• facebook
  • whatsapp
  • telegram

సముద్ర సహకారంలో చెట్టపట్టాల్‌!

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ ఆల్బనీస్‌ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. భారత్‌తో వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడంతో పాటు కీలక రంగాల్లో బలీయ బంధం ఏర్పరచుకోవడంపై ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా హిందూ-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇరు దేశాలు సమన్వయంతో ముందుకు సాగడం అత్యావశ్యకం.

ఇండో-పసిఫిక్‌ జలాల్లో భారత్‌, ఆస్ట్రేలియాల వ్యూహ ప్రాధాన్యాలు ఒక్కటే. ఆ ప్రాంతంలో భావసారూప్యత కలిగిన ఇతర దేశాలతో సహకారాన్ని అవి వృద్ధి చేసుకుంటున్నాయి. సముద్రాల్లో సంయుక్తంగా భద్రతా కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిరతను కాపాడటం ఉభయ దేశాలకూ అత్యావశ్యకం. అక్కడ బలాబలాల సమతూకాన్ని కాపాడటానికి ఇండియా, ఆస్ట్రేలియాలు చేయీచేయీ కలిపి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు, సముద్ర దొంగలు, మాదక ద్రవ్య ముఠాల కార్యకలాపాలను అరికట్టడానికి రెండు దేశాలూ నిరంతరం నిఘా వేస్తుండాలి. మానవులు, ఆయుధాల అక్రమ రవాణా, అక్రమ వలసదారులను నిరోధించాలి. సముద్రంలో మత్స్య వనరుల అక్రమ వేటను అడ్డుకోవాలి. ఈ కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. పర్యావరణానికి విధ్వంసకరం. వాటిని కలిసికట్టుగా నిరోధించడం భారత్‌, ఆస్ట్రేలియాలకు తప్పనిసరి. మానవుల వల్ల సముద్రాల్లో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్ర జలాల్లో ఆమ్ల శాతం ఎక్కువ కావడం, తుపానులు, సునామీల వల్ల మనుషులు ఆవాసం కోల్పోవడం, భూగర్భ జలాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం వంటి సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి భారత్‌, ఆస్ట్రేలియాలు సమన్వయంతో పనిచేయాలి.

ఉమ్మడి సైనిక విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని బీజింగ్‌ దబాయిస్తోంది. అక్కడి దీవులను ఆక్రమించడమే కాకుండా, కృత్రిమంగా కొత్త దీవులను ఏర్పాటు చేస్తోంది. వాటిపై సైనిక స్థావరాలను నిర్మిస్తోంది. ఇతర దేశాల నౌకలు, విమానాలు అక్కడ తిరగకూడదని హుకుం జారీ చేస్తోంది. తన ఆగడాలకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఆర్థికంగా, దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోంది. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి భారత్‌, ఆస్ట్రేలియాలు ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛా మండలంగా కాపాడాలని నిశ్చయించాయి. అది వాటి విదేశాంగ విధానంలో ముఖ్య భాగమైంది.

వాణిజ్యం, ఆర్థికం, రక్షణ రీత్యా ఇండో-పసిఫిక్‌ ప్రాంతం ఆస్ట్రేలియాకు ఆయువుపట్టు వంటిది. అందువల్ల చైనా దుందుడుకు వైఖరి, ఏకపక్ష విధానాలు, విస్తరణ కాంక్ష ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ పసిఫిక్‌లోని సాలమన్‌ దీవులతో ఇటీవల చైనా భద్రతా ఒప్పందం కుదుర్చుకోవడం కాన్‌బెర్రా ఆందోళనను పెంచింది. తన పొరుగు జలాల్లో చైనా కార్యకలాపాలు ఉద్ధృతం కావడాన్ని పక్కలో బల్లెంగా ఆస్ట్రేలియా పరిగణిస్తోంది.

