* 2,674 పోస్టులకు ప్రకటన ఇస్తే.. చేరింది 1,600 మందే
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో ప్రాంతీయ కార్యాలయాలు, క్షేత్రస్థాయి ఉద్యోగాల భర్తీ కోసం సంస్థ అనుసరిస్తున్న విధానంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ప్రాంతీయ ఉద్యోగ ప్రకటనలను పక్కనపెట్టి, కేంద్రీకృత ఉద్యోగ ప్రకటన జారీచేయడంతో అందులో సగం పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. సంస్థ ఇటీవల చేపట్టిన 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్ఎస్ఏ) పోస్టులకు ఎంపికైన వారిలో సగం మంది కూడా విధుల్లో చేరకపోవడమే దానికి నిదర్శనం. దీంతో ఆయా పోస్టులన్నీ ప్రస్తుతం బ్యాక్లాగ్ కిందకు మారుతున్నాయి. సంస్థలో విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందనే అభిప్రాయంతో పాటు స్థానికేతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువత సంసిద్ధత వ్యక్తం చేయకపోవడమే పరిస్థితికి కారణమని ఈపీఎఫ్వో వర్గాలు చెబుతున్నాయి.
* అసంబద్ధ నిర్ణయంతో మళ్లీ మొదటికి
గతంలో క్షేత్రస్థాయి ఉద్యోగాలైన ఎస్ఎస్ఏ, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల (ఈవో) పోస్టులు రాష్ట్రాల పరిధిలో ప్రాంతీయ ఉద్యోగ ప్రకటన కింద భర్తీ అయ్యేవి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాంతీయ ప్రకటనల ద్వారా భర్తీ చేయడంతో తెలుగు మాట్లాడే యువతీ, యువకులు ఉద్యోగాలకు ఎంపికై పని చేసేవారు. గతేడాది నుంచి ప్రాంతీయ ప్రకటనలతో కాకుండా కేంద్రీకృత ప్రకటన కింద ఉద్యోగాలు భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆ మేరకు వెలువడిన ప్రకటన ప్రకారం ఉద్యోగాల కోసం 2,674 మంది ఎంపికైనప్పటికీ, దాదాపు 1600 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు సమాచారం. ‘స్థానికేతర రాష్ట్రాల్లో పోస్టింగులు ఇచ్చిన నేపథ్యంలో అంతంత దూరం వెళ్లేందుకు ఇష్టపడని వారు ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని, ఈవో పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని’ ఈపీఎఫ్వో వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ పాత విధానంలో ప్రాంతీయ ఉద్యోగ ప్రకటనల జారీతో బ్యాక్లాగ్ సమస్యల్ని అధిగమించడంతోపాటు స్థానికులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.