్వాత కోర్సుల వివరాలు

ఇంటర్మీడియట్‌ గ్రూపుల్లో ఎంపీసీ తర్వాత ప్రాధాన్యం బైపీసీకే దక్కుతోంది. వైద్యవృత్తి (అల్లోపతి) లక్ష్యంగా ఎక్కువమంది ఈ గ్రూపులో చేరుతున్నారు. అందువల్ల పోటీ తీవ్రం. దేశంలో ఎక్కడ ఎంబీబీఎస్‌ చదవాలన్నా నీట్‌ స్కోరే ప్రామాణికం. పోటీ ఎక్కువ- సీట్లు తక్కువ కారణంగా ఎక్కువమందికి వైద్యవిద్య అందని ద్రాక్ష అవుతోంది. అయితే ఆసక్తి ఉండాలే కానీ బైపీసీతో మేటి భవిష్యత్తును అందించే ప్రత్యామ్నాయ కోర్సులెన్నో ఉన్నాయి.


ఎంపీసీ విద్యార్థులైతే ఐఐటీ-జేఈఈలో విఫలమైనా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈఏపీ సెట్, డీమ్డ్‌ విద్యా సంస్థల పరీక్షలతో బీటెక్‌ పూర్తిచేసుకోవచ్చు. ఎంబీబీఎస్‌ లక్ష్యంతో బైపీసీలో చేరినవారికి ఇలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దేశం మొత్తానికీ ఎంబీబీఎస్‌ కోసం ఒక్క నీట్‌ స్కోరే ప్రామాణికం. దేశంలో సుమారు 20 లక్షల ఇంజినీరింగ్‌ (బీటెక్‌) సీట్లు ఉన్నాయి. అదే ఎంబీబీఎస్‌లో మాత్రం ఉన్నవి 1.06 లక్షలే. అలాగే నాలుగేళ్ల బీటెక్‌తో మేటి అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ ఒక్క ఎంబీబీఎస్‌తోనే ఉన్నత స్థాయి సాధ్యం కాదు. కనీసం పీజీ, ఇంకా ఆసక్తి ఉంటే సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తిచేయాలి. 


ఎంబీబీఎస్‌లో అవకాశం దక్కనివారికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. బీఏఎంస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సులకు తర్వాతి ప్రాధాన్యం లభిస్తోంది. ఎంబీబీఎస్‌ లక్ష్యంగా పెట్టుకుని, ఇక్కడ అవకాశం దక్కనివారిలో ఎక్కువమంది విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్తున్నారు. మరికొందరు లాంగ్‌ టర్మ్‌ శిక్షణలో చేరుతున్నారు. 


     స్పెషల్‌ బీఎస్సీ   
అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, సెరికల్చర్‌.. మొదలైన విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధితో ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా 70కిపైగా సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌) తరఫున ఎన్‌టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాలి. ఏపీ, తెలంగాణల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తారు. వైద్యవిద్య తర్వాత డిమాండ్‌ ఎక్కువ ఉన్న కోర్సులివే. యూజీ తర్వాత పీజీ, పీహెచ్‌డీలను పూర్తిచేసుకోవచ్చు. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మేటి ఉద్యోగాలు పొందవచ్చు. 


     రెగ్యులర్‌ బీఎస్సీ    
బైపీసీ విద్యార్థులు ప్రాధాన్యమిస్తోన్న చదువుల్లో బీఎస్సీ ముఖ్యమైంది. ఇందులో నచ్చిన మూడు కోర్‌ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఏదైనా ఒక సబ్జెక్టును ఆనర్స్‌ విధానంలో నాలుగేళ్ల వ్యవధితోనూ పూర్తిచేసుకోవచ్చు. ఉన్నత విద్యకూ, బోధన, పరిశోధనల్లో రాణించడానికీ ఈ బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ... తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. తర్వాత వీటిలోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. ఇంటర్‌ మార్కులతో ఏపీ, తెలంగాణల్లో ప్రవేశాలుంటాయి. 


     బీఫార్మసీ   
ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ ఎంచుకోవచ్చు. ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ విద్యార్థులకు కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) సంస్థలు ఫార్మసీలో పీజీ, పీహెచ్‌డీకి పేరొందాయి.    


     ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ   
ఇంటర్‌ బైపీసీ తర్వాత నేరుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఈ కోర్సులు ఉన్నాయి. సీయూసెట్‌ యూజీతో వీటిలో అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌...తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.


     నర్సింగ్‌   
బీఎస్సీ నర్సింగ్‌ ప్రాధాన్యం పెరుగుతోంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఈఏపీసెట్‌/ నీట్‌ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఆ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. నర్సింగ్‌ విద్యపై ఆసక్తి ఉండి, బీఎస్సీ నర్సింగ్‌లో సీటు రానివాళ్లు జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సుల్లో చేరవచ్చు. సుశిక్షితులైన నర్సుల కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. 


     ఫిజియోథెరపీ  
బైపీసీ గ్రూపువాళ్లు పరిగణించాల్సిన కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. దీన్ని పూర్తిచేసుకున్నవారి ఉపాధికి ఢోకా లేదు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 50 కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేక సంస్థలూ ఉన్నాయి. అలాగే ఎయిమ్స్‌తోపాటు పేరున్న సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఫిజియో చదువుకోవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌/ ఈఏపీసెట్‌/నీట్‌ స్కోరు లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటారు. బీపీటీ పూర్తిచేసుకున్నవారు ఎంపీటీలో చేరవచ్చు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్‌ దిశగా అడుగులేయవచ్చు. 


     పారా మెడికల్‌   
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారా మెడికల్‌ కోర్సులు దారిచూపుతాయి. వీరు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో సేవలు అందించవచ్చు. యూజీ స్థాయిలో.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ), అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, స్లీప్‌ లేబొరేటరీ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్‌ టెక్నాలజీ, ఆర్థోపెడిక్స్‌ టెక్నాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ తదితర బ్యాచిలర్‌ కోర్సులవైపు దృష్టి సారించవచ్చు. కోర్సులను బట్టి వీటి వ్యవధి.. మూడేళ్లు, మూడున్నర, నాలుగేళ్ల్లుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ వివిధ కేంద్రాలతోపాటు పలు ఇతర సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పలు సంస్థల్లో వీటిని చదువుకోవచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం పారామెడికల్‌ శిక్షణ అందిస్తున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాలలు ఒకేషనల్‌ విద్యలో భాగంగా ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ ఎన్నో పారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. రాష్ట్రాల పారా మెడికల్‌ బోర్డుల ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో సీట్లు కేటాయిస్తారు.   


     ఇతర చదువులు   
బైపీసీ నేపథ్యంతో కాకుండా ఇతర కోర్సుల్లో చేరాలనుకునేవారికి వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు వివిధ సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్‌తో ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల్లో న్యాయవిద్య అభ్యసించవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్, లిబరల్‌ స్టడీస్, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు.. ఇలా ఎవరికి వారు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు.


     బీఎస్‌-ఎంఎస్‌   
ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా పొందవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో నడుపుతున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ నీట్‌ స్కోర్‌తో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీవైపు దృష్టి సారించవచ్చు. 


     ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌   
బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు వైపు అడుగులేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తి చేసుకుని ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించనివారు రెండేళ్ల డీఎడ్‌ కోర్సుల్లో చేరవచ్చు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Posted Date: 14-06-2024


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