• facebook
  • whatsapp
  • telegram

అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

క్వాడ్‌ లక్ష్యంగా సాలమన్‌ దీవులతో ఒప్పందం

దక్షిణ చైనా సముద్రంలో దుందుడుకు చర్యలతో పొరుగునున్న చిన్న దేశాలపై డ్రాగన్‌ ఇప్పటికే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇటీవల తన దూకుడును, కుటిల దౌత్య నీతిని సుదూర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా తనకు దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలమన్‌ దీవులతో గత నెలలో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకొంది. తద్వారా అమెరికా, ఆస్ట్రేలియాలకు సరికొత్త సవాలు విసిరింది. ఈ ఒప్పందంపై అగ్రరాజ్యం తీవ్రంగా మండిపడుతుండగా, చైనా ఉద్దేశపూర్వకంగా తన ప్రయోజనాలను దెబ్బతీసేందుకే పొరుగు దేశాన్ని మచ్చిక చేసుకుంటోందని ఆస్ట్రేలియా భయపడుతోంది. సాలమన్‌ దీవుల్లో సాయుధ తిరుగుబాటుదారులపై పోరులో అక్కడి ప్రభుత్వానికి ఆస్ట్రేలియా ఎప్పటినుంచో సహాయం అందిస్తోంది. తాజా ఒప్పందంతో ఆ బాధ్యతను ఒడిసిపట్టి స్వప్రయోజనాలను సాధించే అవకాశం చైనాకు దక్కింది. పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు ఒక వేదికా దొరికినట్లయింది.

ఆస్ట్రేలియాపై దృష్టి

సాలమన్‌ దీవుల్లోని ప్రజల భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర మానవీయ సాయంపై ఒప్పందం కుదిరినట్లు చైనా వెల్లడించింది. ఆ దీవులు స్వీయరక్షణ సామర్థ్యం పెంచుకొనేలా సహకరిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందం పేరిట సాలమన్‌ దీవుల్లో చైనా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే, ఇప్పటిదాకా దక్షిణ చైనా సముద్రంలోనే నెలకొన్న సైనిక ఆధిపత్య జగడం పసిఫిక్‌ మహాసముద్రానికీ విస్తరిస్తుంది. తాజా ఒప్పందంలో భాగంగా చైనా తన యుద్ధ నౌకలను సాలమన్‌ దీవులకు పంపే వీలుంది. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంలో సైనిక స్థావరం ఏర్పాటు అంశం లేదని సాలమన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందాన్ని అమెరికా మిత్రదేశాలైన న్యూజిలాండ్‌, జపాన్‌ సైతం ఖండించాయి.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా విస్తరణను నిలువరించేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లతో ఏర్పాటైన ‘క్వాడ్‌’ కూటమిని సవాలు చేయడమే చైనా ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో క్వాడ్‌ దేశాల ప్రయోజనాలను భంగపరచే ఏ చిన్న అవకాశాన్నీ డ్రాగన్‌ వదులుకోవడం లేదు. ఇప్పటికే భారత్‌కు అన్నివైపులా తన నిఘా వ్యవస్థను చైనా ఏర్పాటు చేసుకుంటోంది. హిందూ మహాసముద్రంలో తన నౌకల రక్షణ పేరిట ఆఫ్రికాలోని జిబూటీలో ప్రజా విమోచన సైన్యం స్థావరాన్ని నిర్వహిస్తోంది. మయన్మార్‌లోని గ్రేట్‌ కోకో దీవుల్లో నౌకా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు డ్రాగన్‌ దృష్టి ఆస్ట్రేలియాపై పడింది. టోక్యోలో ఈనెల 24న క్వాడ్‌ దేశాధినేతల సమావేశం జరగనుంది. అంతకుముందే 21న ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సాలమన్‌ దీవుల అంశమూ ఈ ఎన్నికల్లో ప్రచారాంశంగా మారింది. చైనా సైనిక స్థావరం ఏర్పాటుకు సాలమన్‌ ఐలాండ్స్‌ అనుమతిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ హెచ్చరిస్తున్నారు. మరో దేశ అంతర్గత వ్యవహారాలను నిర్దేశించే అధికారం ఆస్ట్రేలియాకు లేదని డ్రాగన్‌ సైతం వాదిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఈ నెలాఖరులో సాలమన్‌ దీవుల పర్యటనకు వెళ్తున్నారన్న కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో క్వాడ్‌ సమావేశంలో చైనా-సాలమన్‌ దీవుల ఒప్పందాన్ని ఖండించేలా ఆస్ట్రేలియా ఒత్తిడి చేయవచ్చు.

వ్యూహాత్మక చక్రబంధం

నైరుతి పసిఫిక్‌లోని సాలమన్‌ దీవుల సముదాయం- జాతుల కలహాలతో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది. పొరుగునే ఉన్న ఆస్ట్రేలియా ఆ దీవుల అభివృద్ధి, అవసరాలతో తనకు సంబంధం లేదనట్లుగా వ్యవహరిస్తోంది. మొక్కుబడిగా మానవతా సహాయం అందిస్తోంది. ఇప్పుడు చైనా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆస్ట్రేలియా ఉలిక్కిపడింది. తనకు వ్యతిరేకంగా ఉన్న శక్తిమంతమైన దేశాలను చైనా ఓ వ్యూహం ప్రకారం చక్రబంధంలో బంధించాలని చూస్తోంది. అందుకోసం అవి నిర్లక్ష్యం చేసిన పొరుగు దేశాలకు ఆర్థిక, రక్షణ సహకార ఒప్పందాల పేరిట ఎర వేస్తోంది. అమెరికా నిర్లక్ష్యం చేసిన వెనెజువెలాతో, భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌, శ్రీలంక, నేపాల్‌లతో గతంలో అలాగే ఒప్పందాలు కుదుర్చుకొంది. డ్రాగన్‌తో ఒప్పందంపై సాలమన్‌ దీవులను బుజ్జగించేందుకు అమెరికా, ఆస్ట్రేలియాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు. దేశ అంతర్గత భద్రత కోసం తాజా ఒప్పందం అవసరమని సాలమన్‌ దీవుల ప్రధాని మనాసే సొగవారే సమర్థిస్తున్నారు. ఫలితంగా అమెరికా తన నౌకల కదలికలను ఓషియానియా ప్రాంతంలో పెంచి, చైనా యుద్ధనౌకలు ఈ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకలు క్రమం తప్పకుండా గస్తీ కాస్తున్నాయి. తద్వారా వియత్నాం, ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌ సహా ఆరు దేశాలకు దక్షిణ చైనా సముద్రంపై హక్కులున్నాయనే వాదనకు అగ్రరాజ్యం అండగా నిలుస్తోంది. సాలమన్‌ దీవులు-చైనా ఒప్పందం పుణ్యమా అని నైరుతి పసిఫిక్‌ సముద్రంలోనూ అవే పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

‣ సాగు బాగుకు సేంద్రియ మార్గం

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Posted Date: 20-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం