• facebook
  • whatsapp
  • telegram

Education: నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం : సీఎం రేవంత్‌రెడ్డి

* రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలకు కొత్తరూపు

* ఉపాధికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే వారికీ ఇక్కడ శిక్షణ ఇస్తాం

* మన చదువులు అవుటాఫ్‌ సిలబస్‌గా మారిపోయాయి - ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* నాలుగు అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్లకు శంకుస్థాపన
 


ఈనాడు, హైదరాబాద్‌: ‘‘సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్‌ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలన్న  లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. పదో తరగతి చదివి ఉపాధి  కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లాలనుకునే వారినీ ఐటీఐల్లో చేర్పించుకుని.. అక్కడ ఏయే సంస్థలు, రంగాల్లో ఉపాధి  అవకాశాలున్నాయో తెలుసుకుని వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా  ఉన్న ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలు (అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ సెంటర్స్‌)గా రూపొందిస్తున్న సందర్భంగా జూన్‌  18న హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో నిర్వహించిన నాలుగు కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభుత్వం  తీసుకుంటుంది. అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దౌత్యపరంగా సంప్రదింపులు నిర్వహించి న్యాయం  చేస్తుంది. ప్రస్తుతం పదోతరగతి చదవకుండానే ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ కష్టాలు  పడుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎవరూ ఎదుర్కోకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత పోటీ  ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. సాంకేతిక నైపుణ్యం ఉండాలి. విశ్వవ్యాప్తంగా  విద్యాబోధనలో అత్యాధునిక మార్పులుసంతరించుకుంటుంటే.. మనం మాత్రం 40, 50 ఏళ్ల క్రితం ఉన్న విధానాలు  అనుసరిస్తూ అప్పటి విద్యను బోధిస్తున్నాం. దీంతో మన చదువులు అవుటాఫ్‌ సిలబస్‌గా మారిపోయాయి. ఇంటర్‌  చదవలేనివారు ఐటీఐలో చేరితే కొంతైనా విజ్ఞానం వస్తుందన్న భావనతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇందులో  చేర్పిస్తున్నారు. ఐటీఐలను  అధునాతన విజ్ఞాన కేంద్రాలుగా మార్చాక వాటిల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడతారు’’  అని సీఎం చెప్పారు. 

ఐటీఐలలో వర్చువల్‌ రియాల్టీ ప్రయోగశాలలు: మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలలో వర్చువల్‌ రియాల్టీ ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐటీశాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా  మారనున్నాయని ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. రోబోటిక్స్,  కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాల్టీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించనున్నామని  వివరించారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో నైపుణ్యాభివృద్ధి  విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధి సుశీల్‌ కుమార్, కార్మికశాఖ  ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రాణికుముదిని, కార్మికశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి,  రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్, ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్, కాంగ్రెస్‌  నేత ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.