సముద్ర జలాల్లో నిఘాకు భారత్‌, ఆస్ట్రేలియాలు పి-81 విమానాలను ఉపయోగిస్తున్నాయి. సీ-130, సీ-17 రవాణా విమానాలు, ఆల్ఫా రొమేయో హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. ఈ విమానాలు సేకరించే సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నాయి. గురుగ్రామ్‌లో ఏర్పాటు చేసిన సమాచార సమ్మేళన కేంద్రంలో ఒక ఆస్ట్రేలియా రక్షణాధికారి ఉభయ దేశాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 2020లో ఆపరేషన్‌ మలబార్‌ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొన్నప్పటి నుంచి రెండు దేశాల నౌకా దళాల మధ్య సమన్వయం పెరుగుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా నౌకాదళాలు రెండేళ్లకోసారి ఆస్‌ఇండెక్స్‌ పేరిట విన్యాసాలు జరుపుతున్నాయి. ఇండో-పసిఫిక్‌ విన్యాసాల్లోనూ పాల్గొన్నాయి. 2022లో అమెరికా ఆధ్వర్యంలో 26 దేశాలతో జరిగిన ద్వైపాక్షిక రింపాక్‌ విన్యాసాల్లోనూ భారత్‌, ఆస్ట్రేలియా నౌకాదళాలు పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది టలిస్మన్‌ సేబర్‌ పేరుతో తాను నిర్వహించే అతి పెద్ద నౌకాదళ విన్యాసాల్లో అమెరికా, ఇతర దేశాలతోపాటు ఇండియా సైతం పాల్గొనాలని ఆస్ట్రేలియా ఆహ్వానించింది. రెండు దేశాలు కలిసి ఇప్పటిదాకా 10 ద్వైపాక్షిక, 17 బహుళపక్ష యుద్ధ అభ్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా నౌకాదళాలు ఆపరేషన్‌ మలబార్‌ విన్యాసాలను, వాయు సేనలు ఆపరేషన్‌ పిచ్‌బ్లాక్‌, సైన్యం ఆస్ట్రాహింద్‌  పేరిట విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఇంకా క్వాడ్‌, ఇండియా-ఆస్ట్రేలియా-ఇండొనేసియా, జపాన్‌-ఇండియా-ఆస్ట్రేలియా త్రైపాక్షిక కూటముల్లోనూ భాగస్వాములుగా ఉన్నాయి. హిందూమహాసముద్ర తీర దేశాల సంఘం, హిందూ మహాసముద్ర నౌకాదళ గోష్ఠి, ఆసియాన్‌ సంఘం ద్వారా ఇతర దేశాలను కలుపుకొనిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్రీలంక, మాల్దీవులు, ఫిజీ, పపువా న్యూగినియా వంటి దేశాలనూ ఉమ్మడి రక్షణ ఛత్రం కిందకు తీసుకురావాలి.

అంతర్జాతీయ నియమాల ఉల్లంఘన

ఇండో-పసిఫిక్‌ ప్రాంతమంతా తనదేనన్నట్లు విర్రవీగుతున్న చైనాకు చెక్‌ పెట్టడానికి భారత్‌-ఆస్ట్రేలియా వ్యూహ మైత్రి కీలకమవుతుంది. ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, సముద్ర జలాల వినియోగంపై సమితి సూత్రాలను చైనా ఖాతరు చేయడం లేదు. ఇలాంటి అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూ మెలగడానికి చైనా ససేమిరా అంటోంది. డ్రాగన్‌ సహా అన్ని దేశాలు అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా నడచుకొనేలా చూడటానికి అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలు క్వాడ్‌ కూటమి ఛత్రం కింద కార్యకలాపాలు చేపట్టాయి. వాటిని మరింత ముమ్మరం చేయాలి. ఇండో-పసిఫిక్‌లో మున్ముందు ఎదురయ్యే సవాళ్లను గుర్తించి వాటిని దీటుగా అధిగమించడానికి భారత్‌, ఆస్ట్రేలియాలు చేతులు కలపాలి.

కీలక సమాచార మార్పిడి

ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించిన ఇండో-పసిఫిక్‌ కార్యాచరణ పథకం భారత్‌, ఆస్ట్రేలియా వ్యూహ మైత్రికి ప్రాతిపదిక అయ్యింది. 2020లో ఇండో పసిఫిక్‌లో పరస్పర సహకారంపై సంయుక్త ప్రకటన విడుదలైంది. తరవాత ఒకరి స్థావరాలు, రేవులను మరొకరు వినియోగించుకొంటూ మరమ్మతులు చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య రక్షణ పరమైన పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాల కోసం శాస్త్రసాంకేతిక సహకార ఒడంబడికా కుదిరింది. ఇండో-పసిఫిక్‌లో రవాణా, రక్షణ కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకొంటున్నాయి. ఇరు దేశాలూ కలిసి యుద్ధ అభ్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఏటా రెండు దేశాల అధికారులు పరస్పరం పర్యటనలు జరిపి సంబంధాలను వృద్ధి చేసుకుంటున్నారు. ఒకరి పని విధానాన్ని మరొకరు తెలుసుకుంటున్నారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు

‣ మహిళా కేంద్రిత అభివృద్ధి అజెండా

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

‣ బ్రిక్స్‌ విస్తరణకు డ్రాగన్‌ ఆరాటం

‣ దయనీయ స్థితిలో దాయాది

‣ ఈసారైనా జనగణన చేపడతారా?

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం