• facebook
  • whatsapp
  • telegram

Education: విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?

డిగ్రీ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం


 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: డిగ్రీ.. అనేది అనేక పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు గీటురాయి. ఎంతోమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమవుతుంటారు. ఏడాదంతా చదివి పరీక్ష రాసి ఫెయిలైతే ఆందోళన చెందుతారు. ఆత్మన్యూనత భావనకూ గురవుతారు. కచ్చితంగా పాసవుతామని నమ్మకం ఉన్నవారు పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులవుతున్నారు.. సాధారణంగా ఈ శాతం తక్కువగా ఉండాలి.. కానీ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పునః మూల్యాంకనం ఉత్తీర్ణత శాతం చూస్తే మూల్యాంకనం సరిగా చేస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పునః మూల్యాంకనంలో 25 నుంచి 50 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే అందుకు కారణం...


మూడేళ్లలో వివరాలు..

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో 15 ప్రభుత్వ, 86 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఏటా 20 వేల మందికిపైగా విద్యార్థులు వీటిలో అభ్యసిస్తుంటారు. పీజీ విద్యార్థులకు పునఃమూల్యాంకనానికి అవకాశం లేదు. కేవలం డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. డిగ్రీ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంపై ‘న్యూస్‌టుడే’ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

2020-21 ఏడాదిలో 15,712 మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాశారు. వీరిలో 4,674 సబ్జెక్టులకు పునఃమూల్యాంకనానికి ఫీజు కట్టారు. ఇందులో 1,098 సబ్జెక్టులు పాసయ్యారు. ఫీజు చెల్లించని వాటిలో 23.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.

2021-22లో 15,244 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2523 సబ్జెక్టులకు రీవాల్యూయేషన్‌ ఫీజు చెల్లించారు. ఇందులో 1281 సబ్జెకులు ఉత్తీర్ణత సాధించారు. ఫీజు చెల్లించని వాటిలో 50.77 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

2022-23లో 18,862 మంది పరీక్షలు రాశారు. వీరిలో 13,054 సబ్జెక్టులకు పునఃమూల్యాంకనానికి ఫీజు కట్టారు. ఇందులో 5619 సబ్జెక్టులు పాసయ్యారు. ఫీజు చెల్లించని వాటిలో 43.04 శాతం ఉత్తీర్ణత సాధించారు.

2021-22 విద్యాసంత్సరంలో రీవాల్యూయేషన్‌ అర్జీలు పెట్టుకున్న వారిలో సగానికిపైగా ఉత్తీర్ణత సాధించడంతో.. పరీక్షల్లో ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకొని పాస్‌ కావచ్చనే అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది. దీంతో తర్వాత సంవత్సరం అధిక మంది అర్జీ పెట్టుకున్నారు. వారు చెల్లించిన ఫీజులన్నీ విశ్వవిద్యాలయం ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నాయి.


రూ.31.99 లక్షల ఫీజు కోల్పోయిన విద్యార్థులు 

మూడేళ్లలో మొత్తం 20,251 సబ్జెక్టులకు ఒక్కో దానికి రూ.400 చొప్పున ఫీజు చెల్లించారు. ఈ లెక్కన రూ.81,00,400 యూనివర్సిటీకి చెల్లించారు. ఇందులో 7998 సబ్జెక్టులు పునఃమూల్యాంకనంలో పాసయ్యారు. అంటే వారు ముందే ఉత్తీర్ణత సాధిస్తే.. రూ.31.99 లక్షలు విద్యార్థులు నష్టపోయేవారుకాదు. ముందు పేపర్‌ దిద్దిన వారు సక్రమంగా మూల్యాంకనం చేస్తే వారికి ఆందోళన తప్పేది. 


ఇది సాధారణమే..

ఒక అధ్యాపకుడికి ఓ జవాబు సరైనది అనిపిస్తే.. మరో అధ్యాపకుడు తప్పుగా భావించవచ్చు. ఇది సాధారణమే. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న రీవాల్యుయేషన్‌ ఫీజు తరహాలోనే శాతవాహన విశ్వవిద్యాలయంలో వసూలు చేస్తున్నాం.

- డా.ఎన్‌వీ.శ్రీరంగప్రసాద్, శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.